క్రైమ్ థ్రిల్లర్ను మించిన సినిమా..శిరీష కేసులో రోజుకో ట్విస్ట్
posted on Jun 22, 2017 11:54AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సరికొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఆడియో టేపులు బయటికి రావడంతో కొత్త క్యారెక్టర్లు తెరపైకి వచ్చాయి. రాజీవ్ స్నేహితులతో శిరీష మాట్లాడిన ఫోన్ సంభాషణలు బయటికి రావడంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజీవ్పై తనకున్న ప్రేమను నవీన్, నందుతో శిరీష పంచుకుంది. రాజీవ్ అంటే తనకు ప్రాణమని... రాజీవ్ను ఎవరేమన్నా చంపేస్తానని హెచ్చరించింది. రాజీవ్ ప్రియురాలు తేజస్విని గురించి కూడా మాట్లాడిన శిరీష.... ఆమెను తమ మధ్యకు రాకుండా చూడాలని రాజీవ్ స్నేహితులను కోరింది. అలాగే తేజస్విని, శిరీష మధ్య వాట్సప్లో మెసేజ్ల సమరం కొనసాగినట్లు తెలుస్తోంది.
శిరీష లోదుస్తులపై రక్తపు మరకలు ఉండటంతో .... అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అత్యాచారం జరిగిందా లేదా అనేది ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాకే తేలనుంది. ఇక ఆడియో టేపుల్లో బయటపడ్డ నందు, నవీన్ కూడా కేసులో కీలకంగా మారారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మూడు మొబైల్స్లో రాజీవ్, శిరీష, తేజస్విని, నవీన్, నందు, రవి సంభాషలతోపాటు.... అశ్లీల వీడియోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వాటిని పోలీసులు... ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు. ఇక విజయవాడలో ఉంటోన్న రాజీవ్ ప్రియురాలు తేజస్విని నుంచి కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.
ఆర్జే స్టూడియోలో పనిచేసే యువకుల్లో ఎవరో ఒకరు ఈ ఆడియో టేపులను బయటపెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ ఆడియోలోని గొంతు శిరీషదేనా? కాదా అనేది కూడా తేల్చాల్సి ఉందని చెబుతున్నారు. మరోవైపు రాజీవ్, శ్రవణ్లను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన పోలీసులు.... ఇంటరాగేషన్ తర్వాత మరిన్ని సంచలనాలు బయటికి వస్తాయని అంటున్నారు.