ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగింది

 

తెలంగాణ ఎన్నికల ఫలితాలు కూటమిని షాక్ కి గురిచేశాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సైతం ఓటమిపాలయ్యారు. దీంతో టీఆర్ఎస్ ఈవీఎంల ట్యాంపరింగ్‌ కి పాల్పడిందని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కొండా సురేఖ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు వంకరగా గెలిచి విర్రవీగుతున్నారని కొండా దంపతులు ధ్వజమెత్తారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని, డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేశారని, పోలీసులు కూడా వారికి సహకరించారని ఇన్ని మార్గాల్లో టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ విజయంపై ప్రజల్లోనే అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కేసీఆర్‌ పాలనపై వ్యతిరేకత పెల్లుబికిందన్నారు. చింతమడక గ్రామంలోనే సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ను ప్రజలు ఘోరావ్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ పరిణామాల క్రమంలో అత్యధిక మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలువడం సందేహాలను బలోపేతం చేసిందన్నారు. ఒక్కో నియోజకవర్గంలో రూ.30 నుంచి 50 కోట్ల మేరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు డబ్బుల పంపిణీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ వాళ్లను కనీసం కరపత్రాలు కూడా పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని అన్నారు.

కాంగ్రెస్‌ దిగ్గజాలు ఓడిపోతున్నారని కేటీఆర్‌ ఎలా చెప్పారని ప్రశ్నించారు. ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలో ముందుగానే నిర్ణయించారన్నారు. ఆ మేరకు ఈవీఎంల ట్యాంపరింగ్‌తో సఫలీకృతులయ్యారని ఆరోపించారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఫెడరల్‌ ఫ్రెంట్‌ను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేశారని కొండా దంపతులు విమర్శించారు. టీఆర్ఎస్ కు దమ్ముంటే రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొండా దంపతులు డిమాండ్‌ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సడలిందని, అమెరికా లాంటి దేశంలో కూడా బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానం ఉందని ప్రస్తావించారు.