గాలిలో హెలికాప్టర్ల ఢీ.. 10 మంది మృతి

మలేసియా రాజధాని కౌలా లంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మలేసియా నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలోనే ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది
మరణించారు. రెండు హెలికాప్టర్లూ సైనిక విన్యాసాలు చేస్తూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈనెల 26వ తేదీన మలేసియాలో రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది.
దీనికోసం కౌలా లంపూర్‌లోని పెరక్ లుమల్ ప్రాంతంలో రిహార్సల్స్ నిర్వహించారు. ఈ విన్యాసాల కోసం పదిమంది సైనిక సిబ్బందితో సహా గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కాసేపట్లోనే
ఒకదానితో మరొకటి ఢీకొని కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో వున్న పదిమంది మరణించారు. వీరందరూ ఆర్మీ ఉన్నతాధికారులే. హెలికాప్టర్లు కూలుతున్న
దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.