తెలంగాణ మంత్రులను అడ్డుకున్న కొండగట్టు బాధితులు

 

జగిత్యాల జిల్లాలో తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ కు చేదు అనుభవం ఎదురైంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మంత్రులు.. కొడింగ్యాల మండలంలోని హిమ్మత్ రావు పేటలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొనేందుకు వెళుతుండగా.. వీరి కాన్వాయ్ ను కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలు, రైతులు రామసాగరం గ్రామంలో అడ్డుకున్నారు. రాంసాగర్ చౌరస్తా వద్ద కాన్వాయ్ ను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. కొండగట్టు ప్రమాద బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబాలకు అందాల్సిన పరిహారం, ఇంటికో ఉద్యోగాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. అదే సమయంలో రైతులు కూడా.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మండలంలోని చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సర్దిచెప్పినా వీరు వినిపంచుకోలేదు. దీంతో దాదాపు అరగంట పాటు మంత్రులు కొండగట్టు బాధితుల మధ్య చిక్కుకుపోయారు. చివరికి సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.  2018 సెప్టెంబర్ 11న కొండగట్టు ఘాట్ రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో 65 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.