మానవత్వం మరిచిపోయి గర్భంతో ఉన్న ఏనుగు చావుకు కారణమయ్యారు
posted on Jun 3, 2020 5:50PM
కేరళ మలప్పురం దగ్గర్లోని ఓ గ్రామంలో కొందరు ఆకతాయిలు అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. మానవత్వం మరిచిపోయి గర్భంతో ఉన్న ఓ ఏనుగు చావుకు కారణమయ్యారు. ఆకలితో ఉన్న ఓ జంతువుకు ఆహారం ఆశచూపి.. దాని ప్రాణాలు తీశారు.
గర్భంతో ఉన్న ఓ ఏనుగుతో సైలెంట్ వ్యాలీ వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్ ఆశచూపారు. ఆ పైనాపిల్లో పేలుడు పదార్థాలు పెట్టారు. ఇది ఏమాత్రం తెలియని గజరాజు తినేసింది. దీంతో ఆ పండు భారీ చప్పుడుతో పేలింది. ఆ మూగజీవి నోటివెంట రక్తం ధారగా కారింది. ఇంత జరిగినా ఎవరికీ అపకారం చేయకుండా.. బాధతో విలవిల్లాడిపోతూ.. రక్తమోడుతున్న నోటితో గ్రామం వదిలి వెళ్లిపోయింది.
ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటంతో ఆకలి.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏమి చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్ నదిలోకి దిగి గొంతు తడుపుకుంది. విషయం తెలుసుకొన్న అటవీశాఖ సిబ్బంది మరో రెండు ఏనుగులను తీసుకొచ్చి దానిని బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. కానీ, గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి మే 27వ తేదీ సాయంత్రం 4గంటలకు తుదిశ్వాస విడిచింది. చనిపోయిన ఏనుగును బయటకు తీసుకొచ్చి దానిని పరీక్షించగా అది గర్భంతో ఉందని వైద్యులు తెలిపారు. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు. హృదయ విదారకమైన ఈ ఘటనను మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఏనుగు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, అచ్చు ఇలాంటి సంఘటనే కొల్లాంలో కూడా సంభవించిందని అటవీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో ఒక ఆడ ఏనుగును కూడా ఇలా పైనాపిల్ బాంబుతోనే చంపేశారని వారు వెల్లడించారు.