ఆ సినిమా వల్ల చాలా బాధపడ్డా! కొన్ని రోజులు బయటకు రాలేదు!!
on May 15, 2021
బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'జబర్దస్త్' షోతో ఫేమస్ అయిన ఈ భామ ఈరోజు 36వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. తన కెరీర్ లో ఓ సినిమా కారణంగా ఎంతో బాధపడ్డానని.. కొన్ని రోజులు బయటకు కూడా రాలేకపోయానని చెబుతోంది. 2013లో ఎన్టీఆర్ నటించిన 'నాగ' సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది అనసూయ.
దాదాపు పదమూడేళ్ల తరువాత ఆమె నాగార్జున సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన'లో ఆయన మరదలి పాత్రలో మెరిసింది. ఆ వెంటనే 'క్షణం' సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. ఇక ఆ తరువాత ఐటెం సాంగ్స్ అని, గెస్ట్ రోల్స్ అని బిజీగా గడిపింది. 'రంగస్థలం' సినిమాలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'ఖిలాడి', 'రంగమార్తాండ' అనే సినిమాలున్నాయి. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ 'కథనం' సినిమా కారణంగా ఎంతో బాధ పడ్డానని చెప్పింది.
'క్షణం' సినిమా తరువాత 'కథనం' సినిమాలో ప్రధాన పాత్ర పోషించానని.. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా కోసం టీమ్ మొత్తం చాలా కష్టపడిందని.. కానీ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయిందని చెప్పింది. దాంతో ఎంతో బాధపడ్డానని.. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోయానని వెల్లడించింది. తనకు ఎప్పుడైనా ఎక్కువ బాధగా అనిపిస్తే ఆరోజు రాత్రి నిద్రపోయే ముందు వైన్ తాగి.. ఆ బాధనంతటిని భర్త ముందు వెళ్లగక్కుకుని ప్రశాంతంగా నిద్రపోతానని చెప్పుకొచ్చింది అనసూయ.