రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం అభ్యంతరం.. కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తామంటూ హెచ్చరిక
posted on Apr 2, 2025 5:03PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసు సుప్రీంలో విచారణలో ఉండగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై సుప్రీం కోర్టు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే వాటిని పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అపహాస్యం చేసే వ్యాఖ్యలుగానే భావించాల్సి ఉంటుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్లపై బుధవారం (ఏప్రిల్ 2) విచారించిన సుప్రీం కోర్టు ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టింది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించేలా పది మంది బీఆర్ఎస్ సభ్యులు తమ పార్టీని వదిలి అధికార కాంగ్రెస్ లో చేరారన్నది బీఆర్ఎస్ వాదన. దీనిపై స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా, ఆయన సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని బదులిచ్చారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లంటిపై విచారణ చేపట్టిన కోర్టు ఇప్పటికే పలు దఫాలుగా విచారించింది. తాజాగా బుధవారం విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది పార్టీలు మారిన ఎమ్మెల్యేల స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే సమస్యే లేదని ఇటీవలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో రేవంత్ వ్యాఖ్య వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే… పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయన అపహాస్యం చేసినట్టేనని కోర్టు వ్యాఖ్యానించింది. రేవంత్ వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అంతటితో ఆగని కోర్టు… తెలంగాణ సర్కారు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తీరుపైనా ఒకింత అసహనం వ్యక్తం చేసింది.