రైల్లో సీటు ఇవ్వలేదని..కళ్లల్లో కారం చల్లాడు

కూర్చోవడానికి సీటు ఇవ్వలేదన్న అక్కసుతో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై కారం చల్లి పారిపోయాడు. ముంబైలో జరిగిన ఈ సంఘటన ఒక పక్క ఆసక్తికరంగానూ..మరోవైపు మనిషి ఎలా మారుతున్నాడో తెలుపుతుంది. షాహాద్ స్టేషన్‌లో ఓ వ్యక్తి లోకల్ ట్రైన్ ఎక్కాడు. కంపార్ట్‌మెంట్ అంతా కిక్కిరిసిపోవడంతో అతనికి సీటు దొరకలేదు. కాసేపు నిలబడినప్పటికీ ఇక ఓపిక లేక కొందరిని సీటు ఇవ్వమన్నాడు. అయితే అందుకు ఎవ్వరూ అంగీకరించకపోవడంతో వాగ్వివాదానికి దిగాడు. దీంతో చేసేది లేక మిన్నకుండిపోయాడు. ఆ తర్వాత రైలు మరో స్టేషన్‌లో ఆగాక తన వద్ద ఉన్న కారం పొడిని ప్రయాణికులపై చల్లాడు. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అస్వస్థతకు గురికావడంతో వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గాలిస్తున్నారు.