వైకుంఠ ఏకాదశి.. చాలా మందికి తెలియని షాకింగ్ నిజాలు.. ఏకాదశి రోజు చేయాల్సినది ఇదే..!
హిందూ పంచాంగంలో తిథులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ప్రతి మాసంలో ఏకాదశి తిథి వస్తుంది. ఇది కూడా రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి తిథికి చాలా ప్రత్యేకత ఉంది. ఇలా చూస్తే ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. చాలామంది పంచాంగంలో వచ్చే చాలా వ్రతాలు, పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ వ్రతాలు అన్ని చేసినా ఏకాదశి వ్రతం చేయకుంటే అసలు వ్రతాలు చేసిన ఫలితమే దక్కదట. ఇక ఏ వ్రతం చేసినా చేయకున్నా.. ఏకాదశి వ్రతం చేస్తే అన్ని వ్రతాలు చేసినంత ఫలితం, పుణ్యం దక్కుతుందట. అసలు వైకుంఠ ఏకాదశి ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏకాదశి వ్రతం ఎవరు చేయాలి? ఎలా చేయాలి? తెలుసుకుంటే..
పుష్య మాసంలో సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. వైకుంఠం ఆ శ్రీమన్నారాయణుని నివాసం. ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరచుకుంటాయి. సంక్రాంతి పండుగతో ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయన ప్రారంభంతో దేవతలకు రోజు ప్రారంభం అవుతుంది. అందుకే ఉత్తర ద్వార దర్శనం కేవలం శ్రీమన్నారాయణుడునే కాకుండా మొత్తం ముక్కోటి దేవతల దర్మనం చేసిన ఫలితం ఇస్తుందట.
ఏకాదశి వ్రతం..
హిందూ పండుగలు, ప్రత్యేక రోజులలో చాలా మంది ఉపవాసం ఉండటం, వ్రతాలు, పూజలు చేయడం జరుగుతుంది. అయితే పురాణాల ప్రకారం ఉపవాసం అనేది నిర్థేశించినది కేవలం ఏకాదశి కోసం మాత్రమేనట. ఉపవాసం చెయ్యాలి. ఉపవాసం అంటే తిండి, నీరు తీసుకోకపోవడం కాదు.. భగవంతుని చింతనలో గడపడం. దేవుడి పూజ, పారయణ, దైవ నామ స్మరణ, జపం.. ఇలా చేసుకోవడం. అలాగే అస్సలు తినకుండా అయితే ఉండాలనే నియమం లేదు. పూజ, జపం అయిపోయే వరకు తినకుండా చేసుకోవచ్చు. తరువాత పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఇక్కడ కటిక ఉపవాసం చేస్తూ అదే నిజమైన ఉపవాసం అనుకోకూడదు.అలాగే ఇతర మతాలు, వారి పద్దతులతో ఉపవాసాన్ని ఎప్పుడూ పోల్చుకోకూడదు.
ఏకాదశి వ్రతం చేయాలని అనుకునే వారు వైకుంఠ ఏకాదశి రోజు సంకల్పించుకుంటే మంచిది. ఈ రోజు మొదలు ప్రతి నెలలో వచ్చే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండటం, భగవన్నామ స్మరణ చేయడం, జపం, మనసు దేవుడి మీద ఉంచడం చేయాలి. ఇలా ప్రతి ఏకాదశికి చేస్తూ వస్తే..అదే ఏకాదశి వ్రతం అవుతుంది. ఏదైనా ఆటంకాలు వస్తే తప్ప ఏకాదశి ఉపవాసం, పూజ, జపం, దైవ చింతన, దైవ పారాయణ తప్పకూడదు. ఇదొక్కటి పాటిస్తుంటే జీవితంలో సమస్యలన్నీ మంత్రించినట్టు మెల్లిగా తగ్గిపోతాయని పురాణ పండితులు చెబుతున్నారు.
*రూపశ్రీ.
