టీఆర్ఎస్ మేనిఫెస్టో.. డిసెంబర్ నుంచి ఉచిత నీటి సరఫరా

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. డిసెంబర్‌ నుంచి వాటర్‌ బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదని చెప్పారు. 98శాతం ప్రజలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు. జంట నగరాల్లో ఇప్పుడు నీటి కొరత లేదని, పుష్కలంగా మంచి నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్‌ లకు డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న దోబీఘాట్లను పునరుద్ధరిస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో మోటార్‌ వాహనాల పన్నును రద్దు చేస్తామని తెలిపారు. త్వరలోనే సమగ్ర జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు. అధికారుల్లో బాధ్యతను పెంచేలా కొత్త చట్టానికి రూపకల్పన చేస్తామని కేసీఆర్ చెప్పారు.