రికార్డ్ బద్దలు.. 30వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్..


ఈరోజు స్టాక్ మార్కెట్లు రికార్డులు స్థాయిలో ముగిశాయి. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో ఆరంభం నుంచే జోరుగా సాగిన దేశీయ సూచీలు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ తొలిసారిగా 30వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ మళ్లీ రికార్డు స్థాయిలో ముగిసింది. బుధవారం మార్కెట్‌ ముగిసే సమయానికి 190 పాయింట్లు ఎగబాకి తొలిసారిగా 30,133 పాయింట్ల జీవనకాల గరిష్ఠ స్థాయిలో స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా మరోసారి సొంత రికార్డును బద్ధలుకొట్టింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో తొలిసారిగా 9,300 మార్క్‌ను దాటిన నిఫ్టీ.. నేడు 45పాయింట్లు లాభపడిన నిఫ్టీ 9,352 వద్ద స్థిరపడింది. ఇక జాతీయ స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌లో మహింద్రా అండ్‌ మహింద్రా, ఐటీసీ, హిందాల్కో, హిందుస్థాన్‌ యునిలివర్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడగా.. టెక్‌మహింద్రా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, అదానీపోర్ట్స్‌, హెసీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టపోయాయి.