Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ముక్కుతూన్న ముసలివాళ్ళ వరకు
దేవుని పూజారులమైన మేము
యౌవన వనంలో విరిసిన పువ్వులు వీరు
అందరమూ పల్లాస్ పూజా వేదికల వద్ద
ఇస్మిసస్ పవిత్రాగ్ని హోత్రాలవద్ద
ఇక్కడ అక్కడ ఊరంతా
ఇలాగే తరుశాఖలు దాల్చి
యీ వేదనా నివేదన
చేస్తున్నా మవధరించండి
మీకు తెలుసు ప్రభూ
యీ నగరం మృత్యుపాశంలో చిక్కుకుందని
మృత్యువు కెరటంలా
ఈ నగరంపై విరుచుకుపడుతోందని.
థేబ్స్ రాజదంపతులు లాయిస్, జొకాస్టాల కొడుకు యీడిపస్. అతను పుట్టగానే, తండ్రిని చంపి తల్లికి భర్తవుతాడని జోస్యంలో తెలుస్తుంది. శిశువుని నిర్జనమైన కొండలమీద వదిలిపెడతారు, చచ్చిపోతాడని. గొర్రెల కాపరి రక్షిస్తాడు. తన నిజమైన తల్లిదండ్రులెవరో తెలీని యీడిపస్ లాయిస్ ని చంపడం, ధేబ్స్ రాజై జొకాస్టా భర్తవడం జరిగిపోతాయి. కొన్నాళ్ళకి ధేబ్స్ నగరం అంటువ్యాధులతో మృత్యు ముఖంలో అల్లాడి పోతుంటుంది. భయ విహ్వలత్వంతో ప్రజలంతా ప్రార్ధనలు చేస్తుంటారు.
ప్రఖ్యాత గ్రీకు విషాదాంత నాటక రచయిత సోఫోక్లిస్ (క్రీ.పూ.496-406) రచన 'యీడిపస్ రెక్స్' నాటిక ప్రారంభ భాగానికి తిలక్ అనువాదం.
------
నగరంపై పీడనీడ
ఫల్లాస్ పూజా వేదికల వద్ద
ఇస్మిసస్ నదీతీరాన జ్వలించే
పవిత్రాగ్ని హోత్రాలవద్ద
బజారులమ్మట రాజప్రాసాదాలవద్ద
చేరిన యీ జన సందోహాన్ని చూడు ప్రభూ
చిదిమితే పాల్గారే చిన్నారిబుగ్గలు
ముక్కుతూ మూల్గుతూ ఉండే ముసళ్ళు
మోహన యౌవన వనసుమాలు తరుణవయస్కులు
వీరందరినీ కనికరించు అవధరించు ప్రభూ
ఈ నగరంపై ఏదో నల్లని పీడనీడ పడింది
మృత్యువు తన భయంకర పాశాన్ని విసిరింది
సౌభాగ్యవతి ధాత్రి యిది
మన వంశపిత కాడ్మస్ గృహలక్ష్మి...
(ఇది అసంపూర్ణం - తిలక్)
* * *



