కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ రహస్యం.. నివారణోపాయం! మహిళల ముఖం ఎంత అందంగా ఉన్నా కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఉండటం వల్ల చెప్పలేనంత చిరాకు, విసుగు మాత్రమే కాకుండా ముఖారవిందాన్ని మొత్తం పాడు చేస్తుంటాయి. ఈ నల్లని వలయాలు పోగొట్టుకోవాలని మహిళలు చేసే ప్రయత్నాల గురించి ఎంత చెప్పినా తక్కువే… అయితే చేసే పని ఏదైనా దానికి తగినట్టు చేస్తున్నామా లేదా అనేది ఎంతో ముఖ్యం. సమస్య ఏమిటో తెలియకుండా వైద్యుడు మందు ఇవ్వడు అన్నట్టు.. సమస్యకు కారణం తెలియకుండా కనిపించిన చిట్కా పాటించడం కూడా తప్పే… కళ్ళ చుట్టూ వచ్చే నల్లని వలయాలకు కారణం ఏమిటి?? ఎందుకొస్తున్నాయి ఈ నల్లని వలయాలు.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి ముందు. కళ్ళచుట్టూ నల్లని వలయాలకు కారణాలు:- కళ్ళు, ముక్కు, పెదవులు ఈ అవయవాల చుట్టూ ఉండే చర్మం సహజంగానే సున్నితంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కళ్ళ కింద చర్మం ఎక్కువ సున్నితంగా ఉంటుంది. ఈ అవయవాల చుట్టూ ఉన్న ప్రాంతాలలో సబ్ క్యుటేనియస్ ఫ్యాట్ అనే పదార్థం ఉంటుంది. విపరీతంగా అలసట కలిగించే పనులు చేసేవారికి, పోషకాహార లోపంతో బాధపడేవారికి, రక్తహీనత కలవారికి, కళ్ళు, ముక్కు, పెదవుల ప్రాంతంలో ఉండే ఈ పదార్థం తగ్గిపోయి అక్కడి చర్మం కాస్త లోపలికి పోతుంది. అయితే… కళ్ళ చుట్టూ ఉండే చర్మం మరింత సున్నితం కాబట్టి అక్కడి చర్మం చాలా తొందరగా ప్రభావానికి గురవుతుంది. ఫలితంగా కళ్ళచుట్టూ చర్మం నల్లబడుతుంది. ఇదే నల్లని వలయాలుగా మారుతుంది. ఈ కారణం తెలుసుకోకుండా పై పూతగా చర్మానికి చెప్పలేనని క్రీమ్ లు ఉపయోగిస్తారు మహిళలు. కానీ దీనికి పాటించాల్సిన పద్ధతులు వేరుగా ఉంటాయి… దీనికోసం రెండు రకాల పద్ధతులు పాటించాలి.. ఒకటి లైఫ్ స్టైల్.. రెండు.. నాచురల్ టిప్స్.. లైఫ్ స్టైల్… లైఫ్ స్టైల్ అంటే తీసుకునే ఆహారం, అలవాట్లు మొదలైనవాటిలో మార్పు చేర్పులు చేసుకోవడం. తీసుకునే ఆహారంలో విటమిన్ ఎ,బి,సి పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అలసట కలిగినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. అంతేకానీ అలసట కలుగుతున్నా అలాగే పని చేయకూడదు. సమయానికి ఆహారం తీసుకోవాలి. అలాగే సమయానికి నిద్ర కూడా ఎంతో అవసరం. రోజులో తగినంత నిద్ర లేకపోతే కళ్ళు అలసిపోతాయి. మరీ ముఖ్యంగా సిస్టం ల ముందు పనిచేసేవారు స్క్రీన్ లైటింగ్ వల్ల కళ్ళ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. కళ్ళను చల్లని నీటితో అప్పుడప్పుడు కడగాలి. చేతులను రుద్దుకుని అందులో పుట్టే వేడిని సున్నితంగా కళ్ళకు తగిలేలా తుడవాలి. వీలైనంత ఎక్కువగా స్క్రీన్ నుండి దృష్టిని మళ్లించాలి. శరీరానికి తగినంత వ్యాయామం ఉంటే శరీరం అలసిపోవడం వల్ల నిద్ర కూడా బాగా వస్తుంది. కాబట్టి వ్యాయామం చేయాలి. చిట్కాలు.. టీ డికాక్షన్ లో కాటన్ ముంచి తరువాత కాస్త పిండేసే తడిగా ఉన్న ఆ కాటన్ ను కళ్ళ మీద ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ లో సగం స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు కళ్ళచుట్టూ రాసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే టమాటా రసం కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా తీసుకోవాలి. ఇవి రెండూ సమానంగా తీసుకుని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలిమ్ ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ ఇ ఆయిల్ ను కళ్ళ కింద రాస్తున్నా మంచి ఫలితం ఉంటుంది. పై రెండు విధానాలు పాటిస్తే తొందరలోనే కళ్ళచుట్టూ నల్లని వలయాలు మాయమైపోతాయ్.. ◆నిశ్శబ్ద.
గ్లోయింగ్ స్కిన్ కావాలా? ఈ జ్యూస్ ఇంట్లోనే చేసుకుని తాగితే చాలు..! గ్లోయింగ్ స్కిన్ ప్రతి అమ్మాయి కల. ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటే చాలా మంది అమ్మాయిల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది కూడా. అయితే ఈ కాలంలో అది అంత ఈజీ కాదు. ఆహారం, జీవనశైలి, ఉద్యోగాలు, చదువులు, కుటుంబ సంబంధాలు.. ఇలా ఒకటా రెండా ఆరోగ్యం దెబ్బతీసే కారణాలు ఎన్నో ఉంటాయి. పైకి ఎలాంటి సమస్య లేదు అన్నట్టు అనిపించినా మనిషిలో ఉండే ఒత్తిడి, అసహనం, చిరాకు, అసౌకర్యం వంటివన్నీ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చర్మాన్ని వాడిపోయినట్టు కళావిహీనంగా మారుస్తుంది. అయితే ఇంట్లోనే ఒక్క జ్యూస్ తయారుచేసుకుని తాగడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. అదేంటో తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన రీతిలో గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే దోసకాయ, పైనాపిల్ జ్యూస్ చక్కగా సహాయపడుతుంది. దోసకాయ చర్మ సంరక్షణకు చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మానికి మెరుపును ఇస్తుంది. ఇందులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలో మంటలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. దోసకాయ.. పైనాపిల్ జ్యూస్.. కావలసిన పదార్థాలు.. దోసకాయ.. పైనాపిల్.. పుదీనా.. నిమ్మరసం.. తయారీవిధానం.. దోసకాయ, పైనాపిల్, పుదీనా ఆకులు మిక్సీ జార్ లో వేసి బాగా మిక్సీ పట్టాలి. దీన్ని ఒక గ్లాసులో పోసి అందులో నిమ్మరసం కలపాలి. దీన్ని నేరుగా తాగితే మంచిది. మరింత ఆహ్లాదం కావాలి అంటే కాస్త ఐస్ క్యూబ్స్ కలుపుకోవచ్చు. రుచికోసం తేనె జోడించుకోవచ్చు. *రూపశ్రీ.
జుట్టు బాగా రాలిపోతోందా...ఈ నాలుగు వాడితే సెట్! నేటి కాలంలో చాలామంది జీవనశైలి దారుణంగా తయారైంది. బయటి ఆహారం, పానీయాల కారణంగా శరీరంలో ప్రతి భాగం ఊహించని ప్రతికూలతలు ఎదుర్కొంటుంది. ఇలా ప్రతికూలతలు కలిగే వాటిలో జుట్టు మరీ ముఖ్యమైంది. జుట్టు తెల్లబడటం, రంగు మారటం, చిన్నవయసులోనే బట్టతల, జుట్టు సామర్థ్యం తగ్గడం, పలుచగా మారడం ఇలా చాలా విధాలుగా జుట్టు దెబ్బతింటుంది. ఇక జుట్టు రాలడం, తలలో చుండ్రు వంటి సమస్యల గురించి చెప్పక్కర్లేదు. జుట్టు ఎక్కువగా రాలడం వల్ల బట్టతల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఆడవారిలో కూడా కనిపించడం చాలా విచారించాల్సిన విషయం. దీని కోసం ప్రజలు అనేక రకాల హెయిర్ ట్రీట్మెంట్ లు తీసుకుంటారు. కానీ ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సరైన ప్రభావం కనిపించడం లేదు. అయితే శరీరం అంతర్గతంగా పోషకాలను పొందినప్పుడు మాత్రమే జుట్టు బలంగా ఉంటుంది. శరీరానికి ఏయే పదార్థాలు లభిస్తే జుట్టు బలంగా ఉంటుంది. వేటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకుంటే వాటిని ఫాలో అవ్వడం వల్ల ఆరోగ్యవంతమైన, ధృడమైన జుట్టును పొందవచ్చు. అవేంటంటే.. క్యారెట్ విటమిన్ ఎ క్యారెట్లో పుష్కలంగా ఉంటుంది. క్యారెట్లను బాగా ఉపయోగించడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. ఇది తలలో సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల జుట్టు హైడ్రేటెడ్ గా, ఆరోగ్యంగా మారుతుంది. క్యారెట్ తినడం వల్ల రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. గుడ్లు గుడ్డులో ఉండే ప్రొటీన్లు జుట్టును లోపలి నుండి దృఢంగా మార్చుతాయి. గుడ్లలో కూడా బయోటిన్ ఉంటుంది, ఇది జుట్టుకు చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడానికి ప్రయత్నించండి. సిట్రస్ పండ్లు సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. మీ జుట్టు రాలుతున్నట్లయితే, విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అవకాడో అవకాడోలో పొటాషియం, బి విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి. అంతేకాదు జుట్టును మందంగా చేస్తాయి.కాబట్టి ఆహారంలో అవోకాడోను చేర్చడానికి ప్రయత్నించండి. *నిశ్శబ్ద
ముఖం మీద నల్ల మచ్చలు తగ్గించే ఫేస్ ప్యాక్ లు..! మచ్చలేని ముఖ సౌందర్యం కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఇది చాలామందికి సాధ్యం కాదు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, హార్మోన్ల సమస్యలు అన్నీ కలిసి అమ్మాయిల ముఖం మీద మచ్చలు ఏర్పరుస్తాయి. వీటిని తొలగించుకోవడానికి చాలామంది వివిధ రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. అయితే ముఖం మీద మచ్చలు తొలగించడంలో కొన్ని ఫేస్ ప్యాక్ లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని ఇంటి పట్టునే ట్రై చేయవచ్చు కూడా.. ముఖం మీద నల్ల మచ్చలు పోగొట్టే ఆ ఫేస్ ప్యాక్ లు ఏంటో తెలుసుకుంటే.. శనగపిండి ఫేస్ ప్యాక్.. చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంలో చర్మంలోని మృతకణాలను తొలగించడంలో, ముఖాన్ని అందంగా మార్చడంలో శనగపిండి మంచి ప్రభావం చూపుతుంది. దీనికోసం 2 చెంచాల శనగపిండి, ఒక చెంచా మిల్క్ క్రీమ్, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయవచ్చు. పసుపు, పెరుగు.. మచ్చలను తగ్గించుకోవడానికి పసుపు, పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. దీనికోసం 2 చెంచాల సాదా పెరుగు తీసుకుని అందులో ఒక చెంచా పసుపు కలపాలి. ఈ ప్యాక్ని ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. చర్మంపై మెరుపు ఉంటుంది. పెరుగులోని లాక్టిక్ ఆమ్లాలు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. పసుపులోని లక్షణాలు మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. కలబంద, పసుపు.. కలబంద, పసుపు ఫేస్ ప్యాక్ ప్రభావం ముఖంపై బాగా కనిపిస్తుంది. ఒక టీస్పూన్ అలోవెరా జెల్లో అర టీస్పూన్ పసుపు కలపాలి. ఈ ఫేస్ ప్యాక్ను ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. అలోవెరా చర్మానికి హైడ్రేటింగ్ ను అందిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. తేనె నిమ్మరసం.. 2 చెంచాల తేనె, ఒక చెంచా తాజా నిమ్మరసం రెండూ కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. మచ్చలను తగ్గించుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ను వారానికి రెండుసార్లు అప్లై చేయవచ్చు. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, నిమ్మకాయలోని ఆస్ట్రింజెంట్ గుణాలు మొటిమల వల్ల వచ్చే మచ్చలను కూడా తగ్గిస్తాయి. ముల్తానీ మట్టి, రోజ్ వాటర్.. మచ్చలను తగ్గించడానికి 2 టీస్పూన్ల ముల్తానీ మట్టిని తగినంత రోజ్ వాటర్తో కలిపి పేస్ట్లా చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ఆరిపోయే వరకు ముఖంపై ఉంచి తర్వాత కడిగేయాలి. ముల్తానీ మట్టి ముఖంలోని అదనపు ఆయిల్ ను, మలినాలను తొలగించి చర్మానికి మెరుపును తెస్తుంది. *రూపశ్రీ.
బొప్పాయి పండు మాత్రమే కాదండోయ్.. దాని తొక్కలు, విత్తనాలు కూడా అద్భుతం చేస్తాయ్..! బొప్పాయి ఆరోగ్యకరమైన పండు. ఎర్రగా పండిన బొప్పాయి రుచిని మాటల్లో చెప్పలేం. అయితే అందరూ బొప్పాయి పండు తిని తొక్క, విత్తనాలు పడేస్తుంటారు. కానీ బొప్పాయి పండు మాత్రమే కాకుండా తొక్క, విత్తనాలు కూడా బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి. అవేంటో తెలుసుకుంటే ఇక మీదట బొప్పాయి తొక్కలు, విత్తనాలు పడేయకుండా ఉపయోగించుకోవచ్చు. బొప్పాయి తొక్కల ప్రయోజనాలు.. బొప్పాయి తొక్కలను మెత్తగా గ్రైండ్ చేసి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలపాలి. దీన్ని ఫేస్ ప్యాక్గా ఉపయోగించవచ్చు. ఆరిన తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. బొప్పాయి ఫేస్ ప్యాక్ని కొన్ని రోజులు క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది. బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ అవాంఛిత రోమాలు పెరగడాన్ని తగ్గిస్తుంది. ముఖంపై వెంట్రుకలను వదిలించుకోవాలనుకుంటే బొప్పాయి తొక్కను ఉపయోగించవచ్చు. బొప్పాయి తొక్కలో ఉండే ఎంజైమ్లు మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది చర్మానికి తాజాదనాన్ని కలిగిస్తుంది. ఈ పీల్స్ను స్క్రబ్గా వాడచ్చు, ఆ తరువాత ముఖాన్ని కడగాలి. బొప్పాయి తొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమలు ఉన్న ప్రదేశంలో బొప్పాయి తొక్కను రుద్ది 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. బొప్పాయి తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్లు చర్మం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. తద్వారా ముడతలు తగ్గుతాయి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. బొప్పాయి గింజల ప్రయోజనాలు.. బొప్పాయి గింజలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుంటే నేచురల్ స్క్రబ్ లా పనిచేస్తుంది. దీంతో చర్మంలోని మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది. బొప్పాయి గింజల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని లోతుగా తేమగా ఉంచి మృదువుగా ఉంచుతాయి. సీడ్ పేస్ట్ను చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడగాలి. బొప్పాయి గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంలో మంటను తగ్గించి చర్మాన్ని కూల్ గా ఉంచుతాయి. బొప్పాయి గింజల పేస్ట్ ను మంట ఉన్న ప్రాంతాలలో పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. *రూపశ్రీ.
కళ్ల కింద నల్లని వలయాలు ఉన్నాయా? ఇలా ఈజీగా వదించుకోవచ్చు..! కళ్ల కింద నల్లని వలయాలు చాలామందిని ఇబ్బందికి గురిచేస్తాయి. ఈ నల్లని వలయాలు అమ్మాయిలను వయసు పైనబడినట్టు చూపెడతాయి. అంతేనా ముఖం ఎంత బాగున్నా, ఎంత అందంగా ఉన్నవారు అయినా నల్లని వలయాల కారణంగా వికారంగా కనిపిస్తుంటారు. ఈ నల్లని వలయాలు వదిలించుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే బ్యూటీ క్రీమ్ లు వాడుతుంటారు. కానీ వీటి వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇంట్లోనే ఈజీగా నల్లని వలయాలు ఎలా వదిలించుకోవచ్చు. అదెలాగంటే.. దోసకాయ ముక్కలు.. దోసకాయలు చల్లదనాన్ని ఇవ్వడంలోనూ, చర్మాన్ని కాంతివంతం చేయడంలోనూ దోహదపడే లక్షణాలు కలిగి ఉంటాయి. తాజా దోసకాయను మందపాటి ముక్కలుగా చేసి, వాటిని 30 నిమిషాలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. చల్లబడిన దోసకాయ ముక్కలను మూసిన కళ్లపై ఉంచి 10-15 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. సరైన ఫలితాల కోసం దీన్ని రోజుకు రెండుసార్లు చేయాలి. టీ బ్యాగ్స్.. గ్రీన్ లేదా బ్లాక్ టీ బ్యాగ్లలో ముఖ్యంగా కెఫీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, డార్క్ సర్కిల్లను తగ్గించడంలో సహాయపడతాయి. రెండు టీ బ్యాగ్లను వేడి నీటిలో కొన్ని నిమిషాలు ఉంచాలి. టీ బ్యాగ్లను తీసివేసి వాటిని 20 నిమిషాలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. చల్లబడిన టీ బ్యాగ్లను మూసిన కళ్లపై 15-20 నిమిషాలు ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీన్ని రోజూ ఫాలో అవుతుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. బంగాళదుంప .. బంగాళదుంపలలో సహజ బ్లీచింగ్ ఏజెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక పచ్చి బంగాళాదుంపను తురుమి రసం తీయాలి. బంగాళాదుంప రసంలో రెండు కాటన్ బాల్స్ను నానబెట్టి వాటిని మూసిన కళ్లపై ఉంచాలి. ఈ కాటన్ బాల్స్ ను 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా కాటన్ బాల్స్ ను ఉంచడమే కాకుండా వీటికి బదులుగా నేరుగా బంగాళాదుంప ముక్కలను కళ్ళపైన ఉంచవచ్చు. మెరుగైన ఫలితాల కోసం ప్రతిరోజూ ఈ రెమెడీని ప్రయత్నించాలి. ఆల్మండ్ ఆయిల్, తేనె.. బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అర టీస్పూన్ తేనెలో కొన్ని చుక్కల బాదం నూనె కలపాలి. పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాసి మృదువుగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మెరుగైన ఫలితాల కోసం దీన్ని రోజూ ప్రయత్నించాలి. టమోటో, నిమ్మరసం.. టొమాటోల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది డార్క్ పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది. నిమ్మరసం బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక టీస్పూన్ తాజా టమోటా రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్తో డార్క్ సర్కిల్స్ పై అప్లై చేయాలి. ఇది కళ్లలో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 నిమిషాలు దీన్ని అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మెరుగైన ఫలితాల కోసం రోజుకు రెండుసార్లు దీన్ని ఫాలో కావాలి. *రూపశ్రీ.
వెంట్రుకలకు రైస్ వాటర్ అప్లై చేస్తే నిజంగా జుట్టు పెరుగుతుందా? అసలు నిజాలేంటంటే..! జుట్టు పెరుగుదలకు సంబంధించి చాలా రకాల టిప్స్ వైరల్ అవుతుంటాయి. వాటిలో ఉల్లిపాయ జ్యూస్ నుండి హెయిర్ ప్యాక్ లు, హెయిర్ డైలు, హెన్నా ట్రిక్స్ తో పాటూ జుట్టుకు బియ్యం నీరు ఉపయోగించడం వరకు చాలా ఉన్నాయి. అయితే జుట్టుకు రైస్ వాటర్ అప్లై చేయడం అనేది ఎప్పటినుంచో ఉన్నదేనని చాలా మంది అంటారు. జుట్టుకు రైస్ వాటర్ అప్లై చేస్తే జుట్టు బాగా ఒత్తుగా నల్లగా పెరుగుతుందని, జుట్టు పట్టు కుచ్చులా మారుతుందని అంటుంటారు కూడా. అయితే జుట్టుకు రైస్ వాటర్ అప్లై చేస్తే నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? దీని వెనుక నిజమెంత తెలుసుకుంటే.. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రైస్ వాటర్ ఒక గొప్ప మార్గమని సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది. నిజానికి జుట్టు పెరుగుదలకు ఈ సాధారణ పద్ధతి అంత ఉపయోగపడదు. జుట్టు బాగా పెరగాలంటే వారానికి ఒకసారి జుట్టుకు నూనె రాయాలి. దీని తరువాత జుట్టు పెరుగుదలను, దెబ్బతిన్న జుట్టును సరిచేయడానికి రైస్ వాటర్ రెసిపీని ఫాలో కావచ్చు. బియ్యం నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే వేసవిలో వెంట్రుకలకు రైస్ వాటర్ అప్లై చేసే సరైన విధానాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రైస్ వాటర్ ఎలా చేయాలి.. ముందుగా బియ్యాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. నీరు క్లీన్ గా కనిపించేవరకు బాగా కడగాలి. ఆ తర్వాత ఒక పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో కడిగిన బియ్యాన్ని వేసి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. దీని తరువాత నీటిని ఫిల్టర్ చేసి ఒక పాత్రలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని గాజు పాత్రలో నింపి 12 నుండి 24 గంటలపాటు మూసి క్లోజ్ చేసి ఉంచాలి. దీన్ని 1 వారం రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయవచ్చు. ఎలా అప్లై చేయాలంటే.. హెయిర్ వాష్ తర్వాత బియ్యం నీటిని కండీషనర్గా ఉపయోగించవచ్చు. ఇది కాకుండా దీన్ని హెయిర్ మాస్క్గా కూడా అప్లై చేయవచ్చు. అయితే ఇక్కడ చెయ్యవలసిన ముఖ్యమైన పని ఏంటంటే బియ్యం నీటిలో కొన్ని చుక్కల కలబంద, ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి హెయిర్ మాస్క్గా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత జుట్టు కడుక్కోవాలి. *నిశ్శబ్ద.
ఎర్ర చందనం ముఖానికి చేసే మేలు తెలుసా? ఎర్ర చందనం.. భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరిగే ఈ వృక్షాలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. పుష్ప సినిమా వల్ల ఎర్ర చందనం గురించి తెలియని వారికి కూడా చాలా స్పష్టంగా దీని గురించి తెలిసొచ్చింది. అయితే దీనికి మార్కెట్లో ఉన్న విలువ, మార్కెటింగ్ రాజకీయల గురించి పక్కన పెడితే ఎర్ర చందనం ఆరోగ్యపరంగానూ, సౌందర్య పరిరక్షణలోనూ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎర్ర చందనం వాడటం వల్ల చర్మానికి కలిగే లాభాలేంటంటే.. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.. ఎర్రచందనం చర్మానికి మెరుపును ఇస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన ఛాయ చేకూర్చడంలో సహాయపడుతుంది. ఎర్రచందనాన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే వాడిపోయిన చర్మానికి పునరుజ్డీవాన్ని ఇస్తుంది. చర్మం సహజ కాంతితో మెరిసిపోయేలా చేస్తుంది. మొటిమలు తగ్గిస్తుంది.. మొటిమలు చాలా మందికి చాలా చిరాకు తెప్పిస్తాయి. అయితే ఎర్ర చందనంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మంటను , ఎరుపును తగ్గించడానికి.. మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. మొటిమల బారినపడే చర్మాన్ని సమర్థవంతంగా ట్రీట్ చేస్తుంది. మచ్చలు తగ్గిస్తుంది.. మొటిమల మచ్చలు, మచ్చలు, చర్మం మీద నలుపు, ఎరుపు రంగు గుర్తులు ఉంటే ఎర్ర చందనం వాటిని క్రమక్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలు ఇందులో ఉంటాయి. ఇవి చర్మపు రంగును సమం చేయడంలో సహాయపడతాయి. మచ్చల పరిమాణాన్ని కూడా తగ్గిస్తాయి, కాలక్రమేణా మృదువైన, మచ్చలేని చర్మం సొంతమవుతుంది. జిడ్డు అరికడుతుంది.. చర్మంలో చాలా రకాలుంటాయి. వీటిలో జిడ్డు చర్మం కూడా ఒకటి. అధిక జిడ్డు రంద్రాలు మూసుకుపోయి పగుళ్లకు దారి తీస్తుంది. ఎర్రచందనం సహజ రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది, సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చర్మం సహజమైన తేమను తొలగించకుండా జిడ్డును నియంత్రిస్తుంది. చర్మ సంరక్షణ దినచర్యలో ఎర్రచందనం కలపడం వల్ల చర్మం సమతుల్యంగా, రిఫ్రెష్గా ఉంటుంది. యాంటీ ఏజింగ్.. సన్నని గీతలు, ముడతలు, చర్మం వాడిపోవడం వంటి వృద్ధాప్య సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ఎర్ర చందనం వాటిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ను తటస్తం చేయడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఎర్ర చందనాన్ని క్రమం తప్పకుండా ముఖానికి రాసుకుంటూ ఉండే ముడతలు వచ్చే ప్రక్రియ నెమ్మదిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. *రూపశ్రీ.
జుట్టును స్మూత్ గా మార్చే అలోవెరా సీరమ్.. ఇలా తయారుచేసేయండి..! కలబంద ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఉంటుంది. మొక్కలు పెంచుకోవడానికి స్థలం లేనివారు చిన్న కుండీలలో అయినా సరే అలోవెరా మొక్కను పెంచుతూ ఉంటారు. చాలామంది దీన్ని పెంచడమే తప్ప దేనికి ఉపయోగించరు. కానీ అమ్మాయిలు మాత్రం బ్యూటీ చిట్కాలలో కలబందను విరివిగా వాడేస్తుంటారు. ముఖ సౌందర్య చిట్కాలలోనూ, జుట్టు సంరక్షణలోనూ కలబందను చాలా ఎక్కువగా వాడుతారు. జుట్టు స్మూత్ గా సిల్కీగా ఉండాలంటే అలోవెరాను వాడటం మంచిది. అలోవెరాలో కేవలం మూడు పదార్థాలు కలిపితే చాలు ఇంట్లోనే అలోవెరా సీరమ్ తయారైపోతుంది. దీనికోసం ఏం కావాలో.. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. తాజా అలోవెరా జెల్.. 1 స్పూన్.. రోజ్ వాటర్.. 2 స్పూన్లు.. బాదం నూనె.. 1 టీస్పూన్.. టీ ట్రీ ఆయిల్.. 4-5 చుక్కలు పై పదార్థాలను అన్నింటిని ఒక కంటైనర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది మరీ జిడ్డుగా, చిక్కగా ఉండకూడదు. అలా అనిపిస్తే మరికాస్త రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఈ సీరమ్ ను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు జుట్టు మూలాలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే సాధారణ నీటితో జుట్టును కడిగేయాలి. ఈ సీరమ్ ను కొన్ని రోజులపాటూ వాడుతుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలోవెరా సీరమ్ ప్రయోజనాలేంటంటే.. అలోవెరా జెల్ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. తల చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది. ఈ సీరమ్ ను అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. చీలిపోయిన జుట్టు చివర్లను రిపేర్ చేస్తుంది. ఇందులో రసాయనాలు ఏమీ ఉండవు కాబట్టి జుట్టుకు ఎలాంటి హాని కలిగించదు. పైపెచ్చు జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరగడంలో కూడా సహాయపడుతుంది. *రూపశ్రీ.
పొడవాటి కనురెప్పల కోసం అల్టిమేట్ ట్రిక్స్ ! అందమైన కళ్ళు ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. కళ్ల అందం కోసం, వెంట్రుకలు నల్లగా, మందంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే చాలా మంది తమ వెంట్రుకలు నల్లగా, మందంగా చేయడానికి ఆర్టిఫిషయల్ ఐస్లాష్ వాడుతుంటారు. అయితే సహజసిద్ధంగా కూడా కనురెప్పలను అందంగా మార్చుకోవచ్చు. వెంట్రుకలను మందంగా, నల్లగా మార్చే సహజ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ హోం రెమెడీస్ తో మీరు వెంట్రుకలను ఆకర్షణీయంగా, అందంగా మార్చుకోవచ్చు. పెట్రోలియం జెల్లీ: కనురెప్పలు నల్లగా, మందంగా ఉండాలంటే పెట్రోలియం జెల్లీని కనురెప్పలపై రాయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పొడవుగా, మందంగా, ఆకర్షణీయంగా, అందంగా తయారవుతాయి. గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కనురెప్పల వెంట్రుకలను పొడవుగా చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీ తాగడం, కనురెప్పల మీద అప్లై చేయడం వల్ల కూడా కనురెప్పలు అందంగా తయారవుతాయి. విటమిన్ ఇ: విటమిన్ ఇ కనురెప్పల జుట్టు పెరుగుదలకు చాలా మేలు చేస్తుంది. మీరు మార్కెట్లో విటమిన్ ఇ క్యాప్సూల్స్ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీనితో మీరు వెంట్రుకలపై జుట్టు రాలడం సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్లో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు కనురెప్పల పెరుగుదలకు సహాయపడతాయి. దీన్ని కనురెప్పలపై అప్లై చేయడం వల్ల వెంట్రుకలు త్వరగా మందంగా, పొడవుగా మారుతాయి. కొబ్బరి నూనె: కొబ్బరి నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. కొబ్బరి నూనె కనురెప్పలకు కూడా మేలు చేస్తుంది.
మీ అందాన్ని సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు! అందమైన, మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది. స్పాట్ లెస్ బ్యూటీ సొంతం చేసుకోవడానికి.. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్లు, ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ క్రీమ్లు, ఫేస్ ప్యాక్లు వాళ్ల చర్మతత్వానికి సరిపోతాయో? లేదో అన్న విషయం గురించి కూడా ఆలోచించరు. ఇలా ఏదిపడితే అది బ్యూటీ కేర్లో యాడ్ చేసుకుంటే.. చర్మ సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉంది. మీరు మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 1. మీ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించడానికి.. రోజూ బయటకు వెళ్లే ముందు సన్స్క్రీన్ అప్లై చేసుకోవడం తప్పనిసరి. సన్స్క్రీన్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది . మీ చర్మాతత్వానికి సరిపోయే సన్ స్క్రీన్ ని సరైన స్కిన్ కేర్ నిపుణులను అడిగి తెలుసుకుని మరి వాడండి .. ఏవి పడితే అవి వాడకూడదు .. దాని వల్ల మీ స్కిన్ డామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎండలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తే తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకోసారి సన్స్క్రీన్ రాసుకుంటూ ఉండాలి . 2. స్క్రబింగ్ వల్ల చర్మంపై పేరుకున్న మురికి, డెడ్ సెల్స్, టాక్సిన్స్ తొలగుతాయి. స్క్రబ్ ద్వారా చర్మంపై పేరుకొన్న మృతకణాలతో పాటు, దుమ్ము, ధూళి కూడా సులభంగా తొలగిపోతాయి. స్క్రబ్ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మగ్రంథులు తెరుచుకుని శుభ్రపడతాయి. అందుకే వారానికి రెండు మూడు సార్లు స్క్రబ్ చేసుకుంటే.. చర్మం తాజా మారుతుంది. మొటిమలు ఎక్కువగా ఉంటే.. స్క్రబ్ చేయవద్దు. 3. నిద్ర లేవగానే, నిద్రపోయే ముందు ముఖం శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి. నిద్రపోయేటప్పుడు మన ముఖంపై పేరుకునే బ్యాక్టీరియాను తొలగించాలంటే ముఖాన్ని బాగా కడుక్కోవాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు మేకప్ని పూర్తిగా తొలగించి శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. 4. కొంతమంది ముఖం శుభ్రం చేసుకునేప్పుడు, రఫ్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. గోళ్లతో గీరుకోవడం, ముఖాన్ని గట్టిగా రుద్దుకోవడం వల్ల.. చర్మ కణాలు దెబ్బతింటాయి. ఇలా చేయడం వల్ల మీ అందం దెబ్బ తింటుంది. మీ చర్మాన్ని సున్నితంగా ట్రీట్ చేయాలి. గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. 5. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. మీ డైట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, విటమిన్ ఈ, ఏ, సీ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. బాదం, వాల్నట్స్లో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది. 6. ఒత్తిడి, ఆందోళనలు అందంపై ప్రభావం చూపుతాయి. టెన్షన్ పడినప్పుడు మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా జరిగే శారీరక మార్పుల వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్ట్రెస్ కారణంగా.. పిగ్మెంటేషన్, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు దరిచేరడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి. ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో సమయం గడపండి.
ఫేషియల్ తరువాత ఈ తప్పులు అస్సలు చేయొద్దు! అమ్మాయిలు ఆరోగ్యం కంటే కూడా చర్మసంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే అందం ఎప్పుడూ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వేసవి కాలంలో ఆరోగ్యంతో పాటు చర్మంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో శరీరంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు చాలా వస్తాయి. మరీ ముఖ్యంగా ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం. సూర్యరశ్మి కారణంగా చర్మం కమిలిపోవడం, రంగు మారడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో, మహిళలు తమ ముఖానికి ఫేషియల్ చేయించుకుంటారు. ఫేషియల్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మురికి తొలగి, ముఖచర్మం శుభ్రపడుతుంది. చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. కానీ వందలాది రూపాయలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకున్నా, ఇంట్లో సొంతంగానే పేషియల్ చేసుకున్నా.. ఫేషియల్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న వయసులోనే ముసలితనం మొదలవుతుందని మీకు తెలుసా? చాలా మంది బ్యూటీ ఎక్స్పర్ట్స్ కూడా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ఫేషియల్ చేయించుకున్న తర్వాత కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి పాటించకపోతే.. ఫేషియల్స్ అందాన్ని ఇవ్వడానికి బదులుగా హాని కలిగిస్తాయి. ఫేషియల్ తరువాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే.. మేకప్కు దూరంగా ఉండాలి.. ఫేషియల్ చేసినప్పుడు ముఖ చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాంటి సమయంలో వెంటనే మేకప్ చేస్తే, అది చర్మ సమస్యలను కలిగిస్తుంది.మేకప్ తాలూకూ రసాయనాలు చర్మరంధ్రాల్లోకి చొచ్చుకెళ్లి చర్మానికి నష్టం చేకూరుస్తుంది. సూర్యరశ్మికి గురికాకూడదు.. ఫేషియల్ చేసిన వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. పార్లర్ నుంచి ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎండలో, దుమ్ములో బయటికి వెళితే దుమ్ము, ధూళి, గాలిలో ఉండే వాహనాల పొగ, సూర్యకిరణాల ప్రభావం అన్నీ కలిపి చర్మాన్ని తొందరగా పాడుచేస్తాయి. బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయించుకున్న తరువాత స్కూటీ ప్రయాణం మానుకోవాలి, ఆటోలో వెళ్లడం మంచిది. స్యూటీలో వెళ్ళాలి అంటే ముఖానికి స్కార్ఫ్ వాడటం మరచిపోకూడదు. ఫేస్వాష్తో అస్సలు చేయొద్దు.. ఫేషియల్ చేయించుకున్న తరువాత రోజు మొత్తం ఫేస్వాష్ని ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం. పొరపాటున ఫేస్ వాష్ ఉపయోగిస్తే ఫేషియల్ ద్వారా చర్మానికి అందిన మృదుత్వం పోతుంది. ఫలితంగా ఫేస్ వాష్ లో రసాయనాల వల్ల చర్మరంధ్రాలు దెబ్బతిని ఓపెన్ పోర్స్ సమస్యకు దారితీస్తుంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. ఫేషియల్ తర్వాత చర్మ సంరక్షణ ఉత్పత్తులను దూరంగా ఉంచాలి . ఫేషియల్ ముఖచర్మం లోపలివరకు ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిలో చర్మసంరక్షణ ఉత్పత్తులు వాడితే అందులో ఉన్న రసాయనాల వల్ల చర్మం మరింత సున్నితమైపోయి దారుణంగా దెబ్బతింటుంది. అందుకే ఫేషియల్ తర్వాత స్క్రబ్ చేయడం, ఇతర ఉత్పత్తులు వాడటం చేయకూడదు. ◆నిశ్శబ్ద.
ముఖం పొడిబారి వాడిపోయినట్టుందా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే! వాతావరణం మారేకొద్ది శరీరం కూడా మార్పులకు లోనవుతుంది. వర్షాల వల్ల వాతావరణం చలిగానూ, చిరాగ్గానూ మారుతుంది. ఈ వాతరణం దాటికి నీరు తక్కువగా తాగుతుంటారు. ఇక ముఖ చర్మం కూడా చాలావరకు పగులుతుంది, మరికొందరికి శరీరంలో నీటిశాతం తక్కువ ఉండటం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది తొందరగా దురదలు, దద్దుర్లు, గాయాలకు దారితీస్తుంది. దీనికి విరుగుడుగా వీలైనంత వరకు నీటిని సమృద్దిగా తాగాలి. దీంతోపాటు తేమ కోల్పోయిన చర్మాన్ని, పగిలిన చర్మాన్ని తిరిగి రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మాయిశ్చరైజర్ లు, లోషనల్ లు అక్కర్లేదు. పొడిబారిన, పగిలిన ముఖ చర్మాన్ని పైసా ఖర్చు లేకుండా మన ఆహారంలో భాగమైన ఒక పదార్థాన్ని ఉపయోగించడం వల్ల చక్కదిద్దుకోవచ్చు. ఇంతకూ అందరికీ అందుబాటులో ఉండే ఆ పదార్థం ఏంటి?? దాన్ని ఎలా ఉపయోగించాలి? తెలుసుకుంటే… ప్రతి ఇంటి వంటిట్లో తప్పనిసరిగా ఉండేది పెరుగు. పెరుగు కేవలం కడుపుకు చల్లదనాన్ని ఇవ్వటమే కాదు.. పొడిబారిన ముఖచర్మాన్ని రిపేర్ చేస్తుంది. చర్మాన్ని మృదువుగా తేమగా మారుస్తుంది. ఇందుకోసం పెరుగును ఎలా ఉపయోగించుకోవాలంటే.. పెరుగు, శనగపిండి.. చలికాలంలో చాలామంది సోప్ వాడటం మానేసి శనగపిండి ఉపయోగిస్తారు. అయితే ఈ శనగపిండి, పెరుగు రెండు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖానికి మెరుపును ఇవ్వటమే కాకుండా ముఖ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. పెరుగు, శనగపిండి రెండు మిక్స్ చేసి పేస్ట్ చేసుకుని ముఖానికి పట్టించాలి. దీన్ని 15నిమిషాలు ఉంచి తరువాత కడిగేయాలి. పెరుగు, బియ్యం పిండి.. ఇది మంచి ఫేస్ ప్యాక్ కమ్ స్క్రబ్. పెరుగు, బియ్యం పిండి కలిపి మిక్స్ చేసి దీన్ని ముఖానికి పట్టించాలి. ఇది ప్యాక్. ఈ ప్యాక్ ఆరిన తరువాత దీన్ని స్క్రబ్ లాగా రుద్దుతూ తొలగించాలి పెరుగు, తులసి.. 7 నుండి 10 తులసి ఆకులను గ్రైండ్ చేసి దానికి పెరుగు కలపాలి. మందపాటి పేస్ట్లా చేసి, ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు మొటిమలు మరియు మచ్చలను తొలగిస్తాయి. ముఖాన్ని మృదువుగా చేస్తాయి. పెరుగు పసుపు పెరుగు, పసుపు రెండూ చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. ఈ ప్యాక్ ఉపయోగించడం వల్ల l ట్యానింగ్ తగ్గుతుంది. పెరుగు తేనె.. తేనెను ఉపయోగించడం ద్వారా, ముఖంపై తేమ లోపాన్ని తొలగించవచ్చు. ప్యాక్ చేయడానికి, రెండు పదార్థాలను సమాన పరిమాణంలో తీసుకొని ముఖానికి 15 నిమిషాలు అప్లై చేయాలి. కొంత సమయం తరువాత దీని ఫలితం కనిపిస్తుంది. *నిశ్శబ్ద.
మచ్చలేని ముఖం కావాలా? ఇంట్లోనే ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు..! ప్రతి ఒక్కరూ శుభ్రమైన, మొటిమలు లేని చర్మాన్ని కోరుకుంటారు. కానీ బిజీ రొటీన్లో చర్మ సంరక్షణకు సమయం దొరకడం చాలా కష్టం. ఈరోజుల్లో చర్మసంరక్షణకు బోలెడు రకాల ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. వీటని చర్మంలో మెరుపు కనిపించాలని, చర్మం యవ్వనంగా కనిపించాలని వాడతారు. ఇవి వాడినప్పుడు నిజంగానే అనుకున్న ఫలితాలను కేవలం క్షణాలలో ఇస్తాయి. అయితే వీటని ముఖానికి పట్టింటి రిమోవ్ చేస్తే ఆ తరువాత ముఖం చాలా చండాలండా మారుతుంది. ముఖ చర్మం దారుణంగా మారుతుంది. డ్యామేజ్ అవుతుంది. అమ్మాయిలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, డేట్ నైట్లు మొదలైనవాటి కోసం చాలా అందంగా తయారవుతారు కూడా. అయితే అలాంటి సందర్భాలలో సహజంగానే అందంగా, మచ్చలేని చర్మంతో మెరిసిపోవాలంటే మాత్రం ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి. గంధం, గులాబీ రేకుల పేస్ట్.. గంధం, గులాబీ రేకుల పేస్ట్ శతాబ్దాలుగా చర్మ సంరక్షణకు ఉత్తమ ఎంపిక. ఇది సహజంగా మంచి సువానసను కలిగి ఉంటుంది. గంధం, గులాబీ రేకులతో తయారు చేసిన పేస్ట్ చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ముఖంలోని మురికిని శుభ్రపరచడమే కాకుండా మృతచర్మాన్ని కూడా తొలగిస్తుంది. కావలసినవి - 2 టేబుల్ స్పూన్లు గంధపు పొడి ఒక పిడికెడు ఎండు గులాబీ రేకులు 1 టేబుల్ స్పూన్ పెరుగు ఎలా చేయాలి ముందుగా ఎండిన గులాబీ రేకులను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గంధపు పొడికి గులాబీ రేకుల పొడి కలపాలి. దీన్ని పేస్ట్ చేయడానికి పెరుగును ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్ను చర్మంపై అప్లై చేసి 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడగాలి. దీని తర్వాత పొడి టవల్తో ముఖాన్ని తుడుచుకుని ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. కుంకుమ పువ్వు, పాలు.. సహజ పదార్థాలు ఎల్లప్పుడూ ముఖ సంరక్షణ కోసం చాలా మంచి ఎంపిక. కుంకుమపువ్వు అలాంటి సహజ పదార్ధాలలో ఒకటి. ఇది చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. కుంకుమపువ్వు కేవలం రంగు మాత్రమే కాదు.. యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇక పాలలోని పోషక గుణాలు చర్మాన్ని తేమగా మార్చడానికి పని చేస్తాయి. ఈ రెండూ కలిస్తే ముఖ చర్మానికి చక్కగా పనిచేస్తాయి. కావలసినవి: కుంకుమపువ్వు రేకలు 2 టేబుల్ స్పూన్ల పాలు 1టేబుల్ స్పూన్ శనగపిండి ఎలా చేయాలి.. కుంకుమపువ్వు రేకలను పాలలో కొన్ని నానబెట్టాలి. ఇప్పుడు శనగపిండిని అందులో వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. వేప తులసి పేస్ట్.. వేప, తులసితో చేసిన పేస్ట్ చర్మ కాంతిని పెంచడానికి సహాయపడుతుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మెరుపుతో కూడిన ఆరోగ్యకరమైన చర్మం సొంతం అవుతుంది. కావలసినవి.. ఒక పిడికెడు వేప ఆకులు ఒక పిడికెడు తాజా తులసి ఆకులు 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి ఎలా చేయాలి.. వేప, తులసి ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ముల్తానీ మట్టిని పేస్ట్లో కలపాలి. ఈ పేస్ట్ను చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో కడిగి, టవల్ తో తుడుచుకుని మైల్డ్ లోషన్ లేదా క్రీమ్ రాయాలి. గంధం, బాదం పేస్ట్.. గంధం, బాదంతో తయారుచేసుకున్నపేస్ట్ చర్మ కాంతిని పెంచడమే కాకుండా చర్మానికి చలువదనాన్ని ఇస్తుంది కావలసినవి.. 2 టేబుల్ స్పూన్ గంధపు పొడి 1 టేబుల్ స్పూన్ బాదం పొడి 1 టేబుల్ స్పూన్ తేనె కొన్ని చుక్కల పాలు ఎలా తయారు చేయాలి.. గంధం బాదం పేస్ట్ కోసం చందనం, బాదం పొడి ఒక గిన్నెలో వేయాలి. దీన్ని పేస్ట్ చేయడానికి తేనె, తగినంత పాలు జోడించాలి. దీన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత కడిగేయవచ్చు. ఇక్కడ పేర్కొన్న స్క్రబ్స్ చర్మానికి మెరుపు అందించడానికి, చర్మం మీద మురికి తొలగించడానికి సహజమైన చిట్కాలలా పనిచేస్తాయి. ఇవన్నీ సహజ పదార్ధాలతో తయారు చేయబడినప్పటికీ, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉండటం కోసం . వీటిని ఉపయోగించే ముందు చర్మంపై ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. *నిశ్శబ్ద.
ఎన్నేళ్లొచ్చినా యూత్ లాగా కనబడాలా? చియా గింజలను ఇలా వాడడండి..! వయసు పెరిగే కొద్దీ యవ్వనం తగ్గిపోవడం కామన్. కానీ ప్రజలు మాత్రం అందం మీద ఆశ, దానికోసం పడే ఆరాటం మాత్రం వదలరు. ఇందుకోసం వందలు, వేల రూపాయలను పోసి క్రీములు, థెరపీలు తీసుకోవడం నుండి ఇంటి చిట్కాలను పాటించడం వరకు ప్రతిదీ ఫాలో అవుతారు. అయితే వయసు పెరిగినా యూత్ లాగా కనబడాలంటే మాత్రం చియా గింజలు చక్కని ఆప్షన్. చియా గింజలను ఇలా ఉపయోగిస్తే యవ్వనంగా ఉండే చర్మం సొంతమవుతుంది. చియా గింజలు పోషకాలకు పవర్ హౌస్ అని చెప్పవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, కాల్షియం, మాంగనీస్ మొదలైనవి ఈ గింజల్లో ఉంటాయి. చియా సీడ్స్ను ముఖానికి సరిగ్గా వాడితే చర్మం మచ్చలు లేకుండా మెరుస్తూ ఉండటమే కాకుండా చర్మం యాంటీ ఏజింగ్ గుణాలను కూడా పొందుతుంది. చియా విత్తనాలు, తేనె ఫేస్ ప్యాక్.. చియా గింజలు, తేనె, పెరుగు సమకూర్చుకోవాలి. అన్నింటిలో మొదటిది, చియా విత్తనాలను నీటిలో కలపాలి. ఈ గింజలు ఉబ్బినప్పుడు, వాటిని విడిగా గిన్నెలో ఉంచాలి. ఈ గింజలకు తేనె, కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్ను సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ను ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత ముఖం కడుక్కోవాలి. చర్మం కాంతివంతంగా మారుతుంది. చియా గింజలు, కొబ్బరినూనె.. చియా గింజలు, కొబ్బరి నూనె కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు. ఇందు కోసం, రెండు పదార్థాలను కలపాలి. మందపాటి పేస్ట్ తయారుచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ స్క్రబ్ లా కూడా అప్లై చేసుకోవచ్చు. స్క్రబ్ చేయడానికి ముందుగా నీళ్లతో ముఖాన్ని తడిపి, తర్వాత ఈ పేస్ట్ను ముఖంపై సర్క్యులేషన్ మోషన్లో 2 నిమిషాల పాటు రుద్దాలి. తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోవడం ప్రారంభమవుతుంది. చియా సీడ్స్ అలోవెరా.. ఈ ఫేస్ ప్యాక్తో చర్మం చియా విత్తనాలతో పాటు కలబందలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ హైడ్రేటింగ్ లక్షణాలను పొందుతుంది. ఒక చెంచా నానబెట్టిన చియా గింజల్లో ఒక చెంచా అలోవెరా జెల్ కలపాలి. అందులో విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా మిక్స్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖం నుండి ముడతలు, గీతలు తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. *నిశ్శబ్ద.
వేసవి ట్యానింగ్ ను మంత్రించినట్టు మాయం చేసే ఫేస్ మాస్క్.. ట్యానింగ్ అమ్మాయిలకు చాలా సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇక వేసవికాలంలో అయితే దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. వేసవి ఎండకు జస్ట్ అలా బయటకు వెళ్లి రాగానే చర్మం రంగు మారిపోయి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు పక్కపక్కనే పెట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్యానింగ్ తొలగిపోయి ముఖం సాధారణ రంగులోకి రావాలన్నా.. ముఖ చర్మం చల్లగా ఉండాలన్నా ఈ కింద చెప్పుకునే మ్యాజికల్ ఫేస్ మాస్క్ చాలా బాగా సహాయపడుతుంది. అదేంటో ఓ లుక్కేస్తే.. గుడ్డు శరీరానికి మంచి పోషణ ఇవ్వడమే కాదు.. సౌందర్య సాధనంగా వాడితే చర్మానికి, జుట్టుకు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. వేసవిలో ఎదురయ్యే ట్యానింగ్, పిగ్మెంటేషన్ కు గుడ్డు బెస్ట్ ఆప్షన్. బంగాళాదుంప ఎగ్ మాస్క్ వేయడం వల్ల ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. ఎగ్, బంగాళాదుంప ఫేస్ మాస్క్.. పచ్చి బంగాళాదుంపను తురమాలి. దీన్ని వడగడితే బంగాళాదుంప రసం వస్తుంది్. ఈ రసాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక గుడ్డును తీసుకుని దాన్ని పగలగొట్టి దాన్నుండి తెల్ల సొన మాత్రమే తీసుకోవాలి. తెల్లసొనను బంగాళాదుంప రసంలో వేసి బ్లెండర్ సహాయంతో బాగా గిలక్కొట్టాలి. ఇది బాగా గిలక్కొట్టాక మెత్తని పేస్ట్ లాగా తెల్లని క్రీమ్ లాగా మారుతుంది. మొదట ముఖాన్ని శుభ్రమైన నీటితో కుడుక్కుని తుడుచుకోవాలి. శుభ్రం చేసుకున్న ముఖం మీద గుడ్డు పేస్ట్ ను ప్యాక్ లాగా వేసుకోవాలి. దీన్ని 20 నిమిషాల పాటూ అలాగే ఉంచి ఆ తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖ చర్మం మెరుస్తుంది. ట్యానింగ్ మంత్రించినట్టు మాయమవుతుంది. *నిశ్శబ్ద.
వేసవి కాలంలో ముఖ సౌందర్యాన్ని చెక్కు చెదరనివ్వని కొరియన్ బ్యూటీ టిప్స్! ఈ మధ్యకాలంలో కొరియన్ అమ్మాయిల అందం వైపు ప్రపంచమంతా దృష్టి సారిస్తోంది. కొరియన్ అమ్మాయిల ముఖం గాజు లాగా మెరిసిపోతూ ఉంటుంది. అలాంటి అందం కోసం రకరకాల ప్రయోగాలు చేసే అమ్మాయిలు ఎందరో ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పుకునే అయిదు బ్యూటీ టిప్స్ ఫాలో అయితే అచ్చం కొరియన్ అమ్మాయిల్లా యవ్వనంగా, మచ్చలేని గాజు లాంటి చర్మం సొంతమవుతుంది. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. డబుల్ క్లెన్సింగ్ .. కొరియన్ చర్మ సంరక్షణలో డబుల్ క్లెన్సింగ్, సున్నితమైన ఎక్స్ఫోలియేషన్ కీ పాయింట్స్. డబుల్ క్లెన్సింగ్ అంటే ముందుగా ఆయిల్ ఆధారిత క్లెన్సర్ని, తర్వాత నీటి ఆధారిత క్లెన్సర్ని ఉపయోగించడం. ఇలా చేయడం ద్వారా మీ చర్మాన్ని పొడిబారకుండా మలినాలను, మేకప్ను, అదనపు నూనెను తీసివేయడం సులువుగా ఉంటుంది. భారతీయుల చర్మం ఎక్కువగా కాలుష్యానికి, నూనె, మలినాలకు గురవుతూ ఉంటుంది. అందుకే ఈ రకమైన చర్మానికి డబుల్ క్లీన్సింగ్ బాగా పనిచేస్తుంది. చర్మాన్ని పొడిగా లేదా చికాకు కలిగించకుండా శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎక్స్ఫోలియేషన్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ని వదిలించుకోవడానికి, చర్మం తాజాగా కనిపించేలా చేయడానికి ముఖ్యమైన దశ. స్కిన్ హైడ్రేషన్.. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం రంగు కావాలంటే చర్మానికి హైడ్రేషన్ కీలకం. తేలికైన, హైడ్రేటింగ్ ఉత్పత్తులైన ఎసెన్స్లు, సీరమ్ల వినియోగం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కొరియన్లు ఉపయోగించే బ్యూటీ ఉత్పత్తులలో సోయాబీన్ పదార్దాలు, బియ్యం నీరు, గెలాక్టోమైసెస్ వంటి పులియబెట్టిన పదార్ధాలు ఉంటాయి. ఇవి మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మం మీద హెవీగా లేకుండా, జిడ్డు కలిగించకుండా లోతుగా చొచ్చుకుపోతాయి. బయో-రీమోడలింగ్, హైడ్రోస్ట్రెచ్ థెరపీ వంటి అధునాతన పద్ధతులు తేమ నిలుపుదలని మరింత మెరుగుపరుస్తాయి. ముఖం మీద గీతలను, ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు.. వాతావరణ కాలుష్యం కారణంగానూ, జీవనశైలి కారణంగానూ ఎదురయ్యే అకాల వృద్ధాప్యం నుండి చర్మాన్ని రక్షించడంలో యాంటీఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. కొరియన్ చర్మ సంరక్షణ ఉత్పత్తులు తరచుగా విటమిన్ సి, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, నియాసినామైడ్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ పదార్థాలు ఫ్రీ రాడికల్స్ను తటస్తం చేయడానికి, మంటను తగ్గించడానికి, చర్మం రంగును ప్రకాశవంతం చేయడానికి సహాయపడతాయి. షీట్ మాస్క్లు.. షీట్ మాస్క్లు కొరియన్ చర్మ సంరక్షణ అలవాట్లలో ఒక ముఖ్యమైన భాగం. హైలురోనిక్ యాసిడ్, కొల్లాజెన్, గ్రీన్ టీ, దోసకాయ, రాయల్ జెల్లీ, బొగ్గు, ముత్యాలు వంటి సహజ పదార్ధాలు ఇందులో ఉపయోగించబడతాయి. షీట్ మాస్కులు ఇన్స్టంట్ అందాన్ని కూడా ఇస్తాయి. లేయరింగ్ పద్ధతులు కొరియన్ బ్యూటీ పద్దతులలో లేయరింగ్ పద్దతి ముఖ్యమైనది. ముందుగా టోనర్లు, ఎసెన్స్లు, సీరమ్లు, క్రీమ్ల వంటి మందమైన తేలికపాటి ఉత్పత్తులను లేయరింగ్ చేయడం ద్వారా చర్మాన్ని యంగ్ గా ఉంచుకోవచ్చు. దీని వల్ల ముఖ చర్మం యవ్వనంగా, డీహైడ్రేట్ కాకుండా తేమతో కూడి ఉంటుంది. *రూపశ్రీ.
అమ్మాయిల ముఖం ఎప్పుడూ కాంతివంతంగా మెరవాలంటే ఈ చిట్కాలు బెస్ట్! అందం కోసం ఆరాటపడని అమ్మాయిలు ఉండరు. ఇందుకోసం ఎన్నెన్నో బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా వాడతారు. కానీ ఇవన్నీ తాత్కాలిక అందాన్ని మాత్రమే ఇస్తాయి. ఈ విషయం గ్రహించిన తరువాత అమ్మాయిలు సహజంగా అందంగా కనిపించడం గురించి చాలా ప్రయోగాలు చేస్తారు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో అమ్మాయిలు ఎండల ధాటికి తొందరగా పువ్వుల్లా ఉన్నవాళ్లు కాస్తా వాడిపోయినట్టు అయిపోతారు. అలా కాకుండా ఉండాలంటే ఈ కింది చిట్కాలు పాటించాల్సిందే.. నీరు తాగాలి.. ప్రతిరోజూ కనీసం 2గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కేవలం వేడి నీరు 2 గ్లాసులు మాత్రమే కాదు.. సాధారణ నీరు కనీసం 4లీటర్ల వరకు తాగాలి. ఎందుకంటే వేసవిలో ఏ చిన్న పని చేసినా, కొద్ది దూరం నడిచినా శరీరంలో తేమ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. గోరువెచ్చని నీరు తాగితే రక్తప్రసరణను మెరుగవుతుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడం ద్వారా ముఖంలో మెరుపు తెస్తుంది. కీరదోసకాయ.. అటు కూరగాయ గానూ, ఇటు స్నాక్ గానూ, సాధారణంగా తినడానికి ఇష్టపడేది కీరదోసకాయ. దోసకాయలలో నీటిశాతం ఎక్కువ. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. లోపలి నుండి శరీరాన్ని చల్లబరిచి చర్మానికి మెరుపు ఇస్తుంది.దోసకాయలో ఉండే సమ్మేళనాలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. స్క్రబ్ వాడాలి.. వేసవి కాలంలో అమ్మాయిలు బయటకు వెళ్లాలంటే భయపడతారు. దీని వెనుక ఉన్న అతిపెద్ద కారణం ట్యానింగ్. చర్మంలో సూర్యుడి ఎండకు బహిర్గతం అయ్యే భాగం అంతా రంగు మారి నల్లగా అవుతుంది. పాదాలు, చేతులు, ముఖం, మెడ ఈ సమస్యకు లోనవుతాయి. అందుకే వేసవిలో స్కిన్ ట్యాన్ తొందరగా వస్తుంది. దీన్ని తొలగించడానికి బియ్యంపిండి, కాఫీ, పంచదార, పెసరపప్పు నూక వంటి పదార్థాలతో స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ట్యాన్ తొలగిపోయి చర్మానికి మెరుపు వస్తుంది. ఇంటి చిట్కాలు.. ముఖం అందంగా కనిపించడానికి ఇంటి చిట్కాలు పాటించడం అమ్మాయిలకు ఎప్పటినుండో ఉన్న అలవాటు. చాలామంది ఇంటినే బ్యూటీ సెలూన్ గా మార్చేస్తుంటారు. ఇంట్లోనే ఆరోగ్యవంతమైన మార్గంలో ముఖాన్ని మెరిపించాలంటే పెసరపప్పు, ముల్తానీ మట్టి, శనగపిండి, పసుపు, పచ్చిపాలు, క్యారెట్, దోసకాయ, టమోటా వంటివి వాడాలి. ఇవి చర్మానికి మంచివి. అలోవెరా.. అలొవెరాను కలబంద అని కూడా అంటాం. తాజా కలబంద అయినా మార్కెట్లో దొరితే జెల్ అయినా బ్యూటీ టిప్స్ లో బాగా ఉపయోగిస్తారు. తాజా కలబంద జెల్ ను ముఖానికి రాసి 10-15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇది చర్మానికి పోషణ ఇస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఆహార జాగ్రత్తలు.. శరీరం హైడ్రేట్ గా ఉండటానికి నీరు అధికంగా ఉన్న పండ్లు, సిట్రస్ పండ్లు, యాంటీ ఏజింగ్ కు దోహదం చేసే పండ్లు, కూరగాయలు, ఆకుకూరరలు తీసుకోవాలి. నూనె ఆహారాలు, బేకింగ్ ఆహారాలు, చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు, శీతలపానీయాలు, స్వీట్లు నివారించాలి. జాగ్రత్తలు.. స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితే ముఖం అందంగా ఉంటుంది. బయట నుండి ఇంటికి రాగానే ముఖం కడుక్కోవడం, బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ ఉపయోగించడం, ముఖ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ముఖానికి రోజ్ వాటర్, మాయిశ్చరైజర్ వంటివి ఉపయోగించడం ఫాలో అవ్వాలి. ఇవన్నీ చేస్తే చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది. *రూపశ్రీ





















