తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్.. చంచలగూడ జైలుకు తరలింపు..
posted on Aug 28, 2021 12:55PM
.jpg)
అర్థరాత్రి అరెస్ట్ అయిన తీన్మార్ మల్లన్నను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మల్లన్నకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఐపీసీ 306, 511 సెక్షన్స్ పెట్టడంపై తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది ఉమేశ్ చంద్ర అభ్యంతరం తెలిపారు. పిర్యాదుదారుడు ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయం పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. చిలకలగూడా పోలీసులు 7 రోజుల పాటు కస్టడీ కోరారు. ప్రస్తుతం మల్లన్నను చంచల్ గూడ జైల్కి తరలించారు.
డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడంటూ కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైట్పై గతంలోనే కేసు నమోదు చేయగా.. పలుమార్లు స్టేషన్కి పిలిపించి విచారించారు. తాజాగా ఆయనకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంతో పాట మల్లన్న ఇంటిపై పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. శుక్రవారం అర్థరాత్రి మలన్నను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్పై సైబర్క్రైమ్ స్టేషన్లో రెండు కేసులు, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్ పీఎస్లలో ఒక్కో కేసు నమోదై ఉంది. పలు కేసుల్లో పదే పదే ఆయన్ను పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తూ విచారించడంపై ఆయన ఇటీవల హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తనను పోలీసులు విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ జాతీయ బీసీ కమిషన్కు కూడా కంప్లైంట్ చేశారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం అర్థరాత్రి పోలీసులు ఆయన్ను సడెన్గా అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.