మహిళలు నూడిల్స్ ఎక్కువ తింటే ఇంత డేంజరని తెలుసా..

 


ప్రస్తుత రోజుల్లో భారతీయుల ఆహారపు అలవాట్లలో చాలా  మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రజలు సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు చైనీస్, ఇటాలియన్, మెక్సికన్,  జపనీస్ వంటకాలు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటిలో భారత మార్కెట్లో ఇన్‌స్టంట్ నూడుల్స్  కు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. తయారీ సులభం కావడం కారణంగా పిల్లలు, యువత,  బిజీ జీవనశైలి ఉన్న వ్యక్తులు వీటిని  చాలా ఇష్టపడతారు. కానీ ఇన్‌స్టంట్ నూడుల్స్ అధికంగా తీసుకోవడం వల్ల ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు ఆహారనిపుణులు.  పరిశోధకలు కూడా ఇదే వెల్లడిస్తున్నాయి.

ఇన్‌స్టంట్ నూడుల్స్ మొదట జపాన్,  దక్షిణ కొరియా నుండి వచ్చాయి. కానీ ఇప్పుడు భారత మార్కెట్‌లో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఇన్స్టంట్ నూడిల్స్ లో  పెద్ద పరిమాణంలో  సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు,  ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి.  ఇవి  శరీరంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను తరచుగా తినేవారిలో మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఒక పరిశోధనలో తేలింది.  మెటబాలిక్ సిండ్రోమ్ అనేది గుండె జబ్బులు, మధుమేహం,  స్ట్రోక్ ప్రమాదాన్ని మరింత పెంచే ఆరోగ్య పరిస్థితి.

ఒక వ్యక్తి వారానికి రెండు నుండి మూడు సార్లు ఇన్‌స్టంట్ నూడుల్స్ తీసుకుంటే, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్-2 డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఇన్స్టంట్ నూడిల్స్ ఎక్కువగా తినే వారిలో ఈ కింది సమస్యలు ఎక్కువగా వస్తాయట..

జీర్ణవ్యవస్థపై ప్రభావం..

ఇందులో ఉండే శుద్ధి చేసిన పిండి (మైదా ఆధారిత నూడుల్స్) కడుపులో సులభంగా జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్, ఆమ్లతత్వం,  మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

అధిక రక్తపోటు..

ఇన్స్టంట్ నూడుల్స్‌లో అధిక మొత్తంలో సోడియం (ఉప్పు) ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

బరువు పెరగడం..

ఇన్స్టంట్ నూడిల్స్ లో ఉండే అనారోగ్యకరమైన కొవ్వులు,  ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో అనవసరమైన కొవ్వును పెంచుతాయి, ఇది ఊబకాయానికి దారితీస్తుంది.

పోషకాలు లేకపోవడం..

ఈ ఆహారం రుచికరంగా ఉంటుంది కానీ ఎటువంటి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ లేదా ఖనిజాలు ఉండవు. దీని కారణంగా శరీరానికి సరైన పోషకాహారం లభించదు.

మహిళలకు ఎందుకు ప్రమాదం..

పురుషుల కంటే మహిళలకు ఇన్‌స్టంట్ నూడుల్స్ ఎక్కువ హానికరం కావచ్చని  అద్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో ఉండే ప్రిజర్వేటివ్‌లు,  సోడియం మహిళల హార్మోన్ల సమతుల్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

పీరియడ్స్,  పిసిఒఎస్ సమస్యలు పెరగవచ్చు.

అధిక సోడియం,  అనారోగ్యకరమైన కొవ్వులు ఋతుక్రమ నొప్పి, PCOS వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.

గర్భిణీ స్త్రీలు ఇన్స్టంట్ నూడుల్స్‌కు దూరంగా ఉండాలి, ఎందుకంటే వాటిలో ఉండే రసాయనాలు, ప్రిజర్వేటివ్స్   పిండం అభివృద్ధికి హాని కలిగిస్తాయి.


                             *రూపశ్రీ.