జీసస్ కావాలా? ఏడుకొండలవాడు కావాలా? తేల్చుకోండి.. వైసీపీ ఎమ్మెల్యేకు బీజేపీ సూటి ప్రశ్న

పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అయన తన పేరును క్రిస్మస్ వేడుకల పోస్టర్లలో వేయించుకోవడాన్ని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి తప్పు పట్టారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్న పార్థసారధి ఇలాంటి పని చేయడం దారుణమని విమర్శించారు. ఈరోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ " ఏసు కావాలా? వెంకన్న కావాలా? అనేది టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్నపార్థసారథి తేల్చుకోవాలన్నారు. ఆయన కనుక క్రిస్మస్ వేడుకలకు హాజరై.. తిరుమల పాలకమండలికి వస్తే తాము అడుగు పెట్టనీయమని భాను ప్రకాష్ హెచ్చరించారు. అవసరమైతే దాడులు చేసైనా ఎదుర్కొవటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

 

గతంలో తాము చాలా పోరాటాలు చేశామని, ఎంతటి తీవ్రమైన కార్యక్రమానికైనా వెనుకాడబోమని భానుప్రకాశ్‌ రెడ్డి అన్నారు. ఆర్.ఎస్.ఎస్ స్టిక్కర్‌ ఉన్న కారును అలిపిరి వద్ద ఆపి పోలీసులు స్టిక్కర్ ను తొలగించారని, ఇది చాలా తప్పని అన్నారు. ఇలాంటివి ఘటనలు మళ్లీ జరిగితే బాగుండదన్నారు. ఇదే సమయంలో టీటీడీలో పని చేసే ఉన్నతాధికారులు కూడా క్రిస్మస్ సందర్భంగా వారి ఇంటి ముందు స్టార్లు పెట్టడాన్ని అయన తప్పు పట్టారు. ఇలాంటి విషయాలపై టీటీడీ నిఘా పెట్టి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిని ఇతర ప్రభుత్వశాఖలకు బదిలీ చేయాలని భానుప్రకాశ్‌ రెడ్డి డిమాండ్ చేశారు.