political-news-img

సైబర్ దాడులు.. కొత్త పుంతలు

నేటి డిజిటల్ యుగంలో సైబర్ దాడులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కేవలం సమాచార చోరీ, ఆర్థిక మోసాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. సైబర్ దాడులు మానవ మనుగడకు, ప్రాణాలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. డెలాయిట్ సౌత్ ఆసియా సైబర్ విభాగం లీడర్ గౌరవ్ శుక్లా చెప్పన మేరకు గతంలో కేవలం కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్లకే పరిమితమైన హ్యాకింగ్.. ఇప్పుడు ఆరోగ్య వ్యవస్థలు, రవాణా. విద్యుత్ సరఫరా లాంటి కీలక ఇన్ ఫ్రాస్టక్చర్ కు కూడా పాకుతోంది. గత రెండేళ్లుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఆపరేషనల్ టెక్నాలజీ (ఓటీ) మధ్య అంతరాలు సమసిపోయాయి. దీంతో విమానయానం, రవాణా, పబ్లిక్ యుటిలిటీ రంగాలకు పెను ముప్పు ప్రమాదం పొంచి ఉంది. ఒక కనెక్టెడ్ కారును హైవేపై వేగంగా నడుపుతున్నప్పుడు, ఎవరైనా దానిపై సైబర్ దాడి చేసి స్టీరింగ్ నియంత్రణను దక్కించుకుంటే.. విమానం గాలిలో ప్రయాణిస్తుండగా, దాని ఆపరేషనల్ టెక్నాలజీ హ్యాక్ అయితే.. ఏం జరుగుతుంది. ఇప్పుడు సైబర్ దాడుల కారణంగా అలాంటి పెను ప్రమాదాలకు కూడా అవకాశం ఉందంటున్నారు డెలాయిట్ సౌత్ ఆసియా సైబర్ విభాగం లీడర్ గౌరవ్ శుక్లా. సైబర్ దాడులతో ఆర్థిక చౌర్యం కంటే.. మానవ మనుగడకు పొంచి ఉన్న ముప్పుపైనే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోందంటున్నారాయణ. వైద్య రంగంలోనూ ఈ ముప్పు తీవ్రత అధికంగా ఉందని వివరించారు. ఆసుపత్రుల్లోని వైద్య పరికరాలపై దాడి చేసి రోగుల డేటాను మార్చడం లేదా పరికరాల పనితీరును అడ్డుకోవడం వల్ల రోగుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. విద్యుత్ కేంద్రాలపై సైబర్ దాడులు అంధకారాన్ని సృష్టిస్తాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల జనాభా ఉంటే, సుమారు 3000 కోట్లకు పైగా ఐఓటీ (IoT) సెన్సర్లు వాడుకలో ఉన్నాయని, అంటే సగటున ఒక వ్యక్తి చుట్టూ మూడున్నర సెన్సర్లు నిరంతరం పనిచేస్తున్నాయన్న ఆయన ఈ దాడుల బారి నుంచి తప్పించుకోవడానికి ఇండియా స్టాక్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పని తీరు ఆదర్శవంతంగా ఉందన్నారు. ఇప్పటికే దాదాపు పాతిక దేశాలు తమ సొంత ఇండియా స్టాక్ రూపొందించుకోవడానికి డెలాయిట్ సలహాలు ఇస్తోందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడం వల్ల సైబర్ దాడుల వేగం, తీవ్రత కూడా పెరుగుతున్నాయన్నారు. సైబర్ దాడులను దీటుగా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలనీ. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే సైబర్ సెక్యూరిటీ ఎథిక్స్ గురించి బోధించాలని గౌరవ్ శుక్లా పిలుపునిచ్చారు.

Publish Date: Mar 29, 2026 12:40PM

political-news-img

బెంగళూరును వదిలేస్తున్న ఐటీ?

దేశ ఐటీ రాజధానిగా దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న బెంగళూరు ఇప్పుడు ఆ ప్రాభవాన్ని కోల్పోతోంది. ఒక్కటొక్కటిగా ఐటీ కంపెనీలు బెంగళూరును వీడుతున్నాయి. గత ఐదేళ్లలోనే వందల కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించేశాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఐద ఐదేళ్లలో 629 కంపెనీలు కర్నాటకను వీడి వెళ్లాయి. ఈ కంపెనీలలో అత్యధికం హైదరాబాద్, విశాఖలను తమ ప్రత్యామ్నాయాలుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక పోతే ఐటీ కంపెనీలు కర్నాటకలో కొనసాగే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఈ గణాంకాల ఆధారంగా తేటతెల్లమౌతోంది. చక్ బళ్లాపూర్ ఎంపీ కేసుధాకర్ ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్ సభ వేదికగా ఇచ్చిన సమాధానం మేరకు గడిచిన ఐదు సంవత్సరాల్లో అంటే 2020 నుంచి 2025 వరకు మొత్తం 629 కంపెనీలు కర్ణాటకను వీడి వెళ్ళాయి. కంపెనీల చట్టం 2013 ప్రకారం వ్యాపార విస్తరణ, పరిపాలనా పరమైన వెసులుబాటు కోసం ఈ సంస్థలు తమ కార్యాలయాలను మార్చుకున్నాయి. ఇక ఆయన ఇచ్చిన సమాధానం మేరకు సంవత్సరాల వారీగా కర్నాటకు గుడ్ బై చెప్పిన కంపెనీల సంఖ్య ఇలా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 129 కంపెనీలు, 2021-22లో 126 సంస్థలు, 2022-23లో 88 కంపెనీలు కర్నాటకు గుడ్ బై చెబితే.. ఆ తరువాతి రెండేళ్లూ అంటే 2034- 24, 2024 - 25 సంవత్సరాలలో వరుసగా 119, 167 సంస్థలు కర్నాటకను వీడి వెళ్లాయి. గత ఐదేళ్లతో పోలిస్తే గత ఏడాది కర్నాకట వదిలేసిన సంస్థల సంఖ్య ఎక్కువగా ఉండటం కర్నాటకలో ఐటీకి గడ్డు పరిస్థితి దాపురించిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ఇందుకు మౌలిక సదుపాయాల కొరతతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇబ్బందులు,అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు కంపెనీలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను కర్నాటకేతర ప్రాంతాలను ఎంచుకోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి. అయితే కర్నాటక మాత్రం దీనికి ఖండిస్తోంది. మౌలిక సదుపాయాల సమస్యల వల్ల కంపెనీలు వెళ్లడం లేదని, ఇది కేవలం కంపెనీల అంతర్గత నిర్ణయమని కర్నాటక సర్కార్ చెబుతోంది. చేస్తోంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రానికి 5.1 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు అనుమతులు ఇచ్చి, వేల ఎకరాల భూమిని కేటాయించామని ప్రభుత్వంచెబుతోంది. అలాగే బెంగళూరుపై ఒత్తిడి తగ్గించేందుకు మైసూరు, మంగుళూరు వంటి నగరాల్లో ఐటీ కంపెనీలకు తమ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిందని సీఎం సిద్దరామయ్య చెప్పారు. ఇవన్నీ ఒకెత్తయితే.. ప్రధాన ఐటీ కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసం ఇతర రాష్ట్రాల వైపు దృష్టి సారించడానికి ట్రాఫిక్ కష్టాలు సహా పలు కారణాలున్నాయని అంటున్నారు. కంపెనీల వలసలు ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్ లో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతింటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Mar 29, 2026 12:34PM

political-news-img

పెమ్మసానికి ప్రమోషన్.. కింజరాపుకు శాఖ మార్పు?.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై మోడీ కసరత్తు

ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారా? మంత్రుల శాఖల్లో భారీ ఎత్తున మార్పులతో పాటు.. కొందరికి ఉద్వాసన, మరొ కొందరికి చోటు కల్పించనున్నారా? అంటే ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఔననే వినిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ క్యాబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆరంచించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా మోడీ తన కేబినెట్ విస్తరణలో శాఖల మార్పు ఉండే మంత్రులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు చెబుతున్నారు. మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీకి చెందిన మంత్రులు పెమ్మసాని, కింజారపు రామ్మోహన్ నాయుడుల శాఖలను మార్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాఖను సైతం మారుస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రమోషన్ ఖాయమంటున్నారు. ఆయనకు స్వతంతర హోదా కల్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడికి శాఖ మార్చి అంతకంటే ప్రాధాన్యత ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించే యోచనలో ప్రధాని మోడీ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఏపీ నుంచి అదనంగా మరో ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. కొత్తగా కేబినెట్ లో చోటు దక్కించుకునే వారిలో రాజమహేంద్రవరం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, అలాగే లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు, అమలాపురం ఎంపీ హరీష్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే . బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైందని చెబుతున్నారు. ఆయన ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. అదలా ఉంచితే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొందరు సిట్టింగ్ మంత్రులకు ఉద్వాసన తప్పదని కూడా తెలుస్తోంది. అలా ఉద్వాసన పలికిన మంత్రులకు పార్టీ పదవులు అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Publish Date: Mar 29, 2026 9:19AM

political-news-img

తెలుగు జాతి కాంతి పుంజం.. 44 వసంతాల తెలుగుదేశం

తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది అన్న భావనను నిలువెల్లా నింపుకున్న పార్టీ తెలుగుదేశం. అధకారంలో ఉన్నా, లేకున్నా తెలుగు జాతి అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి సరిగ్గా 44 సంవత్సరాలు. 1982 మార్చి 29 న తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం తెలుగువారి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం చితికిపోయి, తెలుగు జాతి అవమానభారంతో కుంగిపోతున్న చారిత్రక సమయంలో కారు చీకటిలో కాంతి పుంజంలా తెలుగుదేశం పార్టీ ఆవిర్బవించింది. సమాజమే దేవళం, ప్రజలే దేవుళ్ళు అని ఎలుగెత్తి చాటింది. నలభై నాలుగేళ్లుగా తెలుగు ప్రజల సామాజిక, సాంస్కృతిక , రాజకీయ, ఆర్ధిక పురోగమనంలో ప్రతి అడుగులోనూ తెలుగుదేశం పార్టీ తనదైన ముద్ర వేసింది. ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని పదిలం చేసుకుంది. తెలుగు సినీ వినీలాకాశంలో దశాబ్దాల పాటు జగజ్జేయమానంగా వెలిగిన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) అరవైయేళ్ళ వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి.. తెలుగువాడిని, వేడినీ ప్రపంచానికి చాటారు.. పార్టీ ప్రకటించిన మరుక్షణం నుంచి అయన అన్ని వర్గాల ప్రజలతో మమేకమై స్పూర్తి రగిలించిన తీరు అనితరసాధ్యం. తెలుగువారిలో నెలకొన్న నిస్తేజాన్ని పారదోలడానికి కంకణం కట్టుకున్న నందమూరి తారక రామారావును తెలుగు సమాజం నిండు మనసుతో ఆశీర్వదించింది. ఆత్మీయంగా హత్తుకుంది. తెలుగుదేశం అవతరణను తెలుగు జాతి రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపుగా ఆహ్వానించింది. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా! అని ఆయనిచ్చిన పిలుపునకు తెలుగుజాతి ఉవ్వెత్తున స్పందించింది. ఆంధ్రుల భవితను దేదీప్యమానం చేయాలని పరితపించిన ఎన్టీఆర్ కు కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. 1983లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన చారిత్రక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి పెట్టింది. అప్పటి నుంచి తెలుగువారి కీర్తి పతాకను తెలుగుదేశం పార్టీ ప్రపంచం నలుచెరుగులా చాటుతూనే ఉంది. సమూల మార్పులు తీసుకురావడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తెలుగుదేశం పార్టీ ఆవిరళ కృషి చేసింది. ,చేస్తోంది. పార్టీ స్థాపన నుంచి ఇప్పటివరకు అధికారంలోను, ప్రతిపక్షంగాను కూడా తెలుగుదేశం సదా ప్రజల పక్షానే నిలిచింది. ప్రజా ప్రయోజనాల కోసమే పరితపించింది. తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి. తెలుగు పౌరుషాన్ని తట్టిలేపిన కీర్తి ఎన్టీఆర్ దే అనడంలో సందేహం లేదు. ఇక తెలుగువారి జీవన ప్రమాణాలను పెంచిన ఘనత నిస్సందేహంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు నారాచంద్రబాబు నాయుడిది. విద్యా, ఉద్యోగ, ఆర్ధిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారి ఎదుగుదల వెనుక అయన కృషి, దూరదృష్టి ఎవరూ కాదనలేరు. తెలుగు జాతికి ప్రపంచంలో ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే, తెలుగు ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుకుని నిలిచేలా చేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఒక రాజాకీయ శక్తిగా ఎదిగితే, చంద్రబాబు అధ్వర్యంలో రాజకీయంగానూ, ఆర్ధికంగానూ కూడా నిలబడింది. బలపడింది. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధునికతను సంతరించుకుంది. తెలుగువారి కీర్తీ ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసింది. ప్రపంచంలో జరుగుతున్నమార్పులను ముందే గ్రహించి, అందుకు అనుగుణంగా తెలుగువారిని, తెలుగు రాష్ట్రాన్ని సంసిద్ధం చేయడంలో చంద్రబాబు దార్శనికత ప్రపంచ దేశాల అధినేతలు కూడా ఏపీవైపు చూడక తప్పని పరిస్థితులను కల్పించింది. రాష్ట్ర విభజనతో పేరు వినా మరేం లేకుండా పోయిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు తన నాయకత్వ పటిమతో దశ, దిశ నిర్దేశం చేసి, స్వర్ణాంధ్ర స్వప్నాన్ని సాకారం చేయడానికి రేయింబవళ్ళు శ్రమించారు. శ్రమిస్తున్న నిజమైన అభివృద్ది కాముకుడు నారా చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఈ 44 ఏళ్ల ప్రస్తానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. అన్నిటినీ అధిగమించి తెలుగువారి జీవీతాలలో తెలుగుదేశం పార్టీ ఒక భాగంగా మారింది.

Publish Date: Mar 29, 2026 9:18AM

political-news-img

అమ‌రావ‌తే ఏపీ శాశ్వత రాజధాని.. జగన్ వచ్చినా చేసేదేం లేదు.. చేయగలిగిందీ లేదు!

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఏక‌గ్రీవ తీర్మానం సంగ‌తి స‌రే.. రేపు జ‌గ‌న్ వ‌చ్చినా? ఈ ప్రాంతాన్ని రాజ‌ధానిగా హోదా మార్చ‌డానికి వీల్లేదా? అంత‌గా ఈ చ‌ట్టంలో, ఈ తీర్మానంలో ఏముంది? అమ‌రావ‌తి విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం కేవ‌లం ఒక సాధార‌ణ తీర్మానం కాదు. ఇది ఒక చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ర‌క్ష‌ణ క‌వ‌చం అంటూ లీగ‌ల్ షీల్డ్. సపోజ్.. ఫర్ సపోజ్ వచ్చే ఎన్నికలలో జ‌గ‌న్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా, మ‌రెవ‌రైనా అధికారంలోకి వ‌చ్చినా కూడా ఏమీ చేయలేనంత‌గా ఈ తీర్మానం ఒక మాస్టర్ ప్లాన్ అంటున్నారు. ఇంతకీ అదేంటి? ఈ తీర్మానంలో ప్రధానంగా ప్ర‌స్తావించిన సెక్ష‌న్ 5 స‌వ‌ర‌ణ అత్యంత కీల‌కం. 2014 ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ ఐదు ప్ర‌కారం.. హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఆ త‌ర్వాత ఏపీకి కొత్త రాజ‌ధాని ఉండాల‌ని ఉంది. కానీ, దాని పేరు అమ‌రావ‌తి అని ఎక్క‌డా స్ప‌ష్టంగా లేదు. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అనే ద‌గ్గ‌ర అమ‌రావ‌తి అనే ప‌దాన్ని చేర్చాల‌ని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం (మార్చి 28) తీర్మానం చేసింది. ఒక్క‌సారి పార్ల‌మెంటు ఈ స‌వ‌ర‌ణ‌ను ఆమోదిస్తే, అమ‌రావ‌తి అనేది కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్ర‌మే తీసుకునే నిర్ణ‌యం కాబోదు.. ఇది కేంద్ర చ‌ట్టంలో ఒక భాగం అవుతుంది. సాధార‌ణంగా రాజ‌ధాని ఎక్క‌డా ఉండాల‌నేది రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకోవ‌చ్చు. గ‌తంలో జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల బిల్లు తెచ్చిన‌ట్టు..అయితే ఒక సారి అమరావతి రాజథాని అని కేంద్ర ప్ర‌భుత్వం రిక‌గ్నైజేష‌న్ యాక్ట్ లోకి వెళ్తే.. దాన్ని మార్చాలంటే మ‌ళ్లీ పార్ల‌మెంటు ఆమోదం కావ‌ల్సిందే. ఒక వేళ జ‌గ‌న్ వ‌చ్చి మ‌ళ్లీ మూడు రాజ‌ధాని బిల్లు తెచ్చినా అది కేంద్ర చ‌ట్టానికి విరుద్ధం అవుతుంది. మ‌ళ్లీ కేసులు గ‌ట్రా అయ్యి కాల‌యాప‌న జ‌రిగి.. ఎటూ గాకుండా పోతుంది. అచ్చెన్నాయుడు అన్న‌ట్టు 2019లో జ‌రిగిన‌ట్టు 2029లో గానీ జ‌గ‌న్ వ‌స్తే.. ఇక ఆంధ్ర‌ప్ర‌జ‌ల అవ‌స్థ మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంద‌న్న‌ది గుర్తుంచుకోవాలి. ఇంత‌కీ అమ‌రావ‌తి అంటే ఏమిటి? ఆ నిర్వ‌చ‌నం ఎలాంటిద‌ని గ‌మ‌నిస్తే.. ఇది ఒక ఊరు కాదు.. రాజ‌ధాని అభివృద్ధి సాకార సంస్థ‌.. ప‌రిధిలో నోటిఫై చేసిన ప్రాంతం. దీన్నే అమ‌రావ‌తిగా గుర్తించాల‌ని ఈ తీర్మానంలో కోరారు. ఇందువల్ల రాజధాని విస్తీర్ణంపై కూడా చట్టబద్ధమైన క్లారిటీ వచ్చే అవ‌కాశ‌ముంది. గ‌తంలో హైకోర్టు తీర్పు ఇస్తూ.. రాజ‌ధానిని మార్చే అధికారం అసెంబ్లీకి లేద‌ని చెప్పింది. ఇప్పుడీ తీర్మానం ద్వారా కేంద్రం చ‌ట్టం చేస్తే.. ఆ తీర్పున‌కు మ‌రింత బ‌లం చేకూరుతుంది. ఇందువ‌ల్ల భ‌విష్య‌త్తులో ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా రాజ‌ధానిని అంగుళం కూడా క‌దిలించ‌లేదు. ఇదీ ఏపీ సీఎం చంద్ర‌బాబు ధీమా. ఈ తీర్మానం ల‌క్ష్యం ఒక్క‌టే. రాజ‌కీయ అస్తిర‌త నుంచి రాజ‌ధానిని కాపాడడం. ఒక వేళ జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి మూడు రాజధానుల పాట మొదలెట్టినా ఫలితం ఉండదు. అందుకే అసెంబ్లీలో అమరావతిని ఏపీ ఏకైక శాశ్వత రాజధానిగా చేసిన తీర్మానానికి అంత ప్రాముఖ్యత.మంత్రి లోకేష్ చెప్పినట్లు ఈ బిల్లును పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదానికి ప్రవేశ పెట్టి ఆమోదిస్తే.. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతం అవుతుంది. రాజథాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగానికి సార్థకత చేకూరుతుంది.

Publish Date: Mar 29, 2026 8:22AM

political-news-img

కుటుంబ కలహాలు.. కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య

కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు చిన్నారులు బలౌతున్న సంఘటనలు ఇటీవల పెచ్చరిల్లాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ తల్లి క్షణికావేశంలో తన రెండేళ్ల కుమారుడిని హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది. స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన కామిండ్ల హరీష్ కు నాలుగు సంవత్సరాల క్రితం కళ్యాణి తో వివాహం జరిగింది... వీరికి శ్రేయాన్ష్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. హరీష్ టిఎస్ఎస్పి లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి తన కొడుకుని తీసుకొనివరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అక్కడకళ్యాణి తన కొడుకుతో సహా ఎస్సారెస్పీ కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు... మృతదేహాల కోసం పోలీసులు గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ వివాదాల వలన కళ్యాణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Publish Date: Mar 29, 2026 7:45AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img