ఏపీ అభివృద్ధి ఘనత టీడీపీదే

 

ఎలక్షన్ మిషన్ 2019పై టీడీపీ నేతలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25న రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ‘పసుపు-కుంకుమ’ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమరావతి, విశాఖ, కడపలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రివర్గం సమావేశంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కూటమికి నలుగురు ప్రధానులని అనడం బీజేపీలో భయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కోల్‌కతా సభతో బీజేపీ నేతలు బెంబేలెత్తుతున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ది బీజేపీ వల్ల జరగలేదని, తమ స్వయంకృషితోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లలో ఏపీ అభివృద్ధి ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నిధులు ఇచ్చామంటూ కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కే ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. ఒక్క బుల్లెట్ రైలు ప్రాజెక్టుకే రూ.లక్ష కోట్లకుపైగా కేటాయించారని ఆరోపించారు. ఏపీకి ఇచ్చినవన్నీ టోల్ పెట్టి వసూలు చేసే రోడ్లేనని.. ఏదో ఏపీని ఉద్ధరించినట్లు బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోలవరం నిర్మాణంలో జాప్యం చేస్తున్నారని, డీపీఆర్‌-2 ఆమోదంలో ఏడాది జాప్యానికి గడ్కరీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ రాష్ట్రానికైనా ప్రధాని మోదీ అంగీకారంతోనే నిధులు కేటాయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ఈవీఎంలపై అంతర్జాతీయ సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారని, ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో రుజువు చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. టీడీపీ పోరాటం వల్లే ఈవీఎంలకు వీవీ ప్యాట్ రశీదులు వచ్చాయన్నారు. కానీ రశీదుపై ముద్ర రంగు తక్కువగా ఉంటోందని.. వెంటనే కరిగిపోతోందన్నారు. వీవీ ప్యాట్ కూడా 100% నియోజకవర్గాల్లో అమలు లేదని చెప్పారు. ఈవీఎంలపై జాతీయస్థాయిలో చర్చిస్తున్నామని, 22పార్టీల ప్రతినిధులతో త్వరలోనే ఈసీని కలుస్తామని వెల్లడించారు. 120 దేశాల్లో ఈవీఎంల అమలు లేదని, 20 దేశాల్లోనే వినియోగం ఉందన్నారు. ఈవీఎంలపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, వాటిపై అవగాహన పెంచుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు.