తాగి విమానం ఎక్కబోయాడు..ఉప ముఖ్యమంత్రి కొడుకుని లాగేశారు
posted on May 9, 2017 12:54PM

ఉప ముఖ్యమంత్రి కొడుకునని..తనను అడిగేవారు లేరు అని రెచ్చిపోయిన ఓ రాజకీయ నేత కుమారుడికి అదిరిపోయేలా బుద్ది చెప్పారు విమాన సిబ్బంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ కుమారుడు జైమన్ పటేల్ మద్యం తాగి విమానం ఎక్కేందుకు యత్నించగా విమాన సిబ్బంది అడ్డుకున్నారు. భార్య, కుమార్తెతో కలిసి గ్రీస్ వెళ్లేందుకు జైమన్ పటేల్ ఉదయం 4 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. తాగి నడవలేని పరిస్థితుల్లో వీల్ చెయిర్లోనే కూర్చుని ఇమ్మిగ్రేషన్ తనిఖీలు చేయించుకున్నట్లు తెలిసింది. అంతా బాగానే మేనేజ్ చేసినప్పటికీ సరిగ్గా విమానం ఎక్కే సమయంలో సిబ్బంది అనుమతించకపోవడంతో ఆయన వారితో గొడవపడ్డారు. 30 సంవత్సరాల జైమన్ పటేల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. మరోవైపు తన కుమారుడు అనారోగ్యం కారణంగా నడవలేక వీల్చెయిర్లో కూర్చున్నాడని గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ మీడియా తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ప్రత్యర్ధులు అర్ధం పర్ధంలేని ఆరోపణలు చేస్తూ తన కుమారుడిపై పుకార్లు లేవదీశారని పటేల్ వ్యాఖ్యానించారు.