అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అమరావతి నుండి హైదరాబాద్‌కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించిన  సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని కేంద్రం రోడ్డు రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది.  ఆంధ్రప్రదేశ్‌లో మరో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సూచించింది.    గత నెల 3న ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఏపీ ఎస్‌ఎఫ్‌సీ విభజన, విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, విదేశీ రుణ సాయ ప్రాజెక్టులు, అప్పుల పంపకం, రోడ్డు, రైలు, విద్యా సహా పలు అంశాలపై ఈ సమావేశం చర్చించింది.  ఇరు రాష్ట్రాల మధ్యా అపరిష్కృత అంశాలపై రెండు రాష్ట్రాల  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  రెండు రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరిపింది. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.  రెండేళ్లలో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని రైల్వే బోర్డు ప్రకటించింది.   వెనుకబడిన జిల్లాలకు అందించే గ్రాంట్‌కు సంబంధించి ఏపీకి పెండింగ్ ఉన్న మరో రూ.350 కోట్లు విడుదల ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక వ్యవసాయశాఖ వెల్లడించింది. దుగ్గరాజపట్టం వద్ద పోర్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మధ్యంతర నివేదిక అందిందని, కొద్ది రోజుల్లో పూర్తి ప్రాజెక్టు రిపోర్టు అందుతుందని దాని ఆధారంగా ముందకు వెళతామని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ అధికారులు వెల్లడించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu