Home » VASUNDHARA » Bommarillu Kadhalu


 

    వీరసేనుడు చతుక్కున వచ్చి కన్నయ్య చేతులు పట్టుకుని , "నువ్వు సామాన్యుడివి కాదు. నిన్ను నేను అనరాని మాటలన్నాను. నన్ను మన్నించు. ఇప్పుడీక్కడున్న ఈ ఇద్దరి లోనూ నా అసలు కూతురెవరు ?" అన్నాడు.
    'అది బహుశా మీ కూమార్తెలక్కూడా తెలిసి ఉండదు" అన్నాడు కన్నయ్య.

                                       12

    ఇందుమతికి ఓ కవల సోదరి ఉంది. ఆమె పేరు బిందుమతి.
    కొన్ని కారణాల వల్ల ఈ విషయం రహస్యంగా ఉంచబడింది. అందచందాల్లో తెలివి తేటల్లో, శక్తి సామర్ధ్యాల్లో ఇద్దరూ ఒక్కటే ! ఇప్పుడు స్వయం వరానికి సంబంధించిన సమస్య రావడంతో రహస్యం బైట పెట్టక తప్పలేదు.
    వీరసేనుడు పకక్బందీగా ఓ కధ తయారు చేయించి పై విధంగా ప్రచారం చేయించాడు. నమ్మిన వాళ్ళది నమ్మారు. లేని వాళ్ళు లేదు. కానీ ముంముర్తూలా ఒకరినొకరు పోలి ఉన్న ఇందుమతీ, బిందుమతులు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించారు.
    ఏమైతేనేం తమ సమస్య ఈ విధంగా పరిష్కరించ బడిందని త్రిశోకుడూ, విమలుడు ఎంతో సంతోషించారు. వారిద్దరి వివాహాలు ఇందుమతీ, బిందుమతులతో వైభవంగా జరిగిపోయాయి.
    కుమార్తెల వివాహాలై వారు వారి రాజ్యాలకు తరలి వెళ్ళాక కొంత కాలానికి వీరసేనుడు కన్నయ్యకు కబురు పంపి, "ఇన్నాళ్ళకు నేను నీవు కోరిన రధ గజ, తురగ పదాతి దళాల్లో ఒక్కొక్కటి సంపాదించ గలిగాను. నీకు దాన మివ్వడానికి సిద్దంగా ఉన్నాను." అన్నాడు.
    ఇద్దరూ వీరసేనుడి సైన్యం ఉండే ప్రాంతానికి వెళ్ళారు.
    కన్నయ్య తన భిక్షపాత్రను నేలపై వుంచాడు రాజు చెపుతుంటే రెండు గుర్రాలు పూన్చిన రధం ఒకటే, యుద్ద శిక్షణ పొందిన ఏనుగు ఒకటీ, మేలు జాతి అశ్వం ఒకటీ, ఒక వీర సైనికుడూ భిక్షా పాత్రలో ప్రవేశించి అదృశ్యమై పోయారు. ఇదివరలో చూసినప్పటికీ వీరసేనుడికి ఆ అదృశ్యం ఇంకా అద్భుతంగానే ఉంది.
    అప్పుడు కన్నయ్య వీరసేనుడితో ఇలా అన్నాడు. "రధం పై రధ చోదకుడున్నాడు. ఏనుగు పై మావటీ ఉన్నాడు. ఆశ్వం పై అశ్వ సైనికుడున్నాడు. వీర సైనికుడున్నాడు. వీరందరికీ బయట కుటుంబా లుంటాయి. వాళ్ళ వాళ్ళు వారికోసం కలవర పడుతుంటారు. ఒక పర్యాయం వారీ పాత్రలోకి ప్రవేశించడం తో నాకు వారితో పని అయిపొయింది. వారిని తిరిగి బైటకు రప్పించి మీకు అందజేస్తున్నాను." అంటూ ఒక్కొక్కరినే పిలిచాడు. పిలుపు వింటూనే రధం, గజం, తురగం , బంటు అంతా పైకి వచ్చి నిలబడ్డారు.
    "మరి నాకు సెలవిప్పించండి. నేను బయల్దేరి దుర్జయ దేశాన్ని జయించుకుని వస్తాను" అన్నాడు కన్నయ్య.

                                 13

    కన్నయ్య పర్వతశ్రేణులు చేరుకున్నాడు. వాటిని దాటుకుని అవతలి ప్రక్కకు వెళ్ళాలంటే తనకు చాలా రోజులు పట్టవచ్చునని వాడికి అనిపించింది. అయినప్పటికీ దుర్జయ దేశాన్ని చేరుకోవడానికి అదొక్కటే మంచి పద్దతి అని వాడికి తోచింది. చతురంగ బలాలతో వీరసేనుడు ఈ పర్వతాలు చాటి వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలుడు అయ్యాడు.
    కన్నయ్య కొంతదూరం నడిచాక వాడిని పది మంది భటులు చుట్టుముట్టి- "నువ్వెక్కడి వాడివి ? ఎందుకు మా దుర్జయదేశంలో ప్రవేశిస్తున్నావు ?" అనడిగారు.
    "నేనొక సిద్ద పురుషుణ్ణి , దుర్జయ దేశపు ప్రభువు క్రూర సేనున కోక రహస్య వర్తమానం అందించాలి." అన్నాడు కన్నయ్య.
    రాజభటులు కన్నయ్య వళ్ళంతా తడిమి చూశారు. వాడి చేతిలో భిక్షా పాత్ర తప్ప ఇంకేమీ లేదు వాడి దగ్గర.
    'సరే - వెళ్ళు " అన్నారు వాళ్ళు. వాణ్ణి పరీక్షించి మరీ లోపలకు పంపినట్లు చిహ్నంగా- కన్నయ్య అంగీ పై వారొక ముద్ర కూడా వేసి , "నిన్నెవరైనా అడ్డు పెడితే ఈ ముద్ర చూపించూ " అని కూడా చెప్పారు.
    కన్నయ్య అలాగే ముందుకు పోయి, రెండు రాత్రులూ, రెండు పగళ్ళూ పయనించి దుర్జయ దేశం చేరుకున్నారు.
    వాడక్కడకు చేరుకున్న కొద్ది క్షణాల్లోనే గుర్రం మీద ఒక వ్యక్తీ అటుగా వచ్చి- "ఎవడ్రా నువ్వు - కొత్త వాడివిలావున్నావు - పద పని చేద్దువు గాని -" అన్నాడు.
    విషయం తెలుసుకోవడానికి కన్నయ్య కు కాసేపు పట్టింది. ఆ ప్రాంతాల ఒక గొప్ప విలాస మందిరం నిర్మించబడుతోంది. దాని నిర్మాణానికి లక్షల కొద్దీ కూలీలు కావాలట. కనబడ్డ ప్రతి వాడినీ క్రూర సేనుడు ఆ పనికి తరలిస్తూన్నాట్ట.
    "నేను కొత్త వాడినే - కానీ పొరుగు దేశం నుంచి వచ్చాను. ప్రభువు క్రూర సేనుడికి గొప్ప రహస్య వార్త వినిపించాల్సి ఉంది -" అన్నాడు కన్నయ్య.
    ఏమనుకున్నాడో గుర్రపు రౌతు కన్నయ్యను వదిలి పెట్టాడు. కన్నయ్య రాజధానికి బయల్దేరి వెడుతూ దుర్జయ దేశపు ప్రజలు అన్ని విధాలా ఇబ్బంది పడుతున్నట్లు అర్ధం చేసుకున్నాడు. క్రూర సేనుడి పాలనలో అంతులేని ప్రజా పీడన కొనసాగుతోంది. ఏ క్షణంలో ఎవరిని కారాగారం లో పారవేస్తారో తెలియదు. రాజ భటులంటే ప్రజ లందరికీ విపరీతమైన భయం. వాళ్ళడిగిన పన్నులు కట్టాలి. పనులు చేయాలి. ఆడవాళ్ళ నేత్తుకు పోతుంటే చూస్తూ ఊరుకోవాలి. దేనికీ ఇదేమని అడక్కూడదు.
    కన్నయ్య రాజధానీ నగరానికీ వెళ్ళి తిన్నగా రాజభవన ద్వారం చేరుకొని- "ప్రభువు క్రూర సేనుడి కొక ముఖ్య వార్త వినిపించాలి. పొరుగు దేశం నుంచి ఓ సిద్ద పురుషుడు వచ్చాడని చెప్పు !' అన్నాడు ద్వారపాలుడుతో.
    ఆ సమయానికి సభా మంటపంలో క్రూర సేనుడు కొలువు తీరి ఉన్నాడు. ఆస్థాన నర్తకి నర్తిస్తుంటే సభికులంతా రాజుతో పాటు ఆ వినోదం తిలకిస్తున్నారు. అప్పుడే ద్వారపాలకుడు రాజుకు కన్నయ్య చెప్పిన సందేశం వినిపించాడు.
    "లోనికి ప్రవేశ పెట్టు !" అన్నాడు క్రూరసేనుడు.
    కాసేపటికి కన్నయ్య సభా మంటపం లో ప్రవేశించాడు. అక్కడి వాతావరణం చూసేసరికి వాడి కడుపు మండిపోయింది. ఒక పక్క రాజ భటులు అంతులేని ప్రజా పీడన కావిస్తుంటే ఇక్కడ రాజు, సభ్యులు సరస వినోద కార్యక్రమాల్లో తేలియాడుతున్నారు.
    "నువ్వేనా సిద్ద పురుషుడివి!" అనడిగాడు. క్రూరసేనుడు. అవునన్నట్లు తలాడించాడు కన్నయ్య.
    "ఏమిటి నువ్వు తెచ్చిన ఆ సందేశం ?" అనడిగాడు క్రూర సేనుడు.
    "పొరుగు దేశపు రాజు వీరసేనుడు తన మాటలుగా మీకు చెప్పమన్న దిది! మీ రాజ్యంలో ప్రజలు అష్టకష్టాలకు గురి అవుతుంటే మీరు పట్టించుకోకుండా శృంగార కేళీ వినోదాల్లో తేలియాడుతున్నారు. సాటి ప్రభువుగా వీరసేనుడిది సహించలేడు. మీ ప్రవర్తన మార్చుకొని పక్షంలో మిమ్మల్ని తగిన విధంగా శిక్షిస్తాడు - " అన్నాడు కన్నయ్య.
    ఈ మాట వింటూనే క్రూర సేనుడి కనులు ఎర్రబడ్డాయి. అయన పక్కనే ఉన్న సైన్యాధి పతి కత్తి చూసి, "ప్రభూ! తమ సమక్షంలో ఇలా మాట్లాడానికి వీడి కెంత దైర్యం ? తమరు అనుమతిస్తే తక్షణం వీడి తలను మొండెం నుంచి వేరు చేస్తాను -" అన్నాడు.
    "ఒక్కగానొక్కడు . వీడు మన కొక లెక్క కాదు తొందరపడకు -" అంటూ క్రూరసేనుడు సైన్యాధి పతిని వారించి - "మీ రాజు నన్నెలా శిక్షిస్తాడో చెప్పాడా ?' అన్నాడు.
    'చెప్పడ మెందుకు ? చేసి చూపిస్తాను ......." అన్నాడు కన్నయ్య.
    "ఏం చేస్తా వేమిటి ?"
    "మిమ్మల్ని నా బందీగా తీసుకుని వెళ్ళి వీరసేనుడికి అప్పగిస్తాను ......" అన్నాడు కన్నయ్య.
    "నువ్వా ? నిన్ను చంపడానికి నా భటుడొక్కడు చాలు ..." అన్నాడు క్రూర సేనుడు వేళాకోళంగా.
    "భటుడి సంగతి అటుంచండి. మీరు చతురంగ బలాలలో వచ్చినా నన్ను చంపలేరు. కావాలంటే నేను యుద్దానికి సిద్దంగా ఉన్నాను -" అన్నాడు కన్నయ్య.
    క్రూర సేనుడు ఓ క్షణం అలోచించి సైన్యాధిపతితో ఇలా అన్నాడు- "ఈ వాచాలుడి కెటువంటి శిక్ష విధించాలా అని ఆలోచిస్తుంటే వాడే ఉపాయం సూచించాడు. వీణ్ణి రేపు మన నగరపు పొలిమేరన గల మైదానపు ఆవరణ మధ్యన ఉంచండి. చతురంగ బలాలతో వీణ్ణి చుట్టూ ముట్టండి. ప్రతి రధమూ వీడి నుంచి పోవాలి. ప్రతి గజమూ , తురగమూ వీణ్ణి తొక్కాలి. ప్రతి సైనికుడూ వీడి శరీరాన్ని కత్తితో పొడవాలి. అదే వీడికి తగిన శిక్ష !"
    రాజుగారి మాటల వింటూ సభికులంతా చప్పట్లు చరిచారు. అయితే చెరగని చిరునవ్వుతో తమ మధ్యన నిలబడి ఉన్నకన్నయ్య తీరు వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది . కన్నయ్య ధైర్యం ఏమిటి ? వాడు నిజంగా సిద్దపురుషుడా లేక పిచ్చి వాడా ?
    ఎక్కువమంది కన్నయ్య మీద జాలిపడ్డారు.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.