వైసీపీ నేత హత్య కేసులో కొల్లు రవీంద్రపై కేసు నమోదు 

కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కర రావు హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు పోలీసులు. కుట్రదారుగా కొల్లు రవీంద్రపై 109 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మోకాను హత్య చేస్తే తర్వాత అంతా తాను చూసుకుంటా అని కొల్లు రవీంద్ర అభయం ఇచ్చినట్టు నిందితులు పోలీస్ విచారణ వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. హత్యలో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్టు తేలితే ఆయన్ని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. 

కాగా, 2013 లో మోకా భాస్కర రావు చేసిన హత్యలో తమ తండ్రిని కోల్పోవడంతో కక్ష పెంచుకున్న కొడుకులు ఇద్దరు మోకా భాస్కర రావును హత్య చేశారని తెలుస్తోంది. నిందితుల్లో ఒకరి వయసు 19 సంవత్సరాలు కాగా, మరకొరి వయసు 17 సంవత్సరాలు. మరోవైపు, హత్య కేసులో కావాలని మాజీ మంత్రి పేరు ఇరికంచారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.