సంపూర్ణ కార్తీక మహాపురాణము

ఇరువది నాలుగవ రోజు పారాయణము

 

 

సప్తదశాధ్యాయము:
   
ఇక యిక్కడ యుద్దరంగంలో - అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకొన్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింప చేయదలచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి - నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ వున్న ఆ మాయా గౌరిని చూసాడు శివుడు. చూసీచూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్దాన్నీ, తన పరాక్రమాన్నీ, కర్తవ్యాన్నీ విస్మరించి ఉదాసీనుడై వుండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు ఆ పుంఖశాణైకాలైన మూడు బాణాలను శివుని శిరసుపైనా, వక్షస్థలంపైనా, ఉదరమందునా ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై, కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలతి భీషణమైన రౌద్రరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు.

 

Karthika Maha Purananamu 24th Day Parayanam

 

అలా పారిపోతున్న వారిలో వున్న అగ్రనాయకులైన శుంభ, నిశుంభులను చూచిన రుద్రుడు - పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించెదరు గాక' అని శపించాడు. అది గమనించి జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా గొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమ్యాకాశాలను దహింప చేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు, ఈశ్వరునిలో లీనమై పోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులూ, అవనత శిరస్కులూ అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు. స్తుతించారు. కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం 'బృందామోహితుడై అడవులలోబడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు.

 

 

Karthika Maha Purananamu 24th Day Parayanam


   దేవతాకృత మహిమాయా ప్రార్థనం.

     శ్లో||    య దుద్భవాస్సత్వ రజస్తమో గుణాః
              సృష్టి స్థితి ధ్వంస నిదాన కారిణః
              య దిచ్చయా విశ్వమిదం భవా భవౌ
              తనోతి మూల ప్రకృతిం నతాస్స్మృతామ్ ||        1

 

    శ్లో||    యాహి త్రయోవింశతి భేద శాబ్దితా
             య ద్రూపకర్మాటి జగు స్త్ర యోపివై
             జగత్యశేషే సమాధిష్ఠితా పరా
            వేదాస్తు మూల ప్రకృతిం  సతా స్స్మృతామ్ ||        2

    శ్లో||    యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం
             దారిద్ర్య భీ మోహ పరాభ వాదీన్
            నప్రాప్నువంత్యేవహి భక్తవత్సలాం
           సదైవ మూల ప్రకృతిం నతాస్స్మృతామ్ ||        3


సృష్టిస్థితి లయలకు కారణమైన సత్త్య రజస్తమోగుణాలు మూడు దేని నుంచి పుట్టినవో, దేవి యొక్క యిచ్ఛ వలన లోకంలో జనన -మరణాలు సంభవిస్తున్నాయో అటు వంటి  మూల ప్రకృతి (మహామాయ)కి నమస్కరిస్తున్నాయి.

1. ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్టించినదో వేదములలో సైతము దేని  యొక్క రూపకర్మములు కీర్తింపబడు తున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము.

2. దేనియందు భక్తుడైన వాడు దరిద్రభయ, మోహ, పరాభవాలను పొందడో, ఏదయితే, తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ కలదో - ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను.

నారదోవాచ:    స్తవమే తత్త్రిసంధ్యాం యః పఠే దేకాగ్రమానసః
                      దారిద్ర్యమోహ దుఃఖాని న కదాచిత్ స్పృశంతి తమ్ ||

 

 

Karthika Maha Purananamu 24th Day Parayanam

 



నారదుడు చెబుతున్నాడు: దేవతలచే గావించబడిన ఈ మూలప్రకృతి (మహామాయా) స్తనాన్ని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో వాళ్లేనాడూ కూడా దారిద్ర్యన్ని గాని, భయాన్ని గాని, మొహాన్ని గాని, దుఃఖాన్ని గాని, అవమానాన్ని గాని పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దాము.

ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సొకటి పొడచూపి - ఓ దేవతలారా! త్రిగుణాలరీత్యా నేను త్రిమూర్తులనూ ధరించి వున్నాను. రజోగుణం వలన-లక్ష్మిగాను, తమోగుణం వలన - సరస్వతిగానూ, సత్వగుణం వలన పార్వతిగానూ - విలసిల్లుతున్నది నేనే కావున, మీ వంఛాపరిపూర్తికై ఆ లక్ష్మీ - పార్వతీ - సరస్వతులను ఆశ్రయింపు'డని ఆదేశించి అంతర్థానమై పోయింది. దేవతలు రమా, ఉమా, సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలలైన ఆ తల్లులు ముగ్గురూ వారికి కొన్ని బీజాలనిచ్చి - 'విష్ణువు ఎక్కడయితే మోహవృతుడై వున్నాడో అక్కడీ బీజాల్ని చల్లించండి" అని చెప్పారు. దేవతలా బీజాలను తెచ్చి - శ్రీహరి మోహితుడై పడి వున్న బృందా చితా ప్రాంతమంతటా చిలకించారు.

ఓ పృథు భూపతీ! పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను - ఏకాగ్రచిత్తంతో చదివినా , విన్నాస్త్రీలుగాని- పురుషులుగానీ- ఇహంలో సంతానసంపదనూ - పరంలో స్వర్గసంపదనూ పొందుతున్నారు - అన్నాడు నారదుడు.



సప్తదశోధ్యాయ స్పమాప్తః (పదునేడవ అధ్యాయము సమాప్తము)

అష్టదశాధ్యాయము

 

 

Karthika Maha Purananamu 24th Day Parayanam

 

పునః నారదుడు ప్రవచిస్తున్నాడు: ఓ పృధు మహారాజా! పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల - త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకూ బృందా మోహముతో మందుడై వున్న విష్ణువు తన చుట్టూ చెట్లయి మొలచిన లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ మహిమల వలన, కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ, వాటిలో లక్ష్మీదత్తబీజాలు ఈర్ష్యగుణాన్వితాలయి వుండటం వలన ఆ బీజోత్పన్నమైన 'మాలతి' బర్భరీ నామధేయమై, విష్ణువునకు ఎడమయ్యింది. కేవల అనురాగ పూరితాలయిన ఉసిరి, తులసి - మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహవిముక్తుడై, ధాత్రీ తులసీ సమేతుడయి సర్వదేవతా నమస్కారాలనూ అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్లాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణుపూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతే కాదు.

 

తులసీ మహిమ

 

 

 

Karthika Maha Purananamu 24th Day Parayanam

 

ఎవరింటిలో తులసీవనం వుంటుందో ఆ ఇల్లు సర్వతీర్థస్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో, వారికి యమధర్మరాజును దర్శించే పని వుండదు. అనగా, నరకానికి వెళ్లరనీ  పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారనీ భావము. గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ  సేవనం, ఈ మూడూ సమాన  ఫలదాయకాలేనని చెప్పుబడుతూంది. తులసిని ప్రతిష్ఠంచినా, తడిపినా, తాకినా, పెంచినా, మానసిక శారీరకపాపాలేగాక, మాటలవలని పాపాలూ కూడా మటుమాయమై పోతాయి.

తులసి గుత్తులతో శివ, కేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్థాలు గంగాది నదులు, విష్ణ్వాది దేవతలు తులసి దళాలతో నివసిస్తూంటారు. ఎన్ని పాపాలు చేసినవాడైనాసరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని   పూసుకుని మరణిస్తున్నాడో,అటు వంటి వానిని చూసేందుకు యయుడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుజ్యాన్నే పొందుతున్నాడనడం సత్యం, సత్యం, ముమ్మాటికీ సత్యం. తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసీవనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్టయితే, అది పితరులకు అక్షయ పదాన్నిస్తుంది. అదే విధంగా -


ధాత్రీ (ఉసిరి) మహిమ:

 

 

Karthika Maha Purananamu 24th Day Parayanam

 

ఉసిరిచెట్టు నీడను పిండప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సుపైనా , ముఖమందునా, దేహమందునా,  చేతులందునా ఉసిరిపండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణుస్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరం పై ఉసిరిక ఫలమూ, తులసీ, ద్వారకోద్భవమైన మృత్తికా వుంటాయో నిస్సందేహంగా  వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో. ఉసిరిపండ్లనీ, తులసీదళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తత్ క్షణమే గంగాస్నానఫలం లభిస్తుంది. ఉసిరిపత్రితోగాని, ఫలాలతో గాని దేవతాపూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీకమాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్ధసేవనలు విశేష ఫలితాలనిస్తాయి. సమస్త దేవతలూ, మునులూ కూడా ఈ కార్తీకమాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకుని వుంటారు.

ఏ నెలలోనైనా సరే - ఎవడైతే ద్వాదశినాడు తులసిదళాలను, కార్తీకం ముప్పది రోజులలోనూ ఉసిరికపత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీకమాసంలో ఎవడైతే ఉసిరిచెట్టు నీడన భోజనంచేస్తాడో, వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరినీడన విష్ణుపూజ చేసినట్లయితే- అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలనీ, మహిమలనీ చెప్పడానికి ఏ ఒక్కరికీ కూడా ఎలాగైతే సాధ్యం కాదో, అదే ప్రకారం ఈ తులసీ  ధాత్రీ వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్మఖుడైన బ్రహ్మకుగాని, సహస్రముఖుడయిన శేషునికి గాని సాధ్యం కాదు. ఈ ధాత్రీ తులసీ  జననగాధ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్లు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమపూర్వులను కూడి శ్రేష్ఠమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు.


   

ఏవం శ్రీ పద్మ పురణాంతర్గత కార్తీక మహత్మ్యనందు

పదునేడవ, పదునెనిమిదవ అధ్యాయములు

 

 

Karthika Maha Purananamu 24th Day Parayanam

 

 

24 వ రోజు


నిషిద్ధములు  :- మద్యమాంస మైధునాలు, ఉసిరి

దానములు :- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు

పూజించాల్సిన దైవము :- శ్రీ దుర్గ

జపించాల్సిన మంత్రము :- ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా

ఫలితము :- శక్తిసామర్ధ్యాలు, ధైర్యం, కార్య విజయం


ఇరువది నాలుగవ(బహుళ నవమి) నాటి పారాయణం సమాప్తం


More Kartika Maha Puranam