
తెలుగు సినిమా చరిత్రని చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే చిరంజీవి నట ప్రస్థానం గురించి అందరకి తెలిసిందే. ఎన్ని చెప్పుకున్నా కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు అనే పరిస్థితి. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే యువకుడు స్వయంకృషితో 'మెగాస్టార్ చిరంజీవి'గా రూపాంతరం చెందడం ఒక అద్భుత ప్రయాణం. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని సృష్టించారు. కేవలం నటుడిగానే కాకుండా, తెలుగు చిత్రసీమలో వాణిజ్యపరమైన విలువలని , సరికొత్త ట్రెండ్స్ ని సెట్ చేసిన ఘనత చిరుది.
మరి అలాంటి చిరంజీవిపై 'బయోపిక్' అనేది ఎప్పుడైనా సరే వచ్చే అవకాశం ఉంది. ఆ బయోపిక్ లో చిరంజీవిగా రామ్ చరణ్ చేయడం గ్యారంటీ. అభిమానులతో పాటు సినీ సర్కిల్స్ లో చాలా మంది చాలా రోజుల నుంచి చిరంజీవి బయోపిక్ పై మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడమే కాదు ఎంత త్వరగా వస్తే అంత బాగుండు అనుకుంటున్నారు. మరి చిరంజీవి, చరణ్ కూడా అభిమానులు, సినీ శ్రేయోభిలాషుల కోసం త్వరగా చేస్తారేమో చూడాలి.
చిరంజీవి సృష్టించిన సినీ సామ్రాజ్యం గురించి చెప్పుకోవాలంటే 1980వ దశకంలో చిరంజీవి సృష్టించిన సునామీ టాలీవుడ్ రూపురేఖలను మార్చేసింది. ముఖ్యంగా 1983లో వచ్చిన 'ఖైదీ' చిత్రం చిరంజీవిని రాత్రికి రాత్రే స్టార్డమ్ శిఖరానికి చేర్చింది. ఆ తర్వాత వచ్చిన 'పసివాడి ప్రాణం', 'యముడికి మొగుడు', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' వంటి చిత్రాలు పరిశ్రమలో సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. 1992లో విడుదలైన 'ఘరానా మొగుడు' చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో ఆయన భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా ఎదిగారు. ప్రముఖ జాతీయ పత్రిక 'ది వీక్' చిరుని 'అమితాబ్ బచ్చన్ కంటే పెద్ద స్టార్'అని అభివర్ణిస్తూ కవర్ స్టోరీ ప్రచురించడం అప్పట్లో ఒక సంచలనం.
చిరంజీవి కేవలం నటుడిగానే కాకుండా, తన 150కి పైగా చిత్రాల కెరీర్లో అనేక మైలురాళ్లను అందుకున్నారు. ఆయన నటించిన 'రుద్రవీణ', 'ఆపద్బాంధవుడు', 'స్వయంకృషి' వంటి చిత్రాలు ఆయనలోని నటనా ప్రతిభకు అద్దం పడతాయి. వీటిలో 'రుద్రవీణ' చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. చిరంజీవి సాధించిన ఘనతలకు గుర్తింపుగా ఆయనకు 9 నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులతో పాటు ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా దక్కింది. భారత ప్రభుత్వం ఆయన సినీ రంగానికి చేసిన సేవలను గుర్తిస్తూ 2006లో 'పద్మభూషణ్' పురస్కారంతో, ఆ తర్వాత దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మవిభూషణ్'తో గౌరవించింది. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేసింది.
Also read: lenin: అయ్యగారు ఈ సారి హిట్ అందుకుంటాడా!.. ఆ గండం గట్టెక్కితే కొట్టినట్టే
బాక్సాఫీస్ వద్ద 70 శాతానికి పైగా సక్సెస్ రేటును సొంతం చేసుకున్న చిరంజీవి, రీఎంట్రీలోనూ తన పంథా మార్చలేదు. సుదీర్ఘ విరామం తర్వాత 2017లో వచ్చిన ఆయన 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రపంచవ్యాప్తంగా 164 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ఆయన క్రేజ్ తగ్గలేదని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' మరియు 'వాల్తేరు వీరయ్య' చిత్రాలు 200 కోట్ల క్లబ్లో.మన శంకర వరప్రసాద్ గారు 300 కోట్ల క్లబ్ లో చేరి మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినాని మరోసారి చాటాయి. సినిమాలతో పాటు ఆయన స్థాపించిన 'చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్' ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతూ నిజ జీవితంలోనూ మెగాస్టార్గా నిలిచారు. చిరంజీవి సృష్టించిన ఈ సామ్రాజ్యం, ఆయన వేసిన బాట టాలీవుడ్లో రాబోయే తరాలకు ఎప్పటికీ ఒక గైడ్లా నిలిచిపోతుంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నాడు. చిరుకి 158 వ చిత్రం.






