పెట్రోల్పై 10/- డీజిల్పై 13/- వడ్డింపు! కొరడా జులిపిస్తున్న మోదీ!
posted on May 6, 2020 11:51AM
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, కేంద్రం మాత్రం ప్రజల ముక్కు పిండి వసూలు చేసుకుంటోంది. కరోనా దెబ్బకు ప్రపంచమంతా లాక్డౌన్ అయ్యింది. దీంతో చమురు ఉత్పత్తికి తగ్గరీతిలో డిమాండ్ లేకపోవడంతో ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైనప్పటికీ దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు మాత్రం తగ్గడం లేదు.
భారీగా తగ్గిన ధరల వెసులుబాటును ప్రజలకు మళ్లించకుండా.. కేంద్రం ఎక్సైజ్ రేట్లు పెంచకుంటూ పోతుంది. లీటర్ పెట్రోలు పై 10 రూపాయలు, డీజిల్పై 13 రూపాయలు పెంచుతూ మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రెండు రూపాయలు ఎక్సైజ్ సుంకంకాగా, ఎనిమిది రూపాయలు రోడ్ సెస్ విధించింది. కొత్తగా కేంద్రం పెంచిన ధరలతో... దేశంలో లీటర్ పెట్రోలుకు దాదాపు 33 రూపాయలు ఎక్సైజ్ సుంకం రూపంలోనే కేంద్రం జేబులోకి వెళ్తుంది.
నరేంద్రమోడీ 2014లో ప్రధాని అయినప్పుడు పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం కేవలం తొమ్మిదన్నర రూపాయలు మాత్రమే ఉండేది. అదిప్పుడు పెరుగుతూ పెరుగుతూ వచ్చి 33 రూపాయలకు చేరుకుంది. చమురు ధరల పతనం మొదలయ్యాక ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. తగ్గిన చమురు ధరలు సామాన్యులకు దక్కకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్రం తన ఖజానాకు మళ్లించుకుంది.