ట్రేడ్వార్.. అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్నచైనా
posted on Apr 10, 2025 7:00AM

ట్రేడ్ వార్లో అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అంటోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. డ్రాగన్ దేశం నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్ 104 శాతం సుంకం విధించిన నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులపై తాము 84 శాతం సుంకం విధిస్తున్నట్లు బీజింగ్ తాజాగా ప్రకటించింది. గురువారం (ఏప్రిల్ 10) నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా కూడా నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్.. ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనీ, లేదంటే అదనంగా మరో 50 శాతం ప్రతీకార సుంకం విధిస్తానని హెచ్చరించారు. అయితే ఆ గడువులోగా చైనా స్పందించలేదు.
దీంతో ట్రంప్ అన్నంత పనీ చేశారు. గతంలో విధించిన 54 శాతానికి అదనంగా 50 శాతం జోడించడంతో చైనాపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి. అమెరికా అహంకారంతో వ్యవహరిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని చైనా ఆరోపించింది. అమెరికా చర్యకు ప్రతిగా తాను కూడా మరో 50 శాతం సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించి ట్రేడ్ వార్ కు సై అంది.