రేపటి నుంచి విదేశాల్లో వున్న‌ భారతీయుల తరలింపు!

కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టింది. 
మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత మళ్ళీ ఇదే అతిపెద్ద తరలింపు కార్యక్రమం అని కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. మే 7 నుండి విమానాలు,, నౌకల ద్వారా విదేశాల నుండి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుందని ఆయ‌న చెప్పారు.   

ఇప్పటికే మొత్తం 1,90,000 మంది భారతీయులు ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో, హై కమీషనర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. మొదటి దశలో వాయుమార్గాన 13 దేశాల నుండి 14,800 మంది భారతీయులను 64 విమానాల్లో భారత్ తీసుకురానున్నారు. మొదటి దశలో అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, బాంగ్లాదేశ్,  యు కె, యు ఏ ఈ, సౌదీ, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్ వంటి 12 దేశాలకు భారత విమానాలు చేరుకొని అక్కడున్న భారతీయులను తిరిగి తీసుకువస్తాయి .

సామాజిక దూరాన్ని పాటించే విధంగా ఒక్కో విమానంలో 200 నుండి 300 మందిని తీసుకువస్తాం. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఈ క్రింది ప్రాధాన్య క్రమంలో భారత్ కు తరలిస్తామ‌ని కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.

1. ఆయా దేశాల నుండి వెలివేయబడిన వారు
2. వీసా గడువు ముగిసిన వారు 
3. వలస కార్మికులు
4. ఆరోగ్యరీత్యా భారత్ లోని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అవసరమైన వారు 
5. గర్భిణీ స్త్రీలు
6. భారత్ లో చనిపోయిన వారి బంధువులు 
7. ఆయా దేశాల్లో చిక్కుకున్న పర్యాటకులు
8. విదేశాల్లో హాస్టల్స్ మూతబడి ఇబ్బందులు ఎదుర్కుంటున్న విద్యార్థులు 

భారత్ కు రాదల్చుకున్న వారు, వారికి కరోనా పరీక్షలు నిర్వహించబడి సర్టిఫికెట్ పొంది ఉండాలి. వారు భారత్ కు చేరుకున్న తర్వాత కూడా పరీక్షలు నిర్వహించబడుతాయి. ఈ రకంగా విదేశాల నుండి వచ్చిన ప్రతి వ్యక్తి 14 రోజుల పాటు  క్వారంటైన్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటైన్ కేంద్రాలను నిర్వహిస్తాయి. 

అదే విధంగా రక్షణ శాఖ ఆధ్వర్యంలో నావెల్ షిప్స్ ద్వారా కొన్ని దేశాల నుండి మన దేశస్థులను తీసుకువచ్చే కార్యక్రమం మన భారత ప్రభుత్వం అధ్వర్యంలో కొనసాగనున్నది.