ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి దోషి.. సీబీఐ కోర్టు తీర్పు
posted on May 6, 2025 4:17PM

ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురిని దోషులుగా తేల్చింది నాంపల్లి సీబీఐ కోర్టు. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఎఎస్ కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 14 ఏళ్లుగా సాగుతున్న ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో మంగళవారం ( మే6)న సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బంధువు బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి పీఏ మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వి.డి. రాజగోపాల్ సహా ఓబులాపురం మైనింగ్ కంపెనీని దోషులుగా నిర్ధారించింది.
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు.
వారిలో లింగయ్య అనే వ్యక్తి మరణించగా, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని హైకోర్టు 2022లోనే నిర్దోషిగా ప్రకటించింది. మిగిలిన ఏడుగురిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ అధికారి కృపానందంలను సీబీఐ కోర్టు నిర్దోషులుగా చేర్చింది. కాగా దోషులుగా తేల్చిన వారికి కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. దాదాపు 884 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేశారంటూ ఓఎంసీపై ఆ చార్జిషీట్ లో సీబీఐ పేర్కొంది. అప్పటి నుంచీ ఈ కేసు సాగుతూనే ఉంది. మొత్తం 219 మంది సాక్షులను విచారించిన సీబీఐ 3,400 డాక్యుమెంట్లలతో సీబీఐ 2011లో చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.