చంద్రబాబు హౌస్ అరెస్ట్.. హైటెన్షన్!!

 

టీడీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు 'ఛలో ఆత్మకూరు'కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీస్ ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వలేదు. అర్ధరాత్రి నుంచే టీడీపీ ముఖ్యనేతల ఇళ్ల చుట్టూ పోలీసులు మోహరించారు. పోలీసు అధికారుల ఆదేశాలతో టీడీపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్టు చేశారు. గుంటూరులో వైసీపీ బాధితుల పునరావాసం శిబిరం చుట్టూ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.

‘ఛలో ఆత్మకూరు’కు బయల్దేరిన చంద్రబాబు, లోకేష్ లతో పాటు కీలక నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. ఛలో ఆత్మకూరును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామన్న చంద్రబాబును పోలీసులు ఇల్లు కదలనీయలేదు. ఇంటిచుట్టూ మోహరించిన పోలీసులు చంద్రబాబును హౌస్ అరెస్టు చేశారు. ఆత్మకూరుకు ర్యాలీగా బయలుదేరిన లోకేష్‌ను అమరావతిలో పోలీసులు అడ్డుకున్నారు. లోకేష్‌ను హౌస్ అరెస్టు చేశారు. ఛలో ఆత్మకూరు నేపథ్యంలో పల్నాడు, గుంటూరులలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్షన్ అమలులో ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.