ఆర్టీసీ పై మరో ముందడుగు వేయనున్న కేసీఆర్

 

తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాలకు చరమ గీతం పాడే విధంగా సంస్థ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఆర్టీసీ గుర్తింపు యూనియన్ టీఎంయూ కార్యాలయానికి బస్ భవన్ అధికారులు తాళం వేశారు. యూనియన్ నాయకులకు విధుల నుంచి మినహాయింపును ఆర్టీసీ రద్దు చేసింది. రాష్ట్రం లోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ ఒకటి ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సమావేశం కావాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని వారికి తగిన రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలి అని ఆర్టీసీ ఎండీని సీఎం ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉండాలని అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలి అని సీఎం కోరారు. డిసెంబర్ ఒకటిన మధ్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకు రావాలని వారికి ప్రగతి భవన్ లోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. మధ్యాహ్న భోజనం అనంతరం కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు. ఆర్టీసికి సంబంధించిన అన్ని విషయాలనూ కూలంకషంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి రవాణ శాఖ మంత్రి అజయ్ కుమార్ తో పాటు ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్ఎంలు, డివిఎంలను ఆహ్వానించారు. మరి ఈ డిసెంబర్ 1 కి ఆర్టీసీ పై పూర్తి స్థాయి చర్యలు జరగనున్నట్లు సమాచారం.