అత్యాచారాలు చేసి..అభ్యున్నతి అంటారు

మనలో పాపం చేయనివారు ఎవరో చెప్పండి అన్నట్లు..దేశంలో మచ్చలేని నాయకుడెవరో చెప్పండి అంటే జనాలు నోరెళ్లబెట్టాల్సిందే..నిజానికి వారికున్నన్ని మచ్చలు బహుశా మరెవరికీ ఉండవేమో. ఇక్కడ మచ్చ అంటే నేరం అని అర్థం. ఘనత వహించిన మనదేశ చట్ట సభల్లో ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న నేతల్లో మెజారిటీ నేతలందరూ చిన్నదో పెద్దదో నేరం చేసినవారేనట. "అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫర్మ్స్" అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో ఇండియన్ పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలోని ప్రజా ప్రతినిధుల్లో 51 మంది మహిళలపై నేరాలు చేసినవారేనని తేల్చింది. నామినేషన్ సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన సెల్ఫ్ డిక్లేర్డ్ అఫిడవిట్‌లను పరిశీలించిన ఏడీఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది.

 

774 మంది ఎంపీలు ..4,078 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను నిశీతంగా పరిశీలించగా..1,581 మంది ఏదో ఒక నేరం చేసి కేసులు ఎదుర్కొన్న వారేనని..వీరిలో 334 మంది మహిళలపై నేరాలు చేశారని వెల్లడించింది. ఈ జాబితాలో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా..తర్వాతి స్థానాల్లో శివసేన, తృణమూల్ కాంగ్రెస్ నిలిచాయి. "యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత:" ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అన్నది దీని అర్థం. పర స్త్రీని మాతృమూర్తిగా గౌరవించే సంస్కృతి మనది..కానీ నేడు మహిళలకు రక్షణ ఎక్కడుంది..? ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో చూసినా అందులో మొట్టమొదటగా కనిపించేది మహిళా సాధికారత, మహిళా అభ్యున్నతి గురించే.

 

కానీ రక్షణ కల్పించాల్సిన పాలకుల స్థానంలో భక్షించే కీచకులున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీనిని బట్టి దేశంలోని మహిళలకు ఆయా పార్టీలు ఇచ్చే గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలో ప్రతీ 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతోంది...ప్రతి 34 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది..నగరాలు, పట్టణాలు చివరికి గ్రామాల్లో సైతం మహిళలపై దాడులు జరుగుతుండటం దేశంలో నెలకొన్న పరిస్థితి ఎంత విషమంగా ఉందో చెబుతోంది. నేర చరితులు, శిక్ష అనుభవించిన..అనుభవిస్తున్న వారు ప్రజాప్రతినిధులుగా ఉండటానికి ఎంతమాత్రము వీలు లేదంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం ఎన్నో సార్లు స్పష్టం చేసింది. నేర చరిత్ర ఉన్న వారు చట్టసభల్లో ఉంటే స్వచ్ఛమైన పాలన ఎలా లభిస్తుంది..?

 

నేరగాళ్లు, అసాంఘిక శక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు అలాంటి వారికి ఓటు వేయకూడదు.. ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో ఒకటికి వందసార్లు ఆలోచించి..నీతీ, నిజాయితీ ఉన్న వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం లభిస్తుంది. అత్యాచారాలను అరికట్టాల్సిన బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న నేతల మాటలు, చేతలు చూస్తే స్త్రీలు కూడా సాటి మనుషులేనని వారికి అన్ని రకాల హక్కులున్నాయని మన నేతలు గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి నేతలు దేశంలో అత్యాచారాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటారని ఎలా నమ్మగలం..? ఇలాంటి అమానవీయ పోకడలను అరికట్టకుండా..తమను తాము మార్చుకోకుండా..ఎంతటి కఠిన చట్టాలు చేసినా ఫలితం శూన్యం.