సిద్దిపేటకు మళ్లీ వెంకటరామిరెడ్డి! తెలంగాణలో పలువురు కలెక్టర్లు బదిలీ
posted on Nov 14, 2020 9:24AM
తెలంగాణలో పలవురు కలెక్టర్లను బదిలీ చేసింది ప్రభుత్వం. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సిద్దిపేట నుంచి సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన కలెక్టర్ వెంకటరామిరెడ్డిని మళ్లీ సిద్దిపేట కలెక్టర్గా నియమిస్తూ కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించింది. దుబ్బాక ఉప ఎన్నికకు ముందు మెదక్ జిల్లా కలెక్టర్గా నియమితులైన సంగారెడ్డి కలెక్టర్ ఎం.హన్మంతరావును తిరిగి సంగారెడ్డికి బదిలీ అయ్యారు.
ఇప్పటి వరకు సిద్దిపేట కలెక్టర్గా ఉన్న మంచిర్యాల కలెక్టర్ భారతి హొళికెరిని మళ్లీ మంచిర్యాలకు ట్రాన్స్ ఫర్ చేసింది ప్రభుత్వం. ఆ జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిక్తా పట్నాయక్ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శశాంకకు ఆ బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తూ ఆ స్థానంలో హొళికెరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు బదిలీ కాగా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి మల్కాజిగిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు.