తెలంగాణ సీఎస్ పై హైకోర్టు ఆగ్రహం

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాము ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ ను తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈరోజు సోమేష్‌ కుమార్‌ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏ ఒక్కటి అమలు కాలేదని, తమ ఆదేశాలు ఎందుకు అమలు కావడం లేదని సీఎస్ ను ప్రశ్నించింది. కరోనాపై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్వహరిస్తున్నారని ప్రశ్నించింది.

 

ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను డబ్బుకోసం పీడిస్తున్నాయని.. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎస్‌ ను ఉద్దేశించి హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పటి వరకు 50 మందికి నోటీసులు ఇచ్చామని సోమేష్‌ కుమార్‌ తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల లైసెన్స్‌ రద్దు చేశామని చెప్పారు. దీంతో మిగిలిన ఆసుపత్రుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.