కిలోమీటర్‌కు రూ. 450 కోట్లా.. షాకైన జగన్.. ప్లాన్ ఛేంజ్!!

 

లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు తుది డిడైల్డ్‌ ప్రాజెక్టు ప్లానింగ్‌ (డీపీఆర్‌)ను నెలలో ప్రభుత్వానికి అందించటానికి అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) సన్నాహాలు చేస్తోంది. ఇటీవల సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశం నేపథ్యంలో.. తుది డీపీఆర్‌పై ఏఎంఆర్‌సీ దృష్టి సారించింది. వాస్తవాలకనుగుణంగా ఖర్చు ఉండాలన్న దానిపై సీఎం జగన్‌ ఏఎంఆర్‌సీ అధికారుల నుద్దేశించి ప్రతిపాదనలు ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో అండర్‌ గ్రౌండ్‌ మార్గం పేరుతో కిలోమీటర్‌కు రూ. 450 కోట్ల ఖర్చును ప్రతిపాదించటంపై సీఎం విస్మయం వ్యక్తంచేశారు. మొత్తం ప్రతి పాదించిన రూ. 25 వేల కోట్ల వ్యయంలో ఒక్క రాజధాని అమరావతిలో 27 కిలో మీటర్ల దూరానికే రూ. 12,500 కోట్ల ఖర్చుగా చూపించడంతో.. రాజధానికి అండర్‌ గ్రౌండ్‌ విధానంలో మెట్రో నిర్మించాల్సిన అవసరం ఏముందని, ఎర్త్‌ గ్రేడ్‌ విధానంలోనే ముందుకు వెళ్లొచ్చు కదా అని సీఎం ప్రశ్నించారు. ఎర్త్‌గ్రేడ్‌ విధానంలో వెళితే కిలోమీటర్‌కు రూ. 100 కోట్ల లోపే ఖర్చు అవుతుంది. ఈ విధానంలో రాజధాని వరకు రూ. 2,700 కోట్లకు మించి ఖర్చు కాదన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వం ముందుగా వాస్తవ అవసరాల ప్రాతిపదికన మెట్రో ప్రాజెక్టును నిర్మించాలని భావిస్తోంది.

నిడమానూరు నుంచి  ప్రజావసారాలను తీర్చేదిగా డీపీఆర్‌లో సవరించాల్సిందిగా సీఎం సూచించినట్లు తెలిసింది. అందుకనుగుణంగా ఏఎంఆర్‌సీ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు నెలలో డీపీఆర్‌లో మార్పులు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత.. మెట్రోను ఏ విధానంలో ముందుకు తీసుకెళ్తారు?..ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకు తీసుకు వెళతారా? పీపీపీ విధానంలో ముందుకు తీసుకు వెళతారా? అన్న దానిపై స్పష్టత వస్తుంది.