మహారాష్ట్రలో రైతుల ఆందోళన..వాహనాలకు నిప్పు

మహారాష్ట్రలో రైతుల చేపట్టిన ఆందోళన హింసాత్మకమైంది. థానే జిల్లాలో ఇండియన్ నేవికి చెందిన 12,600 ఎకరాల స్థలంలో గత కొన్నేళ్లుగా కొందరు నివసిస్తున్నారు. ఆ భూమిని తమకు ఇవ్వాలని కొద్ది రోజుల క్రితం రైతులు అధికారులను కోరారు. వారి విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించడంతో ఆందోళన చేపట్టారు. మొత్తం 17 గ్రామాలకు చెందిన రైతులు పలు ప్రాంతాల్లో నిరసన దీక్షలకు దిగారు. థానే-బద్లాపూర్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రైతులను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగిన రైతులు ఆగ్రహంతో వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు..పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు.