Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 5


 

    దీని గురించి రామం కష్టపడి తెలుసుకున్నాడు. త్వరగా అతడి పధకం రూపిందింది. రామంతో నిమిత్తం లేకుండా గిరిజ, రవి కిషోర్ కు తన అబీష్టం తెలియబర్చి విలియమ్స్ ద్వారా ఆ ఇంటికి వెళ్ళాలి. అక్కడ రామం రవి కిశోర్ ను సఫా చేస్తాడు. అయితే అందుకు గిరిజను ఒప్పించాలి.
    ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు రామం రోజూ కంటే ముందుగా.
    అతను వెళ్ళేసరికి వీధి తలుపులు బార్లా తెరిచి వున్నాయి. గిరిజ ఆశ్రద్దను అప్పటి ఉత్సాహం లో అతను మన్నించగలిగాడు. తలుపులు తనే దగ్గరగా వేశాడు.
    అప్పుడతనికి బెడ్రూం లోంచి మాటలు వస్తున్నా వైనం తెలిసింది.
    రామం ఆశ్చర్య పడ్డాడు. ఆ మాటలు ఒక పురుషుడివి, అది పరిచితమైన కంఠం లాగే వుంది.
    రామం లో అప్పుడే ఆవేశం చోటు చేసుకుంది. జరుగుతున్నా దేమిటో తెలుసుకోవడం కోసం అతను నెమ్మదిగా వెనక నడిచి పడకగది గుమ్మం చేరాడు.
    గుమ్మం దగ్గర్నుంచి లోపల మనుషులు అతడికి కనిపిస్తున్నారు. వాళ్ళకు తను కనిపించాకుండా అతను జాగ్రత్త పడ్డాడు.
    లోపల గిరిజ నిలబడి వుంది. ఆమె కెదురుగా నిలబడి వున్న వ్యక్తిని రామం గుర్తుపట్టాడు. అతను రామం స్నేహితుడు పద్మనాభం. అతడి చేతిలో రివాల్వర్ వుంది.
    "నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు గిరిజా! మొదట్లో నీపై నాకు ఎటువంటి దురభిప్రాయం లేదు. కానీ నువ్వు హోటల్ సంపెంగ కు వెళ్ళాక -- రవికిశోర్ నిన్నెలా వర్ణించాడో రామం చెప్పాడు. ఆ వర్ణన నా కళ్ళముందు మెదిలింది. ఒక్కసారి నిన్ను ఆ వర్ణన ల ప్రకారం చూడాలనుంది. నిజంగానే నీ సౌందర్యం అపురూపం, నిన్నలా చూడని జన్మ వ్యర్ద్ఘం. త్వరగా నాకోరిక తీర్చు. ఒపట్టాన నా మాట వినవనే భయంతో ఈ రివాల్వర్ కూడా తెచ్చుకున్నాను. రామం వచ్చేలోగా నేను వెళ్ళిపోవాలి. ఆలస్యం చేయకు. ప్లీజ్ -- క్విక్ !' అంటున్నాడు పద్మనాభం.
    ఆ క్షణం లో రామానిక్కలిగిన అవేశామింతా అంతా కాదు.
    "రాస్కెల్ -- మిత్ర ద్రోహీ!" అంటూ ఒక్క ఉదుటున గదిలోకి వెళ్ళి పద్మనాభం పీక పట్టుకున్నాడు. ఈ హటాత్ సంఘటనకు పద్మనాభం చేతిలోని రివాల్వర్ జారి పడిపోయింది. అతడికి మాట్లాడే అవకాశం లేకుండా రామం చేతులు అతడి మెడ చుట్టూ బిగుసుకున్నాయి. పెనుగులాడెందుకు అతడి శరీరం ప్రయత్నించే లోగానే అతడి సర్వశక్తులూ క్షీణించసాగాయి. కొద్ది క్షణాల్లో అతను కుప్పలా నేల కూలాడు.
    "చచ్చిపోయాడెమోనండీ --'అంది గిరిజ.
    అప్పటికి రామం ఆవేశం కాస్త తగ్గింది. అతడు చటుక్కున వంగి పద్మనాభం ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. శ్వాస ఆడుతున్నట్లు లేదు. అదే పైకి అన్నాడతను.
    "ఆ" అంది ఓ కంఠం. అది గిరిజ కాదు. అప్పుడు రామం అటు చూశాడు.
    గుమ్మం దగ్గర ఓ యువకుడు నిలబడి వున్నాడు. అతడు పీలగా వున్నాడు. కళ్ళలో భయం కనబడుతోంది మనిషి నిశ్చేష్టుడైనట్లు కనబడుతోంది. చేతిలోని ఏదో పుస్తకం నేలజారింది.
    "ఎవర్నువ్వు?" అంటూ రామం అతన్ని సమీపించాడు. ఇప్పుడు రామం లో ఆవేశం లేదు. భయముంది.
    ఆ యువకుడు ఉలిక్కిపడి -- "నేను....నేను.... నేనేమీ చూడలేదు....' అన్నాడు.
    "ఎవర్నువ్వు?" రామం తన ప్రశ్నను రెట్టించాడు. అతని కంఠం వణుకుతోంది.
    "చందా కోసం వచ్చాను. తోయగానే తలుపులు తెరచుకున్నాయి. మీరు గుమ్మం దగ్గరుంటే దొంగేమో ననుకున్నాను. లోపలకు వెళ్ళగానే నేనూ గుమ్మం దాకా వచ్చాను. తర్వాత....తర్వాత.....నేనింకేమీ చూడలేదు...." అన్నాడా యువకుడు.
    రామం చటుక్కున ఆ యువకుడు చేయి పట్టి లాగి -- "లాభం లేదు . నిన్ను చంపేయాలి" అన్నాడు. అయితే చంపడానికి అవసరమైన ఆవేశం అతడిలో వున్నట్లు లేదు.
    "ప్లీజ్-- నన్ను వదిలి పెట్టండి. నేను మీకేమీ హాని చెయ్యను--"అన్నాడా యువకుడు.
    "లాభంలేదు. జీవితంలో తొలిసారిగా నేను చేసిన హత్యను నువ్వు చూశావు. నన్ను నేను రక్షించుకోవడం కోసం నిన్ను చంపక తప్పదు-- "అన్నాడు రామం.
    "ఎలా వచ్చానో -- అలా వెళ్ళిపోతాను. నేను మీ ఇంట్లో అడుగు పెట్టిన విషయమే మర్చిపోతాను. దయతో నన్ను వదిలి పెట్టండి--" అన్నాడా యువకుడు.
    మరో హత్య చేసే ధైర్యం రామానికి లేదు. ఇతడిని వదిలితే ఏమవుతుందో నని భయంగా వుందతనికి. ఏమీ తేల్చుకోలేని సందిగ్ధం లో అతనుండగా ఆ యువకుడు చటుక్కున రామం చేతి పట్టు విడిపించుకుని పారిపోయాడు. రామం అతణ్ణి తరమాలనుకున్నాడు కానీ అది అనవసరంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని భయపడ్డాడు. వీధిలో ఒకరి వెనుక ఒకరు పరుడుగెడుతుంటే-- తనకు తానై హత్యా నేరం బయట పెట్టినట్లవుతుంది.
    రామం వీధి తలుపులు గడియ పెట్టి లోపలికి వచ్చాడు.
    "ఏమండీ-- ఈయన చచ్చి పోయాడండీ -- "అంది గిరిజ ఏడుపు కంఠంతో.
    "అంటే ....అంటే.....నేను హత్య చేశానా?" అన్నాడు రామం. అతనిప్పుడు పూర్తిగా మామూలు మనిషయి పోయాడు. చతికిలబడి మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఏడవసాగాడు.
    గిరిజ ఏం చేయాలో తోచక అటూ యిటూ చూడసాగింది. అప్పుడామే దృష్టిని అక్కడ కింద పడి వున్న పుస్తకం ఆకర్షించింది. చటుక్కున నడిచి ఆ పుస్తకం అందుకుంది.
    అది రసీదుల పుస్తకం. ఆ యువకుడు చందా తీసుకున్న వారికీ పుస్తకం లోంచి రసీదు లిస్తున్నాడన్న మాట! ఆమె పుస్తకాన్ని అటూ యిటూ తిప్పి చూసింది.
    పుస్తకం వెనక ఓ చిరునామా వుంది. కె. సుబ్బరాయుడు, సోషల్ వర్కర్ అని రాసి వుంది. చిరునామా ఇంటి నెంబరు తో సహా వివరంగా వుంది. గిరిజ చందాల పుస్తకం తెరిచి చూసింది. ప్రతి డూప్లికేటు మీదా సుబ్బారాయుడన్న సంతకం వుంది.
    అంటే ఆ యువకుడే సుబ్బారాయుడన్న మాట-- అనుకుంది గిరిజ. ఈ విషయం చెప్పడానికి ఆమెభర్త వద్దకు పరుగెత్తింది. కానీ అతనామే ఏం చెప్పినా వినే స్థితిలో లేడు. అలా ఆగకుండా ఏడుస్తూనే వున్నాడు.
    గిరిజ అతడ్ని ఒదార్చసాగింది -- "ఏమండీ-- జరిగింది జరిగిపోయాక ఇప్పుడు ఏడ్చి లాభమేమీటండీ-- ముందేం చేయాలో ఆలోచించాలి..."
    "నేను హత్య చేశాను గిరిజా-- ఇప్పుడు నేను హంతకుడ్ని . నన్ను చూస్తె నీకు భయం వేయడం లేదూ -- ఒళ్ళంతా కంపరంగా లేదూ-- 'అన్నాడు రామం ఇంకా ఏడుస్తూనే.
    "ఒక ఆడదాన్ని ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా-- అనుభావించాలనుకునే పద్మనాభం లాంటి వ్యక్తీ -- హంతకుడి కంటే భయంకరమైన వాడు. ఆడదానికి మానభంగం కంటే జుగుప్సాకరమైన అనుభవం వుండదు. అలాంటి వ్యక్తీ నుంచి, అలాంటి అనుభవం నుంచి నన్ను రక్షించిన మీరు నాకు దేవతా స్వరూపులు. నిజానికి రవికిశోర్ పద్మనాభం కంటే వెయ్యి రెట్లు మెరుగండీ! అతడు మనల్ని ఆ హోటల్ నిబంధనల మేరకు మాత్రం అవమానించాడు. వీడు అన్ని నిబంధనలూ అతిక్రమించాడు. వీడికిది తగిన శిక్షే అనుకుంటాను...." అంది గిరిజ.
    అప్పుడు రామానికి తను రవికిశోర్ని చంపాలని పధకం వేసుకొనడం గుర్తుకొచ్చింది. అది చెప్పాలన్న ఉత్సాహంతోనే ఇంటికి పెందరాళే వచ్చాడు. అలా రావడం వల్లనే గిరిజ శీలం సంరక్షించబడింది. రవికిశోర్ తనభార్యను కోరాడు-- కానీ అందుకు అనుమతి కూడా తీసుకోదలచాడు. పద్మనాభం అలా కాదు , గిరిజ అనుమతితో కూడా నిమిత్తం లేకుండా ఆమెను అనుభవించదలిచాడు. రవికిశోర్ ను తను చంపాలని అనుకోవడం గిరిజను పద్మనాభం బారి నుండి రక్షించింది.
    అది సరే!...తను నిజంగా రవికిశోర్ ను హత్య చేయగలిగి వుండేవాడా?
    ఆవేశం తనను హత్యకు పురిగోల్పుతోంది తప్పితే.... హత్య చేసి తట్టుకునే మనోబలం తనకు లేదు.
    పద్మనాభాన్ని తను చంపాలని అనుకోలేదు. కానీ చంపేశాడు.
    "గిరిజా! ఇప్పుడెం చేయాలి?"
    భర్త అధైర్య పడుతుంటే గిరిజకు జాలి వేసింది.

                                     6
    భార్యాభర్త లిద్దరూ విచారంగా అలోచించి తదుపరి కార్యక్రమం నిర్ణయించారు.
    అనుకోకుండా తను ఎక్కడికో బయల్దేరవలసి వచ్చిందనీ-- వారం రోజుల్లో తిరిగొచ్చాక వివరాలన్నీ చేబుతాననీ పద్మనాభం భార్యకు రాసిన విధంగా ఓ ఉత్తరాన్ని గిరిజ తయారుచేసింది. వుత్తరం చాలా హడావుడిగా రాసినట్లు రాసింది. వుత్తరాన్ని రామం పోస్టు చేసి వచ్చాడు.
    ఈ వుత్తరం అందుకుంటే వారం రోజుల దాకా పద్మనాభం భార్య అతడి గురించి ఆలోచించదు. కేసు ఎంత పాతపడితే అంత మంచిది. తిరగతోడడం పోలీసులకు అంత కష్టమవుతుంది. అదికాక పద్మనాభం భార్య వెంటనే ఎలాగూ పోలీసుల దగ్గరకు వెళ్ళదు.
    భార్యాభర్తలిద్దరూ కలిసి కష్టపడి దొడ్లో నిలువెత్తు లోతున గొయ్యి ఒకటి తీసి పద్మనాభాన్ని అందులో పాతి పెట్టారు. ఎక్కడా ఆనవాలు దొరక్కుండా గోయ్యిని బాగా కప్పెట్టేశారు.
    తర్వాత రామం అడ్రస్ పట్టుకుని సుబ్బరాయుడింటికి వెళ్ళాడు.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.