
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 197 లో.. మా అమ్మ ఈ ఇంటికి వచ్చి మామయ్యకి రాఖీ కడుతుందని గాయత్రి చెప్పడంతో ఇంట్లో అందరు షాక్ అవుతారు. నారాయణ అయితే అది ఇక్కడికి వచ్చి నాకు రాఖీ కడుతుందా అని నమ్మలేకపోతాడు. నువ్వు ఎంత బాధపడుతున్నావో అమ్మకి చెప్పాను.. వస్తానంది అని గాయత్రి ధైర్యం చెప్తుంది. చక్రి, కేశవ మధ్య పందెం కూడా జరుగుతుంది. చెప్పింది గాయత్రి కాబట్టి వస్తుందని కేశవ నమ్మకంగా ఉంటాడు. చెల్లి వస్తుందన్న ఆనందంతో నారాయణ ముస్తాబై, మొహంలో కళతో బయటకు వస్తాడు.
ఇంటి ముందు ఆడబిడ్డ వచ్చి ఉంటే కాళ్లు కడుక్కోడానికి నీళ్లు కూడా ఇవ్వరా అంటూ తాయారు ఎంట్రీ ఇస్తుంది. మాధవ నీళ్లు ఇస్తే మీ నాన్న వచ్చి ఇవ్వడా అని కోపంగా అంటుంది. దీంతో నారాయణే వచ్చి నీళ్లు ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తాడు. అందరు హాల్లో కూర్చున్నాక ఈ ఇంటికి కల వచ్చినట్టు ఉందని మహా అంటుంది. తాయారు హారతి పళ్లెం తెప్పించుకుని నారాయణకు రాఖీ కడుతుంది. అందరూ ఫోటోలు తీసుకుంటూ సంతోషంగా స్వీట్లు పంచుకుంటారు. మాధవ, కేశవ, చక్రి డబ్బులు, మహా చీర పెడతారు.
అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది. మీరంతా ఇచ్చారు. నువ్వేం ఇస్తావురా అని నారాయణను తాయారు నిలదీస్తుంది. బంగారం వద్దు.. ఆ పేపర్ల మీద సంతకం పెట్టి నా వాటా నాకు ఇవ్వు..ఈ స్థలంలో కొట్టు పెట్టుకుని బతుకుతానని తన స్వార్థాన్ని బయటపెడుతుంది. దీంతో నారాయణ ఎమోషనల్ అవుతాడు. బుజ్జమ్మా.. దీనస్థితిలో ఉంటే ఆదుకునేవాడిని.. అన్నీ ఉండి ఇలా ఆస్తి కోసం రాఖీ పండుగ బంధాన్ని దిగజార్చకు.. నేను బతికి ఉండగా ఈ ఇంటిని ముక్కలు కానివ్వను.. చచ్చాక కూడా నా ఆత్మ ఈ ఇంటినే కాపాడుతుందని కన్నీళ్లతో చెప్తాడు.
నువ్వు ఆస్తి ఇవ్వవని తెలుసు.. ఇదంతా బొంద మీద పెట్టుకుని వెళ్తావా అని తాయారు తిట్టడంతో.. ఇంకో మాట మాట్లాడితే బాగుండదని గాయత్రి తల్లిని బయటకు లాక్కెళ్లబోతుంది. కోపంతో తాయారు కట్టిన రాఖీని విసిరేస్తాడు నారాయణ. అమ్మ మారిందనుకున్నా ఇలా చేస్తుందనుకోలేదని గాయత్రి క్షమాపణలు చెప్తుంది.మీ చెల్లి కట్టకపోతే ఏంటి మామయ్యా, నేనే ఈ ఇంటి ఆడబిడ్డని అనుకో నేనే నీకు రాఖీ కడతానని కంటతడి పెట్టిస్తుంది. ఆ మాటలకు నారాయణ గుండె కరిగి చేయి పైకెత్తగా గాయత్రి ఆడబిడ్డలా మారి మామయ్యకు రాఖీ కడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






