Top Stories

political-news-img

ప్రధానిని సత్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పని చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా సత్కరించారు. కేంద్రంలో ఎన్డీయే ) ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ఢిల్లీలో కూటమి భాగస్వామ్య పక్షాల నేతలతో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.సమావేశం ప్రారంభానికి ముందే పవన్ కల్యాణ్ ప్రధాని మోడీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతదేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా సేవలందిస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సుదీర్ఘ సమావేశంలో ఎన్డీయే కూటమి గత 12 ఏళ్ల ప్రస్థానంపై కీలక చర్చ జరిగింది. ఈ కాలంలో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, దేశవ్యాప్తంగా అమలు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై కూటమి నేతలు విస్తృతంగా చర్చించారు.

Publish Date: Jun 10, 2026 7:57PM

political-news-img

బొల్లారం లో ఓ మహిళ హత్య కేసు.. భర్తే నిందితుడు

హైదరాబాద్‌ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన భార్యతో బైక్ పై వెడుతుండగా గుర్తు తెలియని కొందరు దుండగులు వచ్చి భార్యను దారుణంగా హత్య చేశారంటూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసులో భర్తే నిందితుడిగా నిర్ధారించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన అనిల్ కుమార్, మీనా దేవి దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి బొల్లారంలోని బీహార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనిల్ కుమార్ లేబర్ కాంట్రాక్టర్ పని చేస్తూ సంపాదిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అనిల్ కుమార్, మీనాదేవి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన భార్య మీనాదేవిని హత్య చేయాలని పథకం పన్నిన అనిల్ కుమార్.. ఆ హత్య ఒక ప్రమాదం జరిగినట్లుగా ఉండాలని భావించి బీహార్‌కు చెందిన నలుగురు వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. గత నెల 30న తన భార్యతో మార్కెట్ కు వెళ్లిన అనిల్ కుమార్ తిరిగి వస్తూ.. బొల్లారం సమీపంలో రిపేర్ అంటూ బండిని ఆపాడు. ఆ మాటలు నమ్మి మీనాదేవి బండి దిగి పక్కన నిలబడింది. అప్పటికే అక్కడ మాట వేసి ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా మీనాదేవి మీద దాడి చేసి పొదలోకి తీసుకువెళ్లి గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత అనిల్ ఏమి ఎరగనట్లు పోలీసులకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన భార్యను హత్య చేశారంటూ ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులకు అనిల్ చెప్పే మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. దీంతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులకు దర్యాప్తులో భర్త అనిల్ కుమార్ పై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయట పెట్టాడు. పోలీసులు అనిల్‌తో పాటు భరత్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Publish Date: Jun 10, 2026 7:44PM

political-news-img

ఏఐ ఆధారిత స్మార్ట్ బోర్డర్.. భారత్ సరిహద్దు భద్రతలో స‌రి కొత్త అధ్యాయం

భారత్‌ సరిహద్దు భద్రత అనేది కేవలం రక్షణ వ్యవస్థల సమస్య మాత్రమే కాదు. దేశ జ‌నాభా సంఖ్య నిర్మాణం, అంతర్గత భద్రత, డ్రగ్ నెట్‌వర్క్‌లు, ఆయుధ స్మగ్లింగ్, మతపరమైన అతి తీవ్రవాదం వంటి అనేక సంక్లిష్ట అంశాలతో ముడిపడి ఉన్న జాతీయ భద్రతా ప్రశ్న. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ప్రకటించిన ఏఐ ప‌వ‌ర్డ్ స్మార్ట్ బోర్డ‌ర్ ప్రాజెక్ట్- అందులో భాగంగా అమలు అవుతున్న BOLD-QIT వంటి ప్రాజెక్టులు, భారత్‌ సరిహద్దు పాలసీలో ఒక కీలక మలుపు. భారత్‌కు పాక్, బంగ్లాదేశ్, మాయన్మార్, నేపాల్, భూటాన్, చైనా వంటి దేశాలతో కలిపి.. వేల కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది. ఇందులో పాక్, బంగ్లాదేశ్ సరిహద్దులు భద్రతా పరంగా అత్యంత సున్నితమైనవి. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు- సుమారు 4,096 కి.మీ పొడవు, నదులు, చిత్తడి నేలలు, అడవులు, చార్ ల్యాండ్స్, నదీ చానెల్స్‌తో కూడిన అత్యంత సంక్లిష్ట భౌగోళిక నిర్మాణం. ఇండో-పాక్ సరిహద్దు.. ఎడారి, కొండలు, పర్వత ప్రాంతాలు, మైన్స్, LOC వంటి విభిన్న భౌగోళిక పరిస్థితులు. ఈ భౌగోళిక పరిస్థితుల వల్ల ప్రతి చోటా భౌతిక కంచె వేయడం సాధ్యం కాదు. ముఖ్యంగా.. బ్రహ్మపుత్ర నది ప్రవహించే ధుబ్రీ ప్రాంతం- అస్సాం, సుందరబన్స్ చిత్తడి నేలలు- పశ్చిమ బెంగాల్, కచ్ ఎడారి- గుజరాత్.. నదీ సరిహద్దులు, అట‌వీ ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాల్లో BSF జవాన్లు 24 గంటలు భౌతిక పహారా నిర్వహించడం, వాతావరణం, వరదలు, చిత్తడి నేలల కారణంగా అత్యంత కష్టసాధ్యం. అక్రమ వలసలు – జనసాంఖ్యిక మార్పు, భద్రతా ముప్పు.. బంగ్లాదేశ్‌ నుండి అక్రమ వలసలు.. దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌ నుండి అక్రమ వలసలు, స్మగ్లింగ్, గోవు అక్రమ రవాణా, డ్రగ్స్, నకిలీ కరెన్సీ, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలు ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్నాయి. ఈ వలసలు.. సరిహద్దు రాష్ట్రాల జనసంఖ్య‌ను మార్చే ప్రమాదం ఉంది. ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఐడెంటిటీ పాలిటిక్స్‌కు బలమైన ఇంధనం. అంతర్గత భద్రత, మతపరమైన అతి తీవ్రవాద నెట్‌వర్క్‌లకు మద్దతు. ఇటీవలి ప్రసంగాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అక్రమ వలసలను దేశ జనసాంఖ్యిక నిర్మాణాన్ని మార్చే కుట్ర గా అభివర్ణిస్తూ, స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి చొరబాటుదారుని గుర్తించి దేశం వెలుపలికి పంపుతామని స్పష్టంగా ప్రకటించారు. సరిహద్దు భద్రతను కేవలం కంచెలు, గస్తీ, గన్‌లతో కాకుండా, సాంకేతికత ఆధారంగా సమగ్రంగా నిర్వహించేందుకు CIBMS అంటే కంప్ర‌హెన‌న్సివ్ ఇంటిగ్రేటెడ్ బోర్డ‌ర్ మేనేజ్మెంట్ సిస్ట‌మ్ అనే కాన్సెప్ట్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపకల్పన చేసింది. దీని ల‌క్ష్య‌మేంటంటే.. మానవ శక్తి + సెన్సార్లు + నెట్‌వర్క్‌లు + ఇంటెలిజెన్స్ + కమాండ్ & కంట్రోల్.. సరిహద్దు పరిస్థితులపై రియ‌ల్ టైం సిట్యువేష‌న‌ల్ అవేర్నెస్ క‌లిగించ‌డం. ఇది ఎలాంటిదంటే.. చొరబాట్లపై క్విక్ రియాక్ష‌న్, ప్రిడిక్టివ్ సెక్యూరిటీ ఉంటాయి. ఇక CIBMS కింద ఉపయోగించే ప్రధాన సాంకేతిక వ్యవస్థలు ఎలాంటివంటే.. థ‌ర్మ‌ల్ ఇమేజ‌ర్స్, ఇన్ ఫ్రారెడ్ అండ్ లీజ‌ర్ బేస్డ్ ఇట్రుడ‌ర్ అలార‌మ్స్. ఇక గ‌గ‌న త‌ల నిఘా కోసం.. భూగర్భ, నేలల‌ ప్రకంపనల గుర్తింపు.. నదీ, జల సరిహద్దుల కోసం.. ఫైబ‌ర్ ఆప్టిక్ సెన్సార్స్ వాడారు. క‌మాండ్ కంట్రోల్ సిస్ట‌మ్ సంగ‌తికి వ‌స్తే అన్ని సెన్సార్ డేటాను, రియ‌ల్ టైంలో విశ్లేషించే కేంద్ర వ్య‌వ‌స్థ BOLD-QIT – ధుబ్రీలో డిజిటల్ కంచె గురించి చెప్పుకోవాలి. ఇదేంటంటే బోర్డ‌ర్ ఎల‌క్ట్రానిక‌ల్లీ డామినేటెడ్ క్యూఆర్టీ ఇంట‌ర్ సెప్ష‌న్ టెక్నిక్. దీన‌ర్ధ‌మేంటంటే, సరిహద్దులో ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ ద్వారా క్విక్ రియాక్షన్ టీమ్‌లను అప్రమత్తం చేసి, అక్రమ చొరబాట్లను అడ్డుకునే సాంకేతిక వ్యవస్థ ఇది. ఈ ప్రాజెక్ట్‌ను 2017–2018 మధ్య BSF ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ టెక్నాల‌జీ వింగ్- రూపకల్పన చేసి, 2019లో ధుబ్రీ, అస్సాంలో అమలు చేశారు. ధుబ్రీ ప్రాంత ప్రత్యేకత ఎలాంటిదంటే, బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే 61 కి.మీ సరిహద్దు చార్ ల్యాండ్స్, అనేక నదీ చానెల్స్, వరదలు, చిత్తడి నేలలు... భౌతిక కంచె వేయడం అసాధ్యం వర్షాకాలంలో జవాన్ల పహారా అత్యంత ప్రమాదకరం. ఈ పరిస్థితుల్లో వ‌ర్చువ‌ల్ ఫెన్స్ కాన్సెప్ట్‌ను అమలు చేశారు. మైక్రో వేవ్ క‌మ్యూనికేష‌న్, ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్,చ డీఎంఆర్ క‌మ్యూనికేష‌న్, డే నైట్ హై రెస‌ల్యూష‌న్ కెమెరాస్, థ‌ర్మ‌ల్ ఇమేజ‌ర్స్, ఇన్ ట్రుష‌న్ డిటెక్ష‌న్ సిస్ట‌మ్స్, అండ‌ర్ వాట‌ర్ సెన్సార్స్, లేజ‌ర్ బీమ్స్, మైక్రోవేవ్ లైన్స్.. కంటికి క‌నిపించ‌ని డిజిట‌ల్ కంచె, సెన్సార్లు లేదా కెమెరాల చొర‌బాటును గుర్తించిన వెంట‌నే.. కంట్రోల్ రూమ్ ని అలెర్ట్ చేస్తాయి. GPS ఆధారంగా ఖచ్చితమైన లొకేషన్ గుర్తిస్తాయి. అంతే కాదు ద‌గ్గ‌ర్లోని బీఎస్ఎఫ్ క్విక్ రియాక్ష‌న్ టీమ్ కి స‌మాచారం అందిస్తాయి. స్పీడ్ బోట్లు, ఇత‌ర వేగంగా న‌డిచే వాహ‌నాల ద్వారా స్పందిస్తాయి. స్మార్ట్ ఫెన్సింగ్- పైలట్ ప్రాజెక్టులు ఎలాంటివంటే, 2018లో జ‌మ్ము ప్రాంతంలోని ఇండో-పాక్ సరిహద్దులో5 కి.మీ, ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులోని ధుబ్రీ- 61 కి.మీ పైలట్ స్మార్ట్ ఫెన్సింగ్ ప్రాజెక్టులు అమలు చేసి, 2019లో హోం మంత్రి రాజనాథ్ సింగ్ వాటిని అధికారికంగా ప్రారంభించారు. ఈ పైలట్ ప్రాజెక్టుల విజయంతో.. స్టేజ్-II, స్టేజ్-III కింద సుమారు 1955 కి.మీ భౌతిక కంచె వేయలేని సరిహద్దు ప్రాంతాల్లో CIBMS ఆధారిత స్మార్ట్ ఫెన్సింగ్ విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు. 2026 స్మార్ట్ బోర్డ‌ర్ ప్రాజెక్ట్ కొత్త దశ ఎలాంటిదంటే, 2026లో హోం మంత్రి అమిత్ షా, BSF 60వ వార్షికోత్సవ సందర్భంలో.. పాక్, బంగ్లాదేశ్‌తో ఉన్న సుమారు 6వేల‌ కి.మీ సరిహద్దును- స్మార్ట్ బోర్డ‌ర్ ప్రాజెక్ట్ ద్వారా చొరబాటు చేయలేని సరిహద్దుగా మార్చే లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్.. CIBMS పై నిర్మితమైన అధునాతన AI-ఆధారిత స్మార్ట్ గ్రిడ్.. డ్రోన్లు, రాడార్లు, థర్మల్ కెమెరాలు, AI వీడియో అనలిటిక్స్, ప్రెడెక్టివ్ సెక్యూరిటీ, BSF, రాష్ట్ర పోలీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మధ్య రియ‌ల్ టైం డేటా షేరింగ్ వంటివి కీల‌కంగా ప‌ని చేస్తాయి. సరిహద్దు, అక్రమ వలసలు, చట్టపరమైన వ్యవస్థ ఎలా ప‌ని చేస్తుందో చూస్తే.. అక్రమ వలసలపై చట్టపరమైన దృక్పథం ఎంతో స్ప‌ష్టంగా ఉంది. భారత్‌లో అక్రమ వలసలపై ప్రధాన చట్టాలు ఎలాంటివంటే ఫారిన‌ర్స్ యాక్ట్- 1946. ఇదేం చెబుతుందంటే విదేశీయుల ప్ర‌వేశం, నివాసం, దేశ నిర్బంధాన్ని సూచిస్తుంది. ఇక పాస్ పోర్ట్ యాక్ట్- 1920, సిటిజ‌న్ షిప్ యాక్ట్- 1955 – పౌరసత్వం, రద్దు, అక్రమ వలసల ప్రభావం వివిధ రాష్ట్రాల ప్రత్యేక చట్టాలు, ఆర్డినెన్సులు.. ఉదాహ‌ర‌ణ‌కు అస్సాం అగ్రిమెంట్, NRC, మొదలైనవి.. అక్రమ వలసలు, స్మగ్లింగ్, డ్రగ్స్, ఆయుధ రవాణా వంటి కార్యకలాపాలు.. క్రిమిన‌ల్ లా ఐపీసీ, ఎన్డీపీఎస్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్ కింద శిక్షార్హం. జాతీయ భ‌ద్ర‌తా కోణంలోంచి చూస్తే.. అన్ లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్- UAPA వంటి చట్టాల ద్వారా కూడా విచారణకు గురయ్యే అవకాశముంది. సరిహద్దు భద్రత – కేంద్ర బాధ్యత వంటి అంశాల‌ను ప‌రిశీల‌న చేస్తే.. సరిహద్దు భద్రత, విదేశాంగ, రక్షణ, జాతీయ భద్రత వంటి అంశాలు యూనియ‌న్ లిస్ట్ కింద కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. BSF, ITBP, SSB వంటి సరిహద్దు దళాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తాయి. ల్యాండ్ అక్విష‌న్, బోర్డ‌ర్ ఫెన్సివ్ కోసం.. భూమి హ‌స్తాంత‌ర‌ణ- స్థానిక పోలీస్, ఇంటెలిజెన్స్, అడ్మినిస్ట్రేషన్ సహకారం.. ఇవి రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను కీలకంగా చేస్తాయి. ఉదాహరణకు, 2026లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ కోసం 27 కి.మీ భూమిని BSFకి హస్తాంతరం చేయడం, స్మార్ట్ బోర్డ‌ర్ అమలులో రాష్ట్ర–కేంద్ర సమన్వయానికి ఒక ఉదాహరణ. రాజకీయ కోణంలో జనసంఖ్య‌లో మార్పు, ఓటు బ్యాంక్, సరిహద్దు రాజకీయాలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇక‌ అమిత్ షా వ్యాఖ్యలు ఎలాంటివంటే.. అక్రమ వలసలను జనాభా సమతుల్యతను మార్చడానికి ప్రణాళికా బద్ధమైన కుట్ర గా పేర్కొనడం, సరిహద్దు భద్రతను కేవలం భౌతిక భద్రత కాకుండా, జనాభా వివ‌రాల‌ను కూడా ఒక రాజకీయ ప్రశ్నగా మారుస్తోంది. ఇది.. సరిహద్దు రాష్ట్రాల్లో అంటే, అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్.. ఓటు బ్యాంక్ రాజకీయాలు, మైనారిటీ–మేజారిటీ సమీకరణలు.. NRC, CAA, బంగ్లాదేశ్ వలసలపై రాజకీయ వాదోపవాదాల‌తో ముడిపడి ఉన్న సున్నితమైన అంశంగా తెలుస్తోంది. సరిహద్దు రాష్ట్రాల రాజకీయ స్పందన ఎలాంటిదంటే.. కొన్ని రాష్ట్రాలు అక్రమ వలసల సమస్యను బహిరంగంగా అంగీకరిస్తూ.. స్మార్ట్ బోర్డ‌ర్, ఫెన్సింగ్, బీఎస్ఎఫ్ బలపరిచే చర్యలకు మద్దతు ఇస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు, అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల.. స్థానిక మైనారిటీ సమాజాలపై ప్రభావం ఉంటుందని, రాజకీయ–సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదిస్తున్నాయి. నదీ సరిహద్దు, చార్ ల్యాండ్స్, అడవి ప్రాంతాల్లో నివసించే ప్రజలు.. స్మగ్లింగ్, అక్రమ వలసల నెట్‌వర్క్‌లకు బలవంతంగా లేదా ఆర్థిక కారణాల వల్ల ముడిపడే పరిస్థితులు.. BSF, స్థానిక ప్రజల మధ్య నమ్మకం, అనుమానం, అప్పుడ‌ప్పుడూ ఆయా స‌మ‌యాస‌మ‌యాల్లో జ‌రిగే ఘర్షణలు వంటి అంశాలు ఎంతో విలువైన‌వి. AI ఆధారిత స్మార్ట్ బోర్డర్- భద్రతా ప్రయోజనం ఎలాంటిదంటే.. చొరబాట్లను ముందే గుర్తించి అడ్డుకోవడం.. డ్రగ్స్, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా తగ్గించే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్క‌డ మానవ హక్కుల ప్రశ్న ఎలాంటిదంటే, నిరంతర నిఘా.. ప్రైవ‌సీ, డేటా ప్రొటెక్ష‌న్, ఫేసియ‌ల్ రిక‌గ్నేష‌న్ వంటి అంశాల‌పై భ‌విష్య‌త్తులో చ‌ర్చ‌లు అవ‌స‌రం. ఇక మీడియా కోణంలోం చూస్తే.. సాంకేతికత, భద్రత, పొలిటిక‌ల్ నారేటివ్ విష‌యానికి వ‌స్తే.. భారతీయ మీడియా, స్మార్ట్ ప్రాజెక్టును.. సాంకేతికతతో కూడిన ఛేదించలేని రక్షణ కవచం వంటి పదాలతో డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, AI వీడియో అనలిటిక్స్, అంచనా ఆధారిత భద్రత వంటి అంశాలను హైలైట్ చేస్తూ ప్రదర్శిస్తోంది. అయితే.. అక్రమ వలసల వల్ల సరిహద్దు రాష్ట్రాల జ‌నాభా మార్పు, స్థానిక రాజకీయ పార్టీల ఓటు బ్యాంక్ వ్యూహాలు, మతపరమైన అతి తీవ్రవాద నెట్‌వర్క్‌లు, డ్రగ్ కార్టెల్స్.. వంటి అంశాలపై డేటా ఆధారిత చర్చ అవసరం. AI ఆధారిత స్మార్ట్ బోర్డర్ సాంకేతిక నిర్మాణం ఎలాంటిదో చూస్తే, AI ఆధారిత థర్మల్ కెమెరాలు, రాడార్ సిస్టమ్స్ తో ప‌ని చేస్తుంది. ఇక‌ థర్మల్ కెమెరాలు- చీకటి, పొగమంచు, వర్షం, అడవి, చిత్తడి నేలల్లో కూడా మానవ శరీర ఉష్ణోగ్రత ఆధారంగా కదలికలను గుర్తించగ‌ల‌వు. రాడార్ సిస్టమ్స్.. పెద్ద పరిధిలో కదలికలను గుర్తించి, AI సాఫ్ట్‌వేర్ ద్వారా ప్యాట్ర‌న్ ఎనాల‌సిస్ చేయ‌గ‌ల‌వు. ఏఐ వీడియో ఎన‌ల‌టిక్స్ సంగ‌తి చూస్తే.. సాధారణ కదలికలు వ‌ర్సెస్ అనుమానాస్పద కదలికలు ఎలాంటివో ప‌సిగ‌ట్ట‌గ‌ల‌వు. జ‌న‌స‌మూహాల్లోని అసాధార‌ణ క‌ద‌లిక‌లు ప‌దే ప‌దే క‌నిపించ‌డాన్ని గుర్తు ప‌డ‌తాయి. ఈ అనుమానాస్పద కదలికలపై వెంటనే కంట్రోల్ రూమ్‌ను అలర్ట్ చేస్తాయి. ఇక డ్రోన్ల ముప్పు – యాంటీ-డ్రోన్ వ్యవస్థలు ఎలా వ‌ర్క్ చేస్తాయంటే, సరిహద్దుల్లో.. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీ, IEDs.. పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇటీవలి సంవత్సరాల్లో డ్రోన్ చొరబాట్లు పెరుగుతున్నాయి. AI ఆధారిత స్మార్ట్ బోర్డ‌ర్ కంప్లీట్ పిక్చ‌ర్ ఎలాంటిదంటే, లో ఫ్ల‌యింగ్ స్మార్ట్ డ్రోన్స్ ని గుర్తిస్తుంది. డ్రోన్ క‌మ్యూనికేష‌న్, జీపీఎస్, ఆర్ఎఫ్ సిగ్న‌ల్స్ ని జామ్ చేయ‌డం, మైక్రో డ్రోమ్స్ ఫ‌ర్ ఏరియ‌ల్ స‌ర్వైలెన్స్ బీఎస్ఎఫ్ త‌ర‌ఫున గ‌గ‌న త‌ల నిఘా ఏర్పాటు చేస్తుంది. వ‌ర్చువ‌ల్ ఫెన్స్ లేజ‌ర్ డిజిట‌ల్ సెన్సార్లు.. భౌతిక కంచె వేయ‌ల‌ని ప్రాంతాల్లో ప‌ని చేస్తాయి. ఇక లేజ‌ర్ బీమ్స్, మైక్రోవేవ్ లైన్స్, అండ‌ర్ వాట‌ర్ సెన్సార్లు.. అన్ సీన్ డిజిట‌ల్ ప‌రీమీట‌ర్ అంటే కంటికి క‌నిపించ‌ని కంచెల‌ను సృష్టిస్తాయి. ఎవరైనా ఈ పరిధిలోకి ప్రవేశిస్తే, సెన్సార్ యాక్టివేట్ అవుతుంది, కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ పంపుతుంది. ధుబ్రీ BOLD-QIT ప్రాజెక్ట్, ఈ వ‌ర్చువ‌ల్ ఫెన్స్ కాన్సెప్ట్‌కు ఒక ప్రాథమిక నమూనా. ఇక భూగర్భ వైబ్రేషన్ సెన్సార్లు – సొరంగాలు, భూగర్భ చొరబాట్లు.. వంటి అంశాల‌కు వ‌స్తే.. సరిహద్దు దాటడానికి భూగర్భ సొరంగాలు తవ్వడం, నడవడం వంటి కదలికల వల్ల కలిగే ప్రకంపనలను వైబ్రేష‌న్ సెన్సార్స్ ద్వారా గుర్తించి, AI సిస్టమ్ వాటిని విశ్లేషిస్తుంది. సొరంగాల ద్వారా చొరబాటు ప్రయత్నాలను ముందే గుర్తించే అవకాశం క‌ల్పిస్తుంది. సరిహద్దు కెమెరాలు, సెన్సార్లు, రాడార్లు, డ్రోన్ల నుండి వచ్చే డాటా.. కేవలం స్క్రీన్‌లపై చూసే మానవ పహారా కాకుండా, AI ఆధారిత వీడియో ఎనాల‌సిస్ చేస్తాయి. ఇక ప్రిడెక్టివ్ సెక్యూరిటీ విష‌యానికి వ‌స్తే.. గత చొరబాట్ల డేటా సేక‌రిస్తుంది. వర్షాకాలం, పండుగలు, ఎన్నికలు వంటివి కూడా ప‌సిగ‌డ‌తాయి. స్పెసిఫిక్ హాట్ స్పాట్స్ అంటే, స్మగ్లింగ్ రూట్లు, నదీ చానెల్స్.. వీటి ఆధారంగా ముందస్తు అంచనాలు, క్విక్ రియాక్ష‌న్ టీమ్ మొహ‌రింపు, రియ‌ల్ టైం డేటా షేరింగ్.. బీఎస్ఎఫ్, స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు.. మధ్య డేటా షేరింగ్ ద్వారా మ‌ల్టీ ఏజెన్సీ కోఆర్డినేష‌న్ బలపడుతుంది. చొరబాటు జరిగిన తర్వాత, స్పందించడం కాకుండా, ముందే గుర్తించి అడ్డుకోవడం, కఠిన భౌగోళిక ప్రాంతాల్లో.. జవాన్ల భౌతిక పహారా అవసరాన్ని తగ్గించడం, ఇర‌వైనాలుగ్గంట‌లూ – జవాన్లు నిరంతరం స్క్రీన్‌లను చూడాల్సిన అవసరం లేకుండా, AI తేడా కనిపిస్తేనే అలర్ట్ అవుతాయి. దీని ద్వారా క్రాస్ బోర్డ‌ర్ క్రైమ్స్ తగ్గించే అవకాశం ఏర్ప‌డుతుంది. వీటి ద్వారా అక్రమ వలసలు, డ్రగ్స్, ఆయుధాలు మానవ అక్రమ రవాణా, గోవు స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, మేకిన్ ఇండియా – డిఫెన్స్ స్టార్టప్‌ల పాత్ర ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో వాడే AI కెమెరాలు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్‌ల‌లో ఎక్కువ శాతం భారతీయ డిఫెన్స్ స్టార్టప్‌లు, మేకిన్ ఇండియా ద్వారా అభివృద్ధి అవుతున్నాయి. ఇది దేశీయ రక్షణ పరిశ్రమకు పెద్ద అవకాశాలకు మార్గం సుగ‌మం చేస్తోందనీ తెలుస్తోంది. కొన్ని కీలక ప్రశ్నలు ఎలాంటివంటే, అక్రమ వలసలపై స్పష్టమైన డేటా. సరిహద్దు రాష్ట్రాల జనాభా మార్పు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, మతపరమైన అతి తీవ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధం క‌లిగి ఉంటాయి. ఇక ఏఐ స‌ర్వైలెన్స్ వ‌ర్సెస్ ప్రైవ‌సీ విష‌యానికి వ‌స్తే.. సరిహద్దు ప్రాంత ప్రజలపై నిరంతర నిఘా ఉంటుంది. ఫేసియ‌ల్ రిక‌గ్నైజేష‌న్, డాటా రీటెన్ష‌న్, అకౌంట‌బిలిటీ నిరంత‌రం ప‌ని చేస్తుంటాయి. వాతావరణం, వరదలు, చిత్తడి నేలల్లో సెన్సార్‌ల పనితీరు కూడా ఇక్క‌డ కీల‌క‌మే. ఇవి త‌ప్పుడు సంకేతాలు ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. సాంకేతికతను మానవ ఇంటెలిజెన్స్‌కు ప్రత్యామ్నాయంగా కాకుండా, సహాయకంగా ఉపయోగించడం- BSF జవాన్ల శిక్షణ, SOPs, అకౌంట‌బిలిటీ.. వంటివి కీల‌కాంశాలుగా ఉన్నాయి. సరిహద్దు భద్రత ఇప్పుడు కేవలం కంచెలు, గస్తీ, గన్‌ల కథ కాదు—AI, డ్రోన్లు, సెన్సార్లు, ముందస్తు అంచనా విశ్లేషణతో కూడిన డిజిటల్ కంచె కథ. అక్రమ వలసలు దేశ జనసంఖ్య‌ను మార్చే కుట్రగా పేర్కొంటూ, స్మార్ట్ బోర్డ‌ర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి చొరబాటుదారుని గుర్తించి, దేశం వెలుపలికి పంపుతామని కేంద్రం స్పష్టంగా ప్రకటించడం, రాజకీయ–సామాజిక చర్చకు కొత్త దిశను ఇస్తోంది. ధుబ్రీ బ్రహ్మపుత్ర నదీ సరిహద్దులో BOLD-QIT ద్వారా అమలు చేసిన వ‌ర్చువ‌ల్ ఫెన్సులు, భౌతికంగా కంచె వేయలేని ప్రాంతాల్లో.. డిజిటల్ కంచె ద్వారా సరిహద్దు భద్రత సాధ్యమని నిరూపించిన ప్రాథమిక నమూనా. AI ఆధారిత స్మార్ట్ బోర్డ‌ర్, BSF జవాన్ల భౌతిక పహారాను పూర్తిగా భర్తీ చేయకపోయినా, వారి భద్రత, సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే ఫోర్స్ మ‌ల్టిప్లేయ‌ర్ గా పనిచేస్తోంది. భారత్‌ సరిహద్దు భద్రతను విశ్లేషించేటప్పుడు.. అక్రమ వలసలు, స్మగ్లింగ్, డ్రగ్స్, ఆయుధాలు మతపరమైన అతి తీవ్రవాదం.. జనసంఖ్య‌ మార్పు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, వంటి అంశాలను- ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడుకుంటే, స్పష్టంగా, డేటా ఆధారంగా చర్చించడం తప్పనిసరి. సరిహద్దు భద్రతలో సాంకేతిక విప్లవానికి నాంది- భౌతికంగా కంచె వేయలేని ప్రాంతాల్లో డిజిటల్ కంచె ద్వారా భద్రత సాధ్యమని నిరూపించారు. BSF, రాష్ట్ర పోలీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని బలపరచే వ్యవస్థ అయితే, ఈ సాంకేతికత. పాలిటికల్ విల్, న్యాయపరమైన స్పష్టత, మానవ హక్కుల పరిరక్షణ, సమాజ–రాజకీయ సమతుల్యతతో కలిసి పనిచేసినప్పుడే, నిజమైన జాతీయ భద్రతా ప్రయోజనాలను అందిస్తుంది. అక్రమ వలసలు, స్మగ్లింగ్ అరికట్టడానికి మోడీ ప్రభుత్వం AI-పవర్డ్ స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్.. BSF భద్రతను డిజిటల్ భద్రతగా మార్చే దారి అపార సాంకేతిక పరిజ్ఞానంతో 6వేల‌ కి.మీ సరిహద్దులను అభేద్యంగా మార్చే భారత్ యోజన. బంగ్లాదేశ్, పాక్ సరిహద్దులలో చొరబాట్లు అరికట్టే BOLD-QIT నుంచి AI థర్మల్ కెమెరాలు, వర్చువల్ ఫెన్సింగ్ వరకు ఇదొక‌ పూర్తి విశ్లేషణ. భారతదేశం తన నాలుగు వైపులా ఉన్న పెద్ద సరిహద్దులతో దశాబ్దాలుగా అక్రమ వలసలు, స్మగ్లింగ్, హ్యూమ‌న్ ట్రాఫికింగ్, ఫోర్సెస్ రషింగ్, డ్రగ్స్ సరఫరా, అంతర్జాతీయ చొరబాట్లను ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్తో 4,096 కి.మీ (ప్రపంచంలోనే పొడవైన అంతర్జాతీయ సరిహద్దులలో ఐదవది, పాకిస్తాన్ తో మ‌న స‌రిహ‌ద్దు- 3,310 కి.మీ కాగా, మాయన్మార్ తో.. 1,643 కి.మీ, నేపాల్ తో 1,770 కి.మీ సరిహద్దులు ఉన్నాయి. ఈ సరిహద్దుల పొడవు వల్ల ప్రతి చోటా BSF జవాన్లను రక్షణగా ఉంచలేరు. అవకాశం ఉన్న చోట్ల ఫెన్సింగ్ వేస్తున్నా, నదులు- బ్రహ్మపుత్రా, చిత్తడి నేలలు- సుందర్బన్స్, బురద నేలలు, కొండలు వంటి ప్రదేశాల్లో ఫెన్సింగ్ వేయడం కుదరటం లేదు. 1990ల నుంచి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ పూర్తి చేయడానికి పోటీలను నిర్దేశించింది, కానీ మార్చి 2024 నాటికి ఇప్పటికీ 952 కి.మీ సరిహద్దు ఫెన్సింగ్ లేని స్ట్రెచ్‌గా ఉంది. 2017లో.. మోడీ ప్రభుత్వం CIBMS- అంటే కంప్ర‌హెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బోర్డ‌ర్ మేనేజ్మెంట్ సిస్ట‌మ్ కోసం.. టెక్నాల‌జీ సొల్యూష‌న్ల‌ను నిర్ణ‌యించింది. 2018 జనవరిలో BSF ఐటీ వింగ్ BOLD-QIT ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 2018 సెప్టెంబర్ లో.. జమ్మూలో పాకిస్తాన్ సరిహద్దులో రెండు 5.5 కి.మీ స్మార్ట్ ఫెన్సింగ్ పైలట్ ప్రాజెక్ట్‌లు ఆప‌రేష‌న‌ల్ అయ్యాయి. 2019 మార్చి 4న అసోం దుబ్రీలో బంగ్లాదేశ్ సరిహద్దులో BOLD-QIT ప్రాజెక్ట్‌ను రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. 2026 మే 22న అమిత్ షా BSF ఇన్వెస్టిచర్ సెర్మ‌నీలో స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్ విశ్లేషణను ఆవిష్కరించారు. BOLD-QIT ప్రాజెక్ట్‌ను 2019లో అసోం దుబ్రీలో బ్రహ్మపుత్రా నది సరిహద్దు ప్రాంతంలో ప్రారంభించారు, ఇక్కడ భౌతిక ఫెన్సింగ్ సాధ్యం కానీ ప్రదేశంలో డిజిటల్ కంచె ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ పై కోల్ క‌త‌ హైకోర్ట్- 2026 జనవరి 31న వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి ఒక కొత్త‌ ఆదేశం ఇచ్చింది. నాలుగు జిల్లాల్లో BSF కు భూమిని అప్పగించాలి. 2025 డిసెంబర్ 7న హైకోర్ట్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నుంచి అఫిడ‌విట్ కోరింది, ఓపెన్ బోర్డర్ ఏరియాలో.. బేర్డ్ వైర్ ఫెన్సింగ్ అవసరం అని PILలో ఆక్షేషిచారు. 2005లో సుప్రీం కోర్టు ఇది రాజ‌కీయాల‌కు సంబంధించిందికాదు.. జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన ప్ర‌శ్న‌గా వ‌ర్గీక‌రించింది. 2026 మే లో అమిత్ షా మోడీ డాక్ట్రిన్ ను వివరించారు. గతంలో ప్రభుత్వాలు కేవలం చర్చలకే పరిమితమవ్వడంతో ఉగ్రవాద దాడులు, నక్సలైట్ గ్రూపులు ఎలాంటి భయం లేకుండా మారణకాండకు పాల్పడ్డాయి, కానీ ఇది సరికొత్త రక్షణ విధానం ఇండో-పాక్ సరిహద్దులో సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నామ‌ని అన్నారు. 2025లో భారతదేశ తూర్పు సరిహద్దు.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి గుర్తింపు పత్రాలు లేని అక్రమ వలసదారులు- స్వచ్ఛందంగా భారతదేశాన్ని విడిచి వెళ్లడం- 3 రెట్లు పెరిగింది. 2024లో ఈ సంఖ్య 1,049 గా ఉండగా, 2025 జూలై 15 నాటికిది 3,536 కి చేరింది. భారతదేశ సరిహద్దు భద్రతను పటిష్టం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సానుకూల, విమర్శనాత్మక, వివాదాస్పద చర్చలకు దారితీసింది. 2019లో BOLD-QIT ప్రారంభంపై కొన్ని మీడియా సంస్థ‌లు సానుకూల కవరేజ్ ఇవ్వగా, 2026లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సరిహద్దు ప్రాజెక్టును అత్యంత సుదృఢమైన, ఛేదించలేని వ్యవస్థగా అభివర్ణించారని మ‌రో ప‌త్రిక పేర్కొంది. CIBMS స్మార్ట్ ఫెన్సింగ్ ఫలితంగా.. జమ్మూ సరిహద్దుల్లో రియ‌ల్ టైమ్ మోన‌ట‌రింగ్ కి సాధ్యమవడమే కాకుండా, దట్టమైన పొగమంచు, తుఫానులు, భారీ వర్షాలలో కూడా 24 గంట‌ల‌ పర్యవేక్షణ సులువవుతూ, నిరంతర మానవ నిఘా భారం నుంచి BSF జవాన్లకు ఉపశమనం లభించింది. అయినప్పటికీ, 2026 లో ఒక ప‌త్రిక‌ విశ్లేషించినట్లుగా.. ఈ అత్యాధునిక AI సర్వైలెన్స్ వల్ల గోప్యతకు భంగం కలిగే హిడెన్ రిస్క్‌లు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, నదీ సరిహద్దుల్లోని ఖాళీలను- పూడ్చడానికి మొసళ్ళు, పాములను ఉపయోగించాలనే సరిహద్దు భద్రతా దళాల ప్రతిపాదనపై 2026 ఏప్రిల్ 30న ఒక అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ ప్రచురించిన నివేదిక, మానవ హక్కుల, వన్యప్రాణి సంరక్షకుల తీవ్ర ఆందోళనలకు కారణమై వివాదాస్పదంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా భారతీయ డిఫెన్స్ స్టార్టప్‌లు ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ టెక్నాలజీస్ 2026 మే 26న AI, డ్రోన్లు, అధునాతన సెన్సార్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ బోర్డర్ సూట్ ను లాంచ్ చేసి, సుమారు 6,000 కిలోమీటర్ల సరిహద్దు నిఘాను స్వదేశీ సాంకేతికతతో మరింత పటిష్టం చేసింది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 10, 2026 4:31PM

political-news-img

సువార్త బోధనలపై ఎందుకు ఆసక్తి తగ్గిపోతోంది?

ఎవాంజెలికల్ థియాలజీని.. అంటే క్రిస్టియన్ మత ప్రభోదకులు చెప్పే సువార్త బోధనలు. ఎవాంజెలికల్ థియాలజీని నమ్ముతున్న చర్చిలు, చాలా మంది క్రిస్టియన్లు దాని ప్రాథమిక సిద్ధాంతాలు, సంస్థాగత పద్ధతుల పట్ల విముఖతతో నిశ్శబ్దంగా వాటికి దూరమవుతున్నారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కాలక్రమేణా మతపరమైన ఆచారాలు, బోధనలలో వస్తున్న మార్పులు, సామాజిక కారణాల వల్ల ఈ ధోరణి పెరుగుతోందంట. ఎవాంజెలికల్ చర్చిలు సాంప్రదాయ బైబిల్ బోధనలకు ప్రాధాన్యతనివ్వడం మాని, సామాజిక క్లబ్బులు లేదా వినోద వేదికలుగా మారుతున్నాయని చాలా మంది అసహనంతో కనిపిస్తున్నారు. పాస్టర్ల వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ ధోరణులు, స్పష్టమైన బైబిల్ మార్గదర్శకాలను పక్కతోవ పట్టించేలా వ్యవహరిస్తుండటం ఈ పరిస్థితికి కారణమంటున్నారు. దాంతో చాలా మంది ఆదివారం సువార్త బోధనలకు వెళ్లే అలవాటును క్రమక్రమంగా వదిలేస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే మార్పులు, వలసలు, లేదా చిన్న చిన్న ఘటనలు కూడా దానికి కారణం కావచ్చన్న వాదన కూడా ఉంది. మత విశ్వాసులు ఇప్పుడు భవనాలకు లేదా ఒక నిర్దిష్ట వ్యవస్థ బోధనలకు పరిమితం కావడం లేదని, పాడ్‌క్యాస్ట్‌లు, ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లు, లేదా చిన్న గ్రూపుల ద్వారా ఆధ్యాత్మికతను పంచుకుంటున్నారు. ఎవాంజెలికల్ అనేది సువార్తక విశ్వాసం కంటే, ఒక నిర్దిష్ట రాజకీయ, సాంస్కృతిక శిబిరానికి సంకేతంగా మారిపోవడంతో, అనేక చర్చిలు ఆ లేబుల్‌ను నిశ్వబ్దంగా వదిలేస్తున్నాయి. 2006లో అమెరికా జనాభాలో 23%గా ఉన్న వైట్ ఎవాంజెలికల్ ప్రొటెస్టెంట్లు, 2023 నాటికి 13.5%కు పడిపోయారు; సదర్న్ బాప్టిస్ట్ కన్వెన్షన్ సభ్యత్వం 16.3 మిలియన్ల నుండి 13.2 మిలియన్లకు తగ్గిందని గణాంకాలు చెప్తున్నాయి. డీకన్స్‌ట్రక్షన్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తమ పూర్వ ఎవాంజెలికల్ గుర్తింపును విచ్ఛిన్నం చేసుకుంటూ, కొత్త విశ్వాస–అన్వేషణ మార్గాల్లోకి వెళ్తున్నారు. కొందరు ప్రోగ్రెసివ్ క్రైస్తవత్వం వైపు, కొందరు కాథలిక్, ఆర్థడాక్స్, ఆంగ్లికన్ లిటర్జికల్ సంప్రదాయాల వైపు, మరికొందరు పూర్తిగా “నన్స్” వర్గంలోకి మళ్లుతున్నారు. 1940–60ల మధ్య కాలంలో, బిల్లీ గ్రాహం ఆధ్వర్యంలో ఆధునిక ఎవాంజెలికల్ ఉద్యమం ఒక గౌరవనీయ, మధ్య మార్గం శక్తిగా ఎదిగింది. 1949 లాస్ ఏంజెలెస్ క్రూసేడ్, 1956 క్రిస్టియానిటీ టుడే, 1947 ఫులర్ థియాలజికల్ సెమినరీ , 1942 నాటి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎవాంజెలికల్స్ ..ఇవన్నీ కలిసి, ఫండమెంటలిజం, లిబరల్ మెయిన్ లైన్ల మధ్య బైబిల్ నిబద్ధత, బౌద్ధిక చర్చ, సాంస్కృతిక సంబంధం అనే సమతుల్య ప్రతిమను నిర్మించాయి.1979 లో జెర్రీ ఫాల్వెల్ మోరల్ మెజార్టీ, 1988లో ప్యాట్ రాబర్ట్సన్ అధ్యక్ష ఎన్నికల పోటీ, 1977 నాటి జేమ్స్ డాబ్సన్ ఫోకస్ ఆన్ ద ఫ్యామిలీ, రాల్ఫ్ రీడ్ క్రిస్టియన్ కోయలిజేషన్‌లు ఎవాంజెలికలిజాన్ని కుడిపక్ష రిపబ్లికన్ రాజకీయాలతో ముడిపెట్టాయి. అబార్షన్, గే హక్కులు, స్కూల్ ప్రార్థనలు, క్రియేషనిజం, కల్చర్ వార్ అంశాలు – ఇవన్నీ ఎవాంజెలికల్ థియాలజీతో కలిసిపోయి, ప్రజల్లో ఎవాంజెలికల్- కుడిపక్ష రిపబ్లికన్ అనే భావన పెంచాయి. 1990 -2000 మధ్యకాలంలో మెగా చర్చిల మోడల్, టెలివిజన్ ఎవాంజెలిజం, చర్చిలో ఓటర్ గైడ్లు ఇవన్నీ యువ ఎవాంజెలికల్స్లో అసౌకర్యాన్ని పెంచాయి. 2016లో డొనాల్డ్ ట్రంప్‌‌కు 81% వైట్ ఎవాంజెలికల్ ఓటు రావడం, అనేక మంది యువ, మధ్యతరగతి విశ్వాసులకు బ్రేకింగ్ పాయింట్ అయింది. జెర్రీ ఫాల్వెల్ జూనియర్, రాబర్ట్ జెఫ్రెస్, ఫ్రాంక్లిన్ గ్రాహం, పౌలా వైట్ వంటివారు ట్రంప్‌కు మద్దతిచ్చి.. ‘క్యారెక్టర్ ముఖ్యం’ అని రాజకీయ లాభం కోసం చేసిన ప్రచారం.. పలువుర్ని సువార్త బోధనలకు దూరం చేసిందంటారు. ఆ క్రమంలో బెత్ మూర్, రస్సెల్ మూర్ వంటి ప్రముఖులు సదర్న్ బాప్టిస్ట్ కన్వెన్షన్ను విడిచిపెట్టి, అంతర్గత సంస్కరణకు చేసిన ప్రయత్నాలు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాయి. సదర్న్ బాప్టిస్ట్ కన్వెన్షన్ 1984లో మహిళల ఆర్డినేషన్‌కు వ్యతిరేక తీర్మానం జరిగింది. ఇవి మహిళల నాయకత్వాన్ని పరిమితం చేసింది.2023లో SBC రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా పాస్టర్లను చర్చిలు బహిష్కరించగా, రిక్ వారెన్ స్థాపించిన సాడిల్ బ్యాక్ చర్చ్‌ను కూడా బయటకు పంపింది. అది మతవిశ్వాసులపై మరింత ప్రభావం చూపించింది. తరతరాలుగా జరుగుతున్న ఇలాంటి పోకడలతో సువార్త బోధనల పట్ల మతవిశ్వాసుల ఆసక్తి సన్నగిల్లుతూ వస్తోంది. ఎవాంజెలికల్ చర్చిలు తమ థియాలజీ, లేబుల్, సంస్థాగత అనుబంధాలను వదిలేస్తున్నాయి. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 10, 2026 4:16PM

political-news-img

అమరావతికి మరో భారీ ప్రాజెక్ట్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వైభవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం (జూన్ 10) జరిగిన ఉన్నత స్థాయి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అమరావతిలో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యంత ఆధునిక నివాస సముదాయాల నిర్మాణానికి ఏకంగా 1,234.91 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో కేంద్ర ప్రభుత్వం నేరుగా చేపడుతున్న మొట్టమొదటి అతిపెద్ద జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జీపీఆర్ఏ) ప్రాజెక్ట్ ఇదే కావడం గమనార్హం. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ప్రసిద్ధ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడ‌బ్ల్యూడీ) ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చేపడుతుంది. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రీ-బిడ్ కార్యకలాపాలు పూర్తి కావచ్చాయనీ, టెండర్ పత్రాల రూపకల్పన ప్రక్రియ పురోగతిలో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అత్యాధునిక నివాస సముదాయాన్ని అమరావతిలో 17 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ మెగా జీపీఆర్ఏ క్యాంపస్‌లో ఆకాశాన్నంటేలా మొత్తం 11 భారీ నివాస టవర్లను నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే వివిధ శ్రేణుల ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా టైప్-II నుంచి మొదలుకొని అత్యున్నత స్థాయి అయిన టైప్-VI కేటగిరీల వరకు మొత్తం 1,504 ఫ్లాట్లను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు. కేవలం నివాసాలే కాకుండా, ఇక్కడకు వచ్చే వాహనాల రద్దీని నియంత్రించేందుకు 1,972 కార్లను ఒకేసారి పార్క్ చేసుకునేలా అత్యాధునిక బేస్‌మెంట్ పార్కింగ్ సదుపాయాన్ని కూడా డిజైన్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాజెక్టును పూర్తిగా పర్యావరణ హితంగా, గ్రీన్ బిల్డింగ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్నారు.

Publish Date: Jun 10, 2026 4:06PM

political-news-img

తెలంగాణలో బీజేపీకి ఒంటరి ఎజెండా కలిసి వస్తుందా?

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బరిలోకి దిగిన బీజేపీ 5 స్థానాలు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ 12 చోట్ల విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాషాయపార్టీ ఒక్క సీటుకే పరిమితమైంది. 2023 ఎన్నికల్లో ప్రత్యామ్నాయం తామే అని ఊదరగొట్టిన కాషాయ నేతలు 8 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్క సారి కూడా డబుల్ డిజిట్ సీట్లు గెలవని ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంపై కలలు కంటూనే ఉంది. ఇక ఇప్పుడు ఒకవైపు జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్‌కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో అమిత్‌షా సోలో ప్రకటన చర్చనీయాంశం అయ్యింది.

Publish Date: Jun 10, 2026 3:50PM

MOVIE NEWS