టీడీపీలో కొనసాగుతున్న వలసలు... బై బై బాబు అంటున్న దేవినేని!!

 

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే వలసలతో సతమతమవుతున్న టీడీపీ పార్టీకి మరొక వలస ఎదురుకానుంది. విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ టీడీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు  సంసిద్ధమైనట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు దేవినేని అవినాష్. తన అనుచరులతో జరిగిన సమావేశంలో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు అవినాష్ అన్నారని అనుచరులు చెబుతున్నారు.

2019 సాధారణ ఎన్నికల్లో కొడాలి నానిపై పోటీ చేసి ఓటమి పాలయ్యాడు అవినాష్. తాజాగా వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  ఇక దేవినేని అవినాష్ కూడా పార్టీ నుంచి తప్పుకుంటే  కృష్ణా జిల్లాలో టీడీపీ మరింత బలహీనపడుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొంత కాలంగా పార్టీ వ్యవహార శైలిపై అవినాష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల తరువాత పార్టీ నేతలు తనను పట్టించుకోవడం లేదని ఆయన మనస్తాపానికి గురవుతున్నట్లుగా సమాచారం.  తనకు.. తన కుటుంబానికి పట్టు ఉన్న విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో కాకుండా గుడివాడ నుంచి తనను బలవంతంగా పోటీ చేయించారని ఆయన అన్నట్లుగా తెలుస్తుంది.

గతంలో కూడా అవినాష్ టీడీపీకి బై బై చెబుతున్నట్లు..వైసీపీలో చేరబోతున్నట్లు.. ప్రచారం జోరుగా సాగింది. అవినాష్ తో పాటు ప్రధాన అనుచరుడిగా ఉన్న కడియాల బుచ్చిబాబు కూడా పార్టీని వీడుతున్నట్లుగా అప్పట్లో భావించారు. అయితే.. ఆ వార్తలను దేవినేని అవినాష్ ఖండించారు. మరిప్పుడు ఏమంటారో ఆయనే చెప్పాలి.