ప్రతి ఒక్కరూ ఈ పని చేస్తేనే అమ్మవారి కృప లభిస్తుంది!!

శరత్కాలం నిర్మలత్వానికీ, శరశ్చంద్రుడు ప్రశాంతతకూ ప్రతీకలు. నిర్మలమైన ప్రేమ, కరుణను కురిపించే చల్లని మనస్సు మాతృమూర్తి సహజ లక్షణాలు. అందుకే నిర్మల, ప్రశాంత తరంగాలతో నిండిన శరత్కాలమంటే జగన్మాతకు అత్యంత ప్రీతి. శరత్కాలంలో విశేషంగా ఆ విశ్వేశ్వరిని తొమ్మిది రోజుల పాటు ఆరాధించి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం మన సంప్రదాయం. 'నవ' సంఖ్య పరిపూర్ణతకు సంకేతం. 'దేవీ కవచం'లో వర్ణించిన

ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ | 

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ॥ పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీ తథా | సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమమ్ ॥ 

నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః | 

ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ॥

'శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి' .. నవదుర్గలను అర్చించి  ఈ పరిపూర్ణత్వాన్ని సాధించుకోవాలన్నది నవరాత్రి ఉత్సవాల విశిష్టత.

దుర్లభమైన మానవజన్మను సార్ధకం చేసుకోవాలంటే అశాశ్వతమైన ఈ దేహంలో అంతర్గతంగా ఉన్న శాశ్వతమైన ఆత్మశక్తిని గ్రహించాలి. జనన మరణాతీత స్థితిని చేరుకోవాలి. అప్పుడే మానవజన్మకు పరిపూర్ణత్వం సిద్ధించినట్లు! అయితే పరిపూర్ణతను సాధించడానికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు అవసరం. 'యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా' - సర్వజీవుల్లో శక్తిగా నెలకొని ఉన్న ఆ సర్వేశ్వరిని ఆరాధిస్తే మానవ జన్మ పరిపూర్ణత్వానికి కావలసిన సర్వశక్తులూ సమకూరుతాయి. అమ్మ ప్రేమామృత ధారలతో అమరత్వం సిద్ధిస్తుంది. మోక్షం ప్రాప్తిస్తుంది.

 మోక్షప్రాప్తికి సాధనం ఈ మానవ దేహం. అనిత్యం, అశాశ్వతమైన ఈ సాధనంతోనే నిత్యం, శాశ్వతమైన బ్రహ్మపథాన్ని పొందడం సాధ్యమవుతుంది. అలాంటి అత్యున్నతమైన, అత్యంత దుర్లభమైన ఈ మానవ దేహాన్ని ప్రసాదించిన 'మాతృమూర్తి'యే ఇలలో వెలసిన ఆ జగన్మాత ప్రతిరూపం. 'యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా' అని దుర్గాసప్తశతి విశదపరుస్తోంది. ఈ సృష్టిలో తల్లే ప్రత్యక్ష దైవం. 'మాతృదేవో భవ' అని వేదం తల్లికి అగ్రస్థానాన్నిచ్చింది. జగన్మాత విశిష్ట లక్షణాలైన నిర్మలమైన ప్రేమ, చల్లని మనస్సు మాతృమూర్తిలో సహజగుణాలు.

దేహంలో ఏ అంగానికి ఆపద వాటిల్లినా మొట్టమొదట కనురెప్ప చలిస్తుంది. అలాగే పసిబిడ్డకు ఏ కష్టం కలిగినా ముందుగా తల్లడిల్లేది. మాతృహృదయమే! బిడ్డ యోగక్షేమాల్నే సదా కాంక్షించే 'కరుణమూర్తి' బిడ్డ సంరక్షణ కోసం తన ప్రాణాలు సైతం త్యజించేందుకు వెనుకాడని 'త్యాగమూర్తి'; తన కష్టాలను భరిస్తూ బిడ్డకు సుఖాన్ని పంచే 'ప్రేమమూర్తి'; మోక్షసాధనకు ఈ దేహాన్ని ప్రసాదించిన 'దివ్యమూర్తి'. ఈ దైవీగుణాలతో ఇలలో వెలసిన దైవం 'మాతృమూర్తి'.

మనమెంత భక్తిప్రపత్తులతో నవదుర్గలను ఆరాధించి నప్పటికీ, నవమాసాలూ భరించిన మాతృమూర్తిని నిరాదరిస్తే ఆ జగన్మాత కృపకు పాత్రులం కాలేం. ఆదిపరాశక్తి అనంత ప్రేమను పొందాలంటే కన్నతల్లిని ఆనందింప జేయగలగాలి. తల్లి ఆశీర్వాదమనే తాళపు చెవి లేనిదే ఆ జగన్మాత కూడా మోక్షద్వారాలను తెరవదు. కాబట్టి మానవజన్మ పరిపూర్ణతకు మాతృమూర్తి దీవెనలు అత్యంత ముఖ్యం. 


                                   *నిశ్శబ్ద.


More Dasara - Navaratrulu