జనసేనను భయపెడుతున్న మోడీ వ్యూహం..!!
posted on Jul 11, 2018 4:05PM
మోడీ వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి మళ్ళీ అధికారం చేపట్టాలని చూస్తున్నారు.. దానికోసం వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు.. ఆ వ్యూహాల్లో ఒకటి ముందస్తు ఎన్నికలు.. మోడీ ప్రభుత్వం 2019 లో జరగాల్సిన లోక్ సభ ఎన్నికలను ఈ ఏడాది చివరిలోనే జరిగేలా చూడాలని భావిస్తోంది.. అలానే లోక్ సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించి జమిలి ఎన్నికలకు తెరలేపాలని చూస్తోంది.. ఇప్పటికే లా కమిషన్ జమిలిపై రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకుంది.. అయితే మెజారిటీ పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను తిరస్కరించాయి.. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే టీడీపీ జమిలి ఎన్నికలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది.. తెరాస, వైసీపీ మాత్రం జమిలికి సై అన్నాయి.. కాంగ్రెస్ మొదటి నుండి జమిలిని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.. మరి జనసేన పరిస్థితి ఏంటి?.. ముందస్తుకు సై అంటుందా అంటే.. లేదనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.. జనసేన పార్టీ నిర్మాణం ఇంకా పూర్తిస్థాయిలో కాలేదు.. పవన్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఇంకా సమయం కావాలి.. పవన్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటన మాత్రమే చేస్తున్నారు.. మిగతా జిల్లాల పర్యటనకు చాలా సమయం కావాలి.. మరోవైపు అన్ని స్థానాల్లో బరిలోకి దిగాలని చూస్తున్న జనసేన, అభ్యర్థుల ఎంపిక కూడా జరపాలి.. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే జనసేనకు సమయం సరిపోదు.. గందరగోళంగా ఉంటుంది.. అందుకే జనసేన ముందస్తుకు సై అనే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.