కాళేశ్వరం కుంగింది అందుకే...నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి  ప‌లు సూచ‌న‌లు చేసింది. 
1) మొత్తం 85గేట్లలో 77 గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, మిగిలిన ఎనిమిది గేట్లలో మాత్రం సాంకేతిక , మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని , వీటిని చక్కదిద్దేందుకు ఏ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలో అధికారులు నివేదికలో పేర్కొన్నారు.  

2) మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో 15నుంచి 22 పిల్లర్లు దెబ్బతినడంతో వాటిని రిపేర్ చేసేందుకుగాను గేట్లను పైకి ఎత్తివేయాలని సూచించారు.

3) 20, 21 నెంబర్ గేట్లను ఓపెన్ చేయడానికి వీలు లేనందున వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని,  రిపేర్ లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టెక్నికల్ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.  

4) బ్యారేజ్ ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి దఫా వరదతో, మేడిగడ్డలోని ఏడో బ్లాక్ లో సమస్యలు తలెత్తాయని, వాటిని అప్పుడే గుర్తించి మరమ్మత్తులు చేపట్టి ఉంటే, మిగతా పిల్లర్లకు ఎలాంటి సమస్యలు ఉండేవి కావని అధికారులు నివేదిక‌లో రాశారు.  మరమ్మత్తుల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.

5) 8 గేట్ల ప్రాంతంలో బ్యారేజీ మీదనున్న శ్లాబ్ కుంగిపోవడంతో కొత్త శ్లాబ్ వేయాలని పేర్కొన్నారు.  

6) ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లకు మాత్రమే కాకుండా మిగిలిన వాటికీ ప్రమాదం లేదనుకోలేమని స్పష్టం చేశారు. కాళేశ్వరం మరమ్మత్తులపై గైడ్ లైన్స్ ను డ్యాం సేఫ్టీ అధికారులు జారీ చేశారు. 

7)  ప్లానింగ్, డిజైన్, క్వాలీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో నిర్ల‌క్ష్యం వ‌ల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింద‌ని డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికలో తెలిపింది.

8) డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని నివేదికలో పేర్కొంది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడిందని నివేదికలో వెల్లడించింది. పిల్లర్లు కుంగిపోవటానికి బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవటం వలనేనని తెలిపింది.  

మ‌రో వైపు మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను  జ్యుడీషియల్‌ కమిషన్‌ సందర్శించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై న్యాయ విచారణలో భాగంగా బరాజ్‌లోని కుంగుబాటుకు గురైన 19, 20, 21వ పియర్లలతోపాటు ఏడో బ్లాక్‌లో వంతెనపై కాలినడకన వెళ్లి జ్యుడీషియల్‌ కమిషన్‌ క్షుణ్ణంగా పరిశీలించింది.  ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్ల ప్రాంతాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. బరాజ్‌లో కుంగిన పియర్ల పగుళ్లను పరిశీలించారు. కుంగుబాటుకు గల కారణాలను, ఇతర సాంకేతిక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ మాట్లాడుతూ.. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక  అందిందని, దాన్ని అధికారుల సమక్షంలో సమీక్షిస్తున్నట్టు తెలిపారు. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌