Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 15


 

                                     15
    శివరావు బ్లాక్ మెయిలర్ రూపంలో ప్రవేశించిన ప్రభుత్వం ఏజంటు.
    నగరంలో దొంగనోట్లు విరివిగా ప్రింటవుతున్న విషయం ఆచూకీ తీయడాని కతనీ ఊరు వచ్చాడు. ఊళ్ళో ని ధనవంతుల రహస్యాలను కొన్ని తెలుసుకుని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అందుకతను కామిని సహాయం కూడా తీసుకున్నాడు. తనకు వచ్చే డబ్బులో ఎవరు ఎలాంటి డబ్బు ఇస్తున్నారన్న విషయాన్ని తను శ్రద్దగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రిపోర్టు తయారు చేసి పంపుతుండేవాడు. అతను పంపిన ఆఖరు రిపోర్టు లో దొంగ నోట్ల గురించి కొంత ఆచూకీ దొరికిందనీ, రెండు మూడు రోజుల్లో నేరస్థుడు దొరకవచ్చుననీ అతను వ్రాశాడు.
    ఆ నేరస్తుడు శేషగిరి అన్న విషయం అతను తన రిపోర్టు లో వ్రాయలేదు. కానీ శేషగిరిని మాత్రం శివరావు  బెదిరించడం మొదలు పెట్టాడు. అతను దొంగనోట్లు అచ్చు వేస్తున్న విషయం తనకు తెలిసిందనీ, తనకు పాతిక వెలిస్తే రహస్యం రహస్యంగా వుండగలదనీ శివరావు శేషగిరి ని హెచ్చరించాడు. శేషగిరి పాతిక వేలూ ఇచ్చినట్లయితే అతని నేరం ఇంచుమించు రుజువై పోయినట్లే!
    మోహన్ తల్లి చంద్రిక మాధవరావు గారికి దూరపు వరుసలో మరదలవుతుంది. చంద్రిక పెళ్ళి కాకముందే శేషగిరి తో చీకటి తప్పు చేసింది. ఆ తప్పు కారణంగా ఆమె గర్భవతి అయింది. శేషగిరి కి అప్పటికే పెళ్ళయి పోయింది.
    చంద్రిక తలిదండ్రులు ఏం చేయాలో తోచక తికమక పడుతున్న సమయంలో విషయం మాధవరావు గారి దాకా వెళ్ళి అయన చంద్రి కను చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. అయన త్యాగశీలత నందరూ అభినందించారు. వివాహం కాగానే మాధవరావు భార్యతో సహా దూర ప్రాంతాలకు పోయి, అక్కడ భార్య పండండి కొడుకును కన్నాక మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ బిడ్డడే మోహన్.
    అయితేమధవరావు త్యాగానికి అర్ధం లేకపోలేదు. అయన నపుంసకుడు. ఆవిషయం నలుగురికీ తెలియడం ఆయనకిష్టం లేదు. తనూ వివాహితుడై తనకూ కొడుకో, కూతురో పుడితే తన గురించి ఎవరికీ అనుమానం రాదనీ అయన ఆశ. అందుకే గర్భవతి అని తెలిసి కూడా అయన చంద్రికను చేసుకునేందుకు సిద్దపడ్డాడు. అ విధంగా ఆయనకు చంద్రిక తలిదండ్రులు కృతజ్ఞత తో పడి వున్నాడు.అటు తండ్రీ కాగలిగాడు.
    అయితే చంద్రిక కింకా నూరేళ్ళ జీవితముంది. నపుంసకుడైనా భర్తతో ఎన్నేళ్ళని నిగ్రహంగా వుండగలదు? ఆమె బరితెగించేయగలదన్న భయంతో తన బిడ్డకు తండ్రి అయిన శేషగిరి ఎలాగూ ఓకే పర్యాయం ఆమెను కలిశాడు కాబట్టి తన భార్యనుకలుసుకోవచ్చునన్నట్లు భార్యకు సూచన ప్రాయంగా తెలియజేశాడు. ఆ విధంగా కావడానికి మాధవరావు భార్య అయినప్పటికీ చంద్రిక శేషగిరి రెండో భార్యగా ఉంటూ వచ్చింది. మాధవరావు అమోదముంది కాబట్టి ఈవిషయం బయటి వారి కేవ్వరికి తెలియదు. కానీ బ్లాక్ మెయిలింగ్ వృత్తిగా పెట్టుకున్న శివరావు ఈ సమాచారాన్ని సేకరించగలిగాడు.
    కలవారి బిడ్డగా ఘనంగా పెరుగుతున్న మోహన్ కి తన చరిత్ర తెలియజెప్పి,శేషగిరిమీద కసిగోల్పి, శేషగిరి రహస్యాలన్నీ బయట పెట్టించాలని శివరావు పధకం వేశాడు. హత్య చేయించడానికి ముందు రోజు సాయంత్రం అతను మోహన్ ని కలిసి, తనకు తెలిసిన రహస్యం చెప్పాడు. మోహన్ ముందు తెల్లబోయాడు. ఇదంతా శేషగిరి కారణంగానే జరిగిందనీ, అతని మీద పగ తీర్చుకునే టందుకు మంచి ఉపాయా మోకటుందని , మర్నాడుదయం తన్ను ఫలానా చోట కలుసుకోమని చెప్పాడు. శేషగిరి విషయంలో తనకు సహాయపడే పక్షంలో కామిని విషయంలో కూడా మరి బ్లాక్ మెయిల్ చేయననీ చెప్పాడు శివరావు.
    కానీ కధ శివరావను కున్న విధంగా జరుగలేదు. మోహన్ ఇంటికి వెళ్ళి తల్లిని నిలదీశాడు. ఫోన్ చేసి శేషగిరిని కదిగేశాడు. ఇద్దరి కధలూ విన్నాక అతనికి తన తల్లి మీదే తప్పు లేదనిపించింది. అతను నెమ్మది మీద శాంతించగలిగాడు. తప్పు చేయడం కంటే తప్పు బహిర్గతం కావడమే అవమాన మానుకునే నైజం అతని రక్తంలో వుంది, శివరావుని చంపెయడమే అందుకు మార్గం అనుకున్నాడతను.
    తన బ్లాక్ మెయిలింగ్ డబ్బులో శివరావు కామిని కి కొంత వాటా ఇవ్వవలసి వుంది. అతను సరిగ్గా తన కివ్వడం లేదనీ, తన్ను మోసం చేస్తున్నాడని కామినికి అనుమానం వచ్చింది. ఆమె అనుమానానికి శివరావు నవ్వేసి, 'అంతగా నమ్మకం లేకపోతె నాతొ పాటు రా. రహస్యంగా పొంచి వుండి జరిగేది చూడు" అన్నాడు.
    మర్నాడే శేషగిరి శివరావుకు  పాతిక వేలిచ్చుకోవలసి వుంది. ఆ టైముకు ఒక అరగంట ముందుగా మోహన్ తో అపాయింట్ మెంటు పెట్టుకున్నాడు శివరావు. మోహన్ ని బాగా రెచ్చగొట్టి , అతనా స్థితిలో వుండగా శేషగిరి అక్కడకు రావాలని అతని పధకం.
    శివరావు, కామిని ఇంట్లోకి వెళ్ళారు. కామిని ఎవరికీ కనబడకుండా ఒక మూల నక్కింది.
    అన్న టైం కి మోహన్ వచ్చాడు. అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు.
    "ఏం నిర్ణయించుకున్నావ్?" అడిగేడతను.
    "నువ్వు చెప్పింది అబద్దం" అన్నాడు మోహన్.
    "నా దగ్గరరుజువులున్నాయి." అన్నాడు శివరావు.
    "నీ కధలో కొన్ని లోపాలున్నాయి. మరోసారి చెప్పు!" అన్నాడు మోహన్. అతన్ని రెచ్చగొట్టే పద్దతిలో మొత్తం కధంతా చెప్పాడు శివరావు.
    "చాలా వివరంగా గుర్తుంచుకున్నావ్. ఈ సమాచారం ఇంకా ఎవరికైనా తెలుసా?" అన్నాడు మోహన్.
    "మీ నాన్నకూ, శేషగిరి కీ , మీ అమ్మకీ తర్వాత ..... ఈ రహస్యం తెలిసినవాడని నేనొక్కడినే. నా దగ్గరకు వచ్చిన రహస్యం చాలా పదిలంగా వుంటుంది. నన్ను దాటిపోదు" అన్నాడు శివరావు.
    "మంచిది" అంటూ మోహాన్ లేచాడు. "ఆ శేషగిరి ని బ్రతకనివ్వను. నేనేం చేయాలో చెప్పు" అంటూ శివరావు ని సమీపించాడు. శివరావు ముఖంలో సంతోష రేఖలు కనబడ్డాయి. కానీ క్షణం లో మెరుపు వేగంతో అతని గుండెల్లో కత్తి దిగబడింది. శివరావు వెనక్కు పడిపోయాడు. కత్తి బలంగా దిగబడింది. శివరావు మళ్ళీ మాట్లాడలేదు.
    చాటుగా ఈ విషయం చూస్తున్న కామిని భయంతో వణికిపోయింది. ఏ రహస్యం దాచడం కోసం మోహన్ శివరావుని హత్య చేశాడో అదే రహస్యం తనకూ ఇప్పుడు తెలిసింది. పైగా హత్య తను కళ్ళారా చూసింది. ఆమె అక్కణ్ణించి ఎలాగో తెలివిగా మోహన్ కళ్ళ బడకుండా బయటపడగలిగింది.
    శేషగిరి వెళ్ళేసరికి మోహన్ ఇంకా అక్కడే వున్నాడు. అప్పటికి హత్య జరిగి పది నిముషాలయిందో లేదో , జరిగింది అర్ధమయింది శేషగిరికి. "హత్య చేశావా? తక్షణం దొడ్డి దారిన పారిపో!' అన్నాడు. మోహన్ పారిపోయాడు.
    తర్వాత శేషగిరి గబాగబా అక్కడ అన్నీవేదికాడు. శవం జేబులో కొన్ని కాగితాలు, ఫోటోలు దిరికాయి. అవి తీసుకుని, మోహన్ ని రక్షించడం కోసం అతనక్కడి కొచ్చిన ఆధారాలు పరిశీలించాడు. కత్తి పిడి మీద ఎందుకైనా మంచిదని వ్రేలిముద్రలు తుడుస్తున్న సమయంలో నేనాయన్ను చూశాను.
    శివరావు ప్రభుత్వపు ఏజంటు కావడంతో దర్యాప్తు చాలా రహస్యంగా జరిగింది. కొన్ని ఆధారాలతో మోహన్ ని అరెస్టు చేశారు. కానీ సరైన రుజువు లింకా లభించలేదు.
    నా రెండో కూతురి రామావతి , నాకూ నకిలీ డిటెక్టివ్ కూ జరిగిన సంభాషణ అసలు డిటెక్టివ్ కు చేర్చడంతో కేసును మళ్ళీ ఆధారం దొరికింది. నాచేత శేషగిరి పేరు చెప్పించడం కోసం చాలా తంటాలు పడ్డారు.
    ప్రతి ప్రభుత్వపు ఏజంటుకూ సాధారణంగా డూప్స్ వుంటారు.  అవసరాన్ని బట్టి ఈ డూప్స్ నిఉపయోగించడం జరుగుతుంది. ఈ డూప్స్ కూడా అసలు ఏజంటు పోలికల్లో వుంటారు. అచ్చు ఒరిజినల్ ఏజంటు లా తయారు కావడానికి కొద్ది పాటి మేకప్ చాలు. నడక, ప్రవర్తన అలవాట్లు వగైరా లన్నీ ఒరిజినల్ ఏజంటు కిలా గానే వీరూ అలవర్చుకుంటారు. నాచేత నిజం చెప్పించడానికి ఆఖరు ప్రయత్నంగా శివరావు స్థానంలో డూప్ వచ్చాడు. ఫలితం సాధించాడు.    
    జరిగినదంతా గ్రహించేక నాకనిపించింది -- అంతకాలం శేషగిరి హంతకుడని నిరూపించడానికి నన్ను నేను ప్రత్యక్ష సాక్షిగా బావిస్తూ వచ్చాను. కానీ హంతకుడు శేషగిరి కాదు.
    అందుకే మన కళ్ళను కూడా మనం నమ్మకూడదు. కళ్ళ ముందేదైనా జరిగినప్పటికీ ఎవ్వరూ సాక్షులు కాలేరు. ఈ సకల చరాచార ప్రపంచంలో అన్నీ తెలిసిన ప్రత్యక్ష సాక్షి ఆ పరమాత్మ ఒక్కడే!

                        -----: అయిపొయింది :----- 




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.