బాబుది ఓవర్ కాన్ఫిడెన్సా? లేక ఓన్లీ కాన్ఫిడెన్సా?

 

ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఏపీలో వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ సంస్థలు అంచనా వేసాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ని పట్టించుకోవాల్సిన పని లేదు. కచ్చితంగా టీడీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అమరావతిలో కొద్దిసేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రతి ఎన్నికల సందర్భంగా సర్వేలు జరుగుతూ ఉంటాయని తెలిపారు. అంతిమంగా ఇప్పుడు సర్వేలు చేయించుకోవడం ఓ అలవాటుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. గత 35 ఏళ్లుగా టీడీపీ సర్వేలు చేయిస్తూనే ఉందనీ, అందులో భాగంగానే ఈసారి కూడా సర్వేలు చేయించామని వెల్లడించారు. అంతేకాకుండా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. "ఈరోజు చెబుతున్నా.. రాసుకోండి మీరు. నూటికి వెయ్యి శాతం గెలవబోయేది తెలుగుదేశం పార్టీ" అని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ గెలుస్తుందని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ‘ఏప్రిల్ 11న ఈవీఎంల సమస్యలు తలెత్తడంతో నేను ఒక్క పిలుపు ఇచ్చాను. మీరు ఓటు మిస్ కావొద్దండి. వచ్చి ఓటు వేయండి అని పిలుపు ఇవ్వగానే సాయంత్రం కల్లా లైన్లలో చేరుకుని మరుసటి రోజు ఉదయం 4.30 గంటల వరకూ లైన్లలో నిలబడి ఓటు వేశారు. టీడీపీ విశ్వసనీయతకు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని అడుగుతున్నా.' అని బాబు ప్రశ్నించారు.

టీడీపీ గెలవకుంటే జన్మభూమికి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఏపీ ప్రజలు భారీగా తరలి వచ్చారన్నారు. 'తెలంగాణ ఆర్టీసీ బస్సులను రద్దు చేసినా, రైళ్లలో రిజర్వేషన్ దొరక్కపోయినా ఏ వాహనం దొరికితే దానిలో ప్రజలు తరలివచ్చి ఓటు వేశారు' అని గుర్తుచేశారు. ‘తొలిసారి టీడీపీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారు. నేను రాజకీయాల్లో గత 40 ఏళ్లుగా ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో జరిగినన్నిసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

దీన్నిబట్టి చూస్తుంటే బాబు గెలుపుపై ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబుది ఓవర్ కాన్ఫిడెన్సా లేక ఓన్లీ కాన్ఫిడెన్సా తెలియాలంటే రెండు రోజులు వేచి చూడాల్సిందే.