కోడి రామకృష్ణతో గొడవ.. దాసరితో చెంపదెబ్బ.. బయటపెట్టిన రేలంగి!
on Aug 4, 2021
దర్శకరత్న దాసరి నారాయణరావు స్వగ్రామం పాలకొల్లు. ఆయన శిష్యులుగా పరిశ్రమలోకి వచ్చి, పలు విజయవంతమైన చిత్రాలు తీసిన కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావులది కూడా పాలకొల్లే. అంతే కాదు... వాళ్ళిద్దరూ స్కూల్మేట్స్, క్లాస్మేట్స్ కూడా! ఆరో తరగతి చదివే సమయంలో కోడి రామకృష్ణతో రేలంగి నరసింహారావు గొడవ పడ్డారు. తర్వాత మళ్ళీ దర్శకుడైన తర్వాత కలిశారు. వచ్చే వారం ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన రేలంగి నరసింహారావు ఈ విశేషాలు పంచుకున్నారు.
‘‘కోడి రామకృష్ణ నాకు చిన్ననాటి స్నేహితుడు. అందుకని, నేనే తన ఇంటికి వెళ్ళాను. ‘ఒరేయ్ అబ్బాయ్! జిన్నా వచ్చాడు... జిన్నా వచ్చాడు’ అని ఎంతో సంబరపడ్డాడు. పాలకొల్లులో నన్నంతా రేలంగి జిన్నా అంటారు. నా ముద్దుపేరు అది’’ అని చెప్పుకొచ్చారు రేలంగి నరసింహారావు. అలాగే, రాజేంద్రప్రసాద్ హీరోగా 32 చిత్రాలకు దర్శకత్వం వహించానని, తామిద్దరం భార్యభర్తలం లాంటోళ్ళమని, రాజేంద్రప్రసాద్తో ఎటువంటి గొడవలు లేవన్నారు. హీరో సుమన్ను ‘ఇద్దరు కిలాడీలు’ చిత్రంతో వెండితెరకు తానే పరిచయం చేశానని రేలంగి తెలిపారు.
సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడు, తెలియక ఎంతో పవిత్రంగా భావించే క్లాప్ బోర్ను కిందపెట్టి ఏదో రాసుకుంటుంటే తమ గురువు దాసరి నారాయణరావు వచ్చి ఛెళ్ళున కొట్టిన ఘటనను గుర్తు చేసుకున్నారు రేలంగి. ‘ఎప్పుడూ నా కళ్ల ముందు ఇటువంటి పని చేయకు’ అని దాసరి చెప్పారన్నారు. ఒకానొక సమయంలో కాకాపట్టేవాళ్ళను ముందు పెడుతున్నారని గురువుగారి కాళ్ళకు నమస్కరించి తాను వెళ్ళిపోయానని రేలంగి చెప్పారు. అప్పుడు రెండు కన్నీటి చుక్కలు ఆయన కాళ్ళ మీద పడ్డాయట. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక చూడాలి.