పాకిస్థాన్ లో నరేంద్ర మోడీ ఫ్లకార్డులు ! ప్రత్యేక సింధ్ దేశం కోరుతూ ర్యాలీలు

పాకిస్థాన్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్లకార్జులతో ర్యాలీలు.. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా...  భారత్ అంటేనే భగ్గునమండే దాయాది దేశంలో మన ప్రధాని ఫోటోలు ప్రదర్శించడం ఏంటనీ షాకవుతున్నారు.. అయితే ఇది అక్షరాల నిజం. ఎన్నో దశాబ్దాలుగా ప్రత్యేక సింధ్ దేశం కోసం పోరాడుతున్న సింధ్ ప్రావిన్స్ ప్రజలు సాన్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమకు పాకిస్థాన్ నుంచి విముక్తిని కల్పించి సింధ్ పేరిట ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింధీ నేషనలిజం వ్యవస్థాపకుల్లో ఒకరైన జీఎం సయ్యద్ 117వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలు, ఫ్లకార్డులు ప్రదర్శించారు సింధ్ ప్రజలు. నరేంద్ర మోడీతో పాటు పలువురు ఇతర దేశాల నేతలను ఉద్దేశిస్తూ..  పాక్ అరాచకాల నుంచి తమను కాపాడాలని నిరసనకారులు నినాదాలు చేశారు. 

ప్రస్తుతం పాకిస్థాన్ దేశం పరిధిలో ఉన్న  సింధూలోయలో శతాబ్దాల క్రితమే నాగరికత వెల్లివిరిసింది. ఈ ప్రాంతాన్ని తొలుత బ్రిటీషర్లు ఆక్రమించారు. అప్పటి నుంచి సింధ్ ప్రాంత ప్రజలపై వివక్ష మొదలైంది. ప్రత్యేక సింధ్ దేశం కోసం రాజకీయ పార్టీలు కూడా ప్రారంభమై, తమకు అవకాశం వచ్చినప్పుడల్లా, పాక్ పాలకుల దురాగతాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ నుంచి తమను వేరు చేయాలంటూ 1967లో ఈ ఉద్యమం ప్రారంభం కాగా, ఎప్పటికప్పుడు పాక్ ప్రభుత్వం వారిని అణచివేస్తూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది జాతీయవాద నేతలు, విద్యార్థులు, సింధ్ ప్రాంత రాజకీయ పార్టీల కార్యకర్తలు కనిపించకుండా పోయారు. వీరందరినీ పాకిస్థాన్  సైన్యమే అపహరించి, చిత్ర హింసలు పెట్టి చంపేసిందని సింధ్ ప్రాంత నాయకులు ఆరోపిస్తున్నారు.

పాకిస్థాన్  పాలకులకు ఇప్పటికే బెలూచిస్థాన్ ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. ప్రత్యేక బెలూచిస్థాన్ డిమాండ్ తో చాలా కాలంగా పోరాడుతున్నారు అక్కడి ప్రజలు. తాజాగా 
సింధూ దేశ్ డిమాండ్ మళ్లీ తెరపైకి రావడంతో పాకిస్థాన్ పాలకులు ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. సింధ్ దేశ డిమాండ్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతుండటం వారిని మరింత కలవరపెడుతోంది. బెలూచిస్థాన్ లానే సింధ్ ప్రావిన్స్ లోనూ నిరసనలు జరగకుండా కఠిన ఆంక్షలకు పాకిస్థాన్ సర్కార్ సిద్ధమవుతుందని సమాచారం.