ఏపీలో వైసీపీకి ఛాన్స్.. ప్రొఫెసర్ కె.నాగేశ్వర్

 

ఏపీలో వైసీపీనే గెలిచే అవకాశముందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సైతం ఓ ఇంటర్య్వూలో ఏపీలో గెలుపు ఎవరిది అన్న దానిపై విశ్లేషణ చేశారు. ఎన్నికల ఫలితాలపై ఆయన ఎలాంటి సర్వేలు చేయించలేదన్నారు. కానీ.. కేవలం విశ్లేషించి మాత్రమే గెలుపోటములపై అంచనా వేశానన్నారు. 

ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే సీట్లు 50 వరకూ ఉన్నాయి. దీన్ని అంతా అంగీకరిస్తున్నారు. అలాగే వైసీపీ కూడా కచ్చితంగా గెలిచే సీట్లు 65 వరకూ ఉన్నాయి అన్నారు. ఇవిపోగా ఇంకా మిగిలినవి 60 సీట్లు. ఈ 60 సీట్లలో సాగిన హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రావాలంటే.. ఈ 60 సీట్లలో టీడీపీ కనీసం 40 సీట్లు గెలవాల్సి ఉంటుంది. కానీ ఇది చాలా కష్టం అని చెప్పొచ్చు అని అభిప్రాయపడ్డారు. అంటే విజయావకాశాలు జగన్‌కే ఉన్నాయని ఆయన చెబుతున్నారు అనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఏపీలో అనుభవానికి ఓటేశారని, అయితే ఈసారి జగన్ కే మొగ్గు కనిపిస్తోందని పేర్కొన్నారు. జనసేనకు 3 నుంచి 5 సీట్లు వస్తాయని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీకి 15 సీట్ల వరకు రావొచ్చని వెల్లడించారు. వాస్తవానికి జనాల్లో చంద్రబాబుపై వ్యతిరేకత లేకపోయినా, జగన్ కు ఒక్క చాన్స్ ఇచ్చి చూడాలన్న అభిప్రాయమే ఓటింగ్ సరళిపై ప్రభావం చూపించి ఉండొచ్చని నాగేశ్వర్ విశ్లేషించారు.