పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం పెడుతున్నారా? ఇది చదవాల్సిందే..


పిల్లలను కనడానికి యువతీయువకులు ఎంత సంతోషిస్తారో వారు పెరిగి పెద్దవుతున్నప్పుడు ఒకవైపు సంతోషం ఉన్నా అంతకు మించి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి పాలు తాగించడం పెద్ద కష్టం కాదు. కానీ పిల్లలు పెరిగే కొద్ది అన్నం తినడానికి  చాలా మారాం చేస్తారు. దీనివల్ల పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడుతుందని భయపడతారు. ఇందుకే పోషకాలను భర్తీ చేయడానికి హెల్త్ డ్రింకులు తాగించడానికి, అన్నం తినిపించడానికి వారిని ఏమారుస్తారు. ఒకప్పుడు కథలు చెబుతూ, భయపెడుతూ అన్నం పెట్టేవారు. కానీ ఇప్పుడు మొబైల్ లో కార్టూన్స్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. అసలు పిల్లలకు మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించవచ్చా?  అలా చేస్తే ఏమవుతుంది?

నేటికాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆహారం పెట్టడానికి ఎన్నుకున్న సులువైన మార్గం మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించడం. పిల్లలకు ఆహారం పెట్టే విషయంలో జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో 90శాతం మంది మొబైల్ లేనిదే ఆహారం తీసుకోవడం లేదు. ఇలా మొబైల్ చూస్తూ ఆహారం తీసుకోవడం అనేది పిల్లలకు ఒక అలవాటుగా మారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

పిల్లలు అయినా, పెద్దలు అయినా మొబైల్ చూస్తూ లేదా టీవి చూస్తూ తింటే ఆహారం రుచి ఫీల్ కాలేరు. పిల్లలకు ఆహారం రుచి తెలియడం చాలా ముఖ్యం. మొబైల్ చూస్తూ తినడం వల్ల అది మిస్ అవుతారు. పైగా పరిధికి మించి తినేస్తారు. దీనివల్ల పిల్లలో ఊబకాయం ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలు మొబైల్ చూస్తూ తినడం వల్ల వారిలో జీవక్రియ మందగిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీకి పిల్లలు దూరం అవుతార. ఎప్పుడూ మొబైల్ చూడటానికే ఇష్టపడతారు.


మొబైల్ చూస్తూ అన్నం తినే పిల్లలు కృత్రిమంగా తయారవుతారు. వారికే తెలియకుండా వారిలో ఒక మానసిక శాడిజం అభివృద్ది చెందుతుంది. అదే ఇతరులను తిట్టడం, కొట్టడం, మొండి చేయడం వంటి పనులలో వ్యక్తం అవుతుంది. తల్లిదండ్రుల మాట అస్సలు వినరు. వారి ప్రవర్తన క్రమశిక్షణ లేని జీవితానికి దారితీస్తుంది. చిన్నతనంలోనే పిల్లలు అంత ఘోరంగా మొబైల్ చూస్తే వారి కళ్లు దెబ్బతింటాయి. చిన్నప్పుడే కళ్లజోడు వాడాల్సి రావడానికి అదొక కారణం.

                                                         *నిశ్శబ్ద.