ప్రకాశం జిల్లాలో ఫ్యాక్షన్ హత్య

ప్రకాశం జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మరోసారి పడగ విప్పింది. బల్లికురువ మండలం వేమవరంలో గొట్టిపాటి-కరణం వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కె.రాజుపాలెంలో ఓ వివాహానికి హాజరై ద్విచక్ర వాహనాలపై వస్తున్న కరణం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో కరణం అనుచరులు అంజయ్య, రామకోటేశ్వరరావులు మృతి చెందగా..మరో నలుగురు చిలకలూరిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

విషయం తెలుసుకున్న టీడీపీ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాం నేరుగా ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. జరిగిన ఘటనపై తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో బల్లికురువ మండలంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ గ్రామంలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.