రేపే విశిష్టమైన రోజు.. ఇలా చేస్తే సౌభాగ్యం, సర్వ శుభాలు చేకూరతాయి..!
అమ్మవారు ఈ సృష్టికి అమ్మగా పరిగణించబడతారు. ఆ శక్తి ఈ సృష్టికి మూలం కూడా. అమ్మవారిని చాలా విధాలుగా పూజిస్తారు. వాటిలో నవరాత్రులు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం ఉగాదితో వసంత నవరాత్రులు మొదలయ్యాయి. ఈ వసంత నవరాత్రులను చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. ఈ వసంత నవరాత్రులలో మూడవ రోజు మంగళవారం అవుతుంది. ఈ మూడవ రోజు అమ్మవారికి చాలా విశేషమైన రోజు.. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి హిమవంతునికి పుత్రికగా పార్వతిగా జన్మిస్తుంది. పార్వతి దేవి పరమేశ్వరుడిని భర్తగా పొందడానికి తపస్సు చేస్తుంది. ఆ తపస్సు సిద్దించినది ఈ రోజే అని చెబుతారు. అంటే వసంత నవరాత్రులలో మూడవ రోజే పార్వతి దేవి తపస్సు సిద్దించిన రోజు. ఈ రోజున అమ్మవారికి చేసే పూజ చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. దీని గురించి తెలుసుకుంటే..
వసంత నవరాత్రులలో మూడవ రోజు పార్వతి దేవి తపస్సు సిద్దించిన రోజు. ఈ రోజు అమ్మవారికి సౌభాగ్య గౌరీ వ్రతం చేసుకుంటారు. ఈ సౌభాగ్య గౌరీ వ్రతాన్ని పద్దతి పూర్వకంగా చేసుకోకపోయినా షోడశోపచారాలతో పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు, బెల్లం, యాలకులు వేసిన పానకం నైవేద్యంగా పెట్టవచ్చు. సాయంత్రం ముత్తైదువులను ఇంటికి పిలిచి అమ్మవారికి హారతి ఇచ్చి, వీలైనవారు అమ్మవారిని ఉయ్యాలలో వేసి డోలోత్సవం చేయవచ్చు.
డోలోత్సవం చేస్తే చాలా మంచిది. ఒకవేళ కుదరని వారు సాధారణంగానే అమ్మవారికి హారతి ఇచ్చి వడపప్పు, పానకం తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు. తాంబూలంలో మామిడిపండు పెడితే చాలా మంచి ఫలితం ఉంటుంది. చాలా గుడులలో కూడా డోలోత్సవం చేస్తారు. ఇలా డోలోత్సవం చేసిన వారు చివరలో అమ్మవారి దగ్గరకు వెళ్లి తమ తమ భర్తల పేర్లను అమ్మవారి దగ్గర మెల్లగా చెప్పి భర్తతో తన జీవితం సంతోషంగా ఉండాలని కోరాలి. ఇలా చేస్తే అమ్మవారి కరుణ వారి మీద ఉంటుందని, అమ్మవారు సౌభాగ్యాన్ని చల్లగా ఉంచుతారని చెబుతారు. ఇక పెళ్ళి అయిన వారు పై విదంగా చేసుకోవచ్చు. పెళ్లి కాని వారు ఈ పూజ చేసుకుంటే అచ్చం పైన చెప్పినట్టే పూజ చేసుకుని అమ్మవారికి డోలోత్సవం నిర్వహించిన తరువాత అమ్మవారి దగ్గర మెల్లగా నాకు మంచి భర్తను ఇవ్వమ్మా అని అమ్మను వేడుకోవాలి. ఈ విదంగా చేసుకుంటే మహిళల వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.
మహిళలకు నెలసరి వల్ల ఏమైనా ఆటంకాలు వచ్చి ఉంటే.. మంగళవారం కాకుండా 5 రోజులు గడిచిన తరువాత వసంత నవరాత్రులు అయిపోయే లోపు పై విధంగా పూజ చేసుకోవచ్చు.
*రూపశ్రీ.
